వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 92వ వ్యవస్థాపక దినోత్సవం
వ్యవసాయ ప్రగతిలో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించిన కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్
కాంట్రాక్ట్ వ్యవసాయం ఫలతాలు చిన్న రైతులకు
చేరేలా చూడాలని సూచన
దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, ఆరోగ్యకరమైన
ఆహారోత్పత్తిని పెంచాలని పిలుపు
Posted On:
16 JUL 2020 7:02PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్) ఈ రోజు 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా,..వ్యవసాయ శాస్త్రవేత్తల కృషిని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి కారణంగానే, గత 9దశాబ్దాల్లో దేశ వ్యవసాయ రంగానికి ఐ.సి.ఎ.ఆర్. ఎంతో దోహదపడ గలిగిందని మంత్రి అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధన, రైతుల కష్టం కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి మిగులు స్థాయికి చేరిందని తోమర్ అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ రూపంలో ఇబ్బంది ఎదురైనా, రికార్డు స్థాయిలో పంటదిగుబడి సాధించిన రైతులోకానికి మంత్రి అభినందనలు తెలిపారు. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆర్థిక సాధికారత సాధించి, తమ పంటలకు గిట్టుబాటు ధరలు పొందేందుకు వీలు కలిగిస్తూ ప్రధాని చట్టచపరమైన సవరణలు, ఆర్డినెన్సులు ప్రకటించారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయం ప్రయోజనాలు చిన్న రైతులకు చేరేలా ఐ.సి.ఎ.ఆర్., కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు తగిన కృషి చేయాలని ఆయన సూచించారు.
పూసా సంస్థగా పేరు పొందిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.ఎ.ఆర్.ఐ.) తన పదవ దశాబ్దిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని తోమర్ విజ్ఞప్తి చేశారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తిని పెంచాల్సి ఉందని, పప్పు ధాన్యాలు, నూనెగింజల దిగుబడిని కూడా పెంచాల్సి ఉందని అన్నారు. పరిశోధన, సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా పామాయిల్ ఉత్పత్తిని కూడా పెంచాలని అన్నారు. నూనెగింజల కొత్త వంగడాలను రూపొందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పప్పు ధాన్యాల దిగుబడిలో దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించినట్టే, నూనె గింజల ఉత్పత్తిలో సాధించాలని, అప్పుడే వంటనూనెలను దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుందని మంత్రి సూచించారు.
ఐ.సి.ఎ.ఆర్. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 8 కొత్త ఉత్పాదనలను, 10 ప్రచురణలను ఆవిష్కరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాలా, ఐ.సి.ఎ.ఆర్. డైరెక్టర్ జనరల్ కైలాస్ చౌధరి, ఐ.సి.ఎ.ఆర్. సభ్యుడు త్రిలోచన్ మహాపాత్ర, ఇతర శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి-ఐ.సి.ఎ.ఆర్. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. కేంద్ర వ్యవసాయం, రైతుసంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో, వ్యవసాయ విద్య, పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. 1929వ సంవత్సరం జూలై 16వ తేదీన 1860వ సంవత్సరపు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఐ.సి.ఎ.ఆర్. ఏర్పాటైంది. వ్యవసాయ విద్య, పరిశోధన అంశాలను అజమాయిషీ చేసేందుకు, వ్యవసాయ పరిశోధనా కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు కేంద్ర సంస్థగా ఐ.సి.ఎ.ఆర్.ను స్థాపించారు. దేశంలో సాగుచేసే ఉద్యానవన పంటలు, చేపల పెంపకంతో పాటు జంతు శాస్త్రాల పరిశోధనను కూడా ఈ సంస్థ అజమాయిషీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 102 ఐ.సి.ఎ.ఆర్.సంస్థలు, 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో ఈ వ్యవసాయ పరిశధనా మండలి ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ స్థాయి వ్యవసాయ వ్యవస్థగా రూపుదిద్దుకుంది.
