పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

'రండి.. భార‌త్‌లో ఆవిష్క‌ర‌ణలు చేయండి'- ప్ర‌వాస భార‌తీయ విద్యార్థుల‌కు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

Posted On: 12 JUL 2020 11:42AM by PIB Hyderabad

 

ప్ర‌పంచంలోని వివిధ అగ్రశ్రేణి విశ్వ‌విద్యాలయాలో విద్య‌న‌భ్య‌సిస్తున్న ప్ర‌వాస భారతీయ విద్యార్థులు స్వ‌దేశానికి వ‌చ్చి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల్ని చేపట్టాల‌ని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు, ఉక్కు శాఖల‌ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. 'భారత్‌లో చివరి మైలు వ‌ర‌కు దాగిఉన్న శక్తిని అందిపుచ్చుకోవ‌డం..' అనే అంశంపై ఆయ‌న నిన్న విదేశాల‌లోని యువ భారతీయ పండితులు, విద్యార్థులు మరియు స్నేహితుల బృందంతో సంభాషించారు. ఈ దూర దృశ్య శ్ర‌వ‌ణ‌పు స‌మావేశాన్ని (ఈ-మీట్‌) ప్రిన్స్‌ట‌న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లీడ్ ఇండియా గ్రూపు మ‌రియు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన 'థింక్ ఇండియా పర్డ్యూ, డెవలప్ ఎంపవర్ అండ్‌ సినర్జైజ్ ఇండియా గ్రూపు'ల‌ వారు ఏర్పాటు చేశారు.
అయిదు కీలకమైన అంశాలతో ముందుకు..


ఈ సంద‌ర్భంగా భార‌త దేశపు ఇంధ‌న భ‌విష్య‌త్తు దృష్టికోణాన్ని మంత్రి వారికి వివ‌రించారు. "గౌరవనీయ ప్రధాన మంత్రి మోడీ భారతదేశ ఇంధన భవిష్యత్తు కోసం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను తీర్చిదిద్దారు. ఇందులో ఇంధన లభ్యత మరియు అందరికీ అందుబాటులో ఉండే అయిదు కీలకమైన అంశాలు ఉన్నాయి. దీని ప్ర‌కారం దేశంలోని అంద‌రికీ ఇంధ‌న ల‌భ్య‌త మ‌రియు ప్రాప్య‌తను క‌ల్పించ‌డం,
దేశంలోని నిరుపేద‌ల‌కు కూడా ఇంధనాన్ని అందిపుచ్చుకొనే స్థోమత‌, ఇంధ‌న వినియోగంలో సామ‌ర్థ్యం పెంపు, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి శక్తి స్థిరత్వం ప్రపంచ అనిశ్చితులను తగ్గించడానికి.. బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరుడిగా మెల‌గ‌డం, ప్రపంచ అనిశ్చితులను తగ్గించడానికి ఇంధ‌న‌ భ‌ద్ర‌త వంటి అంశాలు ఉన్నాయి”.
98 శాతం గృహాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు..
ప్రధాన్ మంత్రి ఉజ్జ్వ‌ల‌ యోజన గురించి మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ “మేము 2016 సంవ‌త్స‌రంలో ప్రధాన మంత్రి ఉజ్జ్వ‌ల యోజన (పీఎంయూవై) పథకాన్ని ప్రవేశపెట్టాము. 80 మిలియన్ల పేద గృహాల వారికి ఉచితంగా ఎల్‌పీజీ వంట గ్యాస్ కనెక్షన్‌లను అందించడం దీని లక్ష్యం. నిర్ధారిత షెడ్యూల్ కంటే ముందే 80 మిలియన్ల ఎల్‌పీజీ గ్యాస్ క‌నెక్ష‌న్ల‌ను అందించే లక్ష్యాన్ని అందుకోగ‌ల‌మ‌ని మీకు తెలియజేయడం సంతోషంగా ఉంది. దీంతో భారతదేశంలో దాదాపు 98 శాతం గృహాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. 2014 సంవత్సరంలో ఇది కేవలం 56% మాత్రమే.”
ఇంధ‌న దిగుమ‌తులు త‌గ్గించుకొనే దిశ‌గా అడుగులు..
చమురు మరియు గ్యాస్ రంగంలో స్వావలంబన గురించి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ “2022 నాటికి ఇంధన దిగుమతుల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని 10 శాతం మేర తగ్గించాలని పీఎం మోడీ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విషయమై దేశీయంగా చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి మరియు దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక కొత్త విధానాలతో పాటు పరిపాలనా చర్యలు తీసుకుంది.” భారతదేశం యొక్క ఇంధన దౌత్యం గురించి మంత్రి మాట్లాడుతూ “ప్రపంచ శక్తి పటంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంది. పీఎం మోడీ నాయకత్వంలో భారతదేశం సహేతుకమైన మరియు సరసమైన ఇంధన ధర కోసం డిమాండ్ చేసే దేశాల గొంతుక‌ల‌కు నాయకత్వం వహిస్తోంది. ప్రపంచ ఇంధ‌న చర్చలలో ఒపెక్, ఐఈఏ, ఐఈఎఫ్‌తో పాటుగా అన్ని ఇతర ప్రధాన ఇంధ‌న‌ సంస్థ‌ల‌తో క‌లిసి సాగుతున్నాము. ఇంధ‌నపు సరఫరా వనరుల యొక్క వైవిధ్యీకరణ విధానం ప్రకారం అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, యుఏఈ మరియు అన్ని ప్రధాన ఇంధన ఉత్పత్తిదారులతో భారత్ క‌లిసి ప‌ని చేస్తోంది.”
గ్యాస్-ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశ‌గా..
గ్యాస్-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప‌రివ‌ర్త‌నం చెందుతుండ‌డం గురించి మంత్రి మాట్లాడుతూ, “కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆసియాలో గ్యాస్ డిమాండ్ పెరుగుదల యొక్క ప్రాథ‌మిక చోద‌క‌శ‌క్తుల‌లో భారతదేశం ఒకటిగా అవతరించింది. నేడు, భారతదేశ ఇంధ‌న మేళ‌వింపులో సహజ వాయువు వాటా 6.3 శాతంగా ఉంది. 2030 నాటికి సహజ వాయువు వాటాను 15 శాతానికి పెంచాలని మేము ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఏర్ప‌రుచుకున్నాము.”
265 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ..
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి గురించి శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ, “మేము ఇప్పుడు
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ప్ర‌స్థానం మ‌ధ్య‌లో ఉన్నాము.. మ‌న జీవితాల ప్ర‌థ‌మిక అంచ‌నాల్ని ఇది స‌వాలు చేస్తోంది. మ‌హమ్మారి ప్ర‌