దేశంలో హరిత విప్లవం, ఆ తర్వాత వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న పరిణామాల్లో పరిశోధనా, సాంకేతిప పరిజ్ఞాన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఐ.సి.ఎ.ఆర్. ఎంతో కీలకపాత్ర పోషించింది. జాతీయ ఆహార భద్రత, పోషకాహార భద్రతపై ఐ.సి.ఎ.ఆర్. ఎంతో ప్రస్ఫుటమైన ప్రభావం చూపింది. వ్యవసాయ రంగంలో ఉన్నత స్థాయి విద్యా బోధనను ప్రోత్సహించడంలో కూడా ఐ.సి.ఎ.ఆర్. ప్రధానపాత్ర పోషించింది.
వ్యవసాయ పరిశోధనా సంస్థలను, శాస్త్రవేత్తలను, టీచర్లను, రైతులను, వ్యవసాయ జర్నలిస్టుల ప్రతిభా విశేషాలను ఐ.సి.ఎ.ఆర్. ప్రతి సంవత్సరం గుర్తిస్తూ, వారికి పురస్కారాలను అందజేస్తూ వస్తోంది.
ఈ సంవత్సరం,..20 కేటగిరీలలో దాదాపు 160మందిని పురస్కారాలకు ఎంపిక చేసింది. పురస్కారాలకు మూడు సంస్థలు ఎంపికయ్యాయి. అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకానికి చెందిన ఇద్దరు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన 14మంది ప్రతినిధులు, 94మంది శాస్త్రవేత్తలు, 31మంది రైతులు, ఆరుగురు జర్నలిస్టులు, ఐ.సి.ఎ.ఆర్. పరిధిలోని వివిధ సంస్థలకు చెందిన 10మంది సిబ్బంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైన 141మందిలో 19 మంది మహిళలు ఉండటం అభినందనీయం.
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల కేటగిరీలో పంటా నగర్.కు చెందిన గోవింద్ వల్లభ్ పంత్ వ్యవసాయ, సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం ఉత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది. విద్యా బోధన, పరిశోధన, విస్తరణ, సృజనాత్మకత వంటి అంశాలకు గుర్తింపుగా ఈ వర్సిటీని ఎంపిక చేశారు. ఐ.సి.ఎ.ఆర్. అనుబంధంగా ముంబైలో ఉన్న కేంద్ర కాటన్ టెక్నాలజీ పరిశోధనా సంస్థ చిన్న సంస్థల్లో ఉత్తమమైన ఐ.సి.ఎ.ఆర్. సంస్థగా ఎంపికైంది.
హైదరాబాద్ లోని అఖిల భారత జొన్న పంట సమన్వయ పరిశోధనా ప్రాజెక్టు, లూధియానాలోని అఖిల భారత మొక్కజొన్న పంట పరిశోధనా ప్రాజెక్టులకు 2019వ సంవత్సరానికి గాను చౌధరీ దేవీలాల్ ఆలిండియా అవుట్ స్టాండింగ్ కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టు అవార్డు ఉమ్మడిగా లభించింది. కృషి విజ్ఞాన కేంద్రాలకు జాతీయ స్థాయిలో ఇచ్చే, దీనదయాళ్ ఉపాధ్యాయ కృషి విజ్ఞాన పురస్కారం.. మధ్యప్రదేశ్ లోని దాతియా కృషి విజ్ఞాన కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ లోని వెంకట రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రానికి ఉమ్మడిగా లభించింది. ప్రతిభావంతమైన రీతిలో విస్తరణ కార్యకలాపాలు, రైతులకు అందుబాటులో ఉండే కార్యకలాపాలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఆ సంస్థలను ఎంపిక చేశారు.
వ్యవసాయ జర్నలిజంలో ప్రతిభకు గుర్తింపుగా, వివిధ పత్రికలకు చెందిన నలుగురు జర్నలిస్టులకు, ఎలెక్ట్రానిక్ మీడియాకు చెందిన ఇద్దరికి 2019వ సంవత్సరపు చౌధరీ చరణ్ సింగ్ అవార్డు లభించింది.
పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాకోసం లింక్
****
(Release ID: 1639212)
Visitor Counter : 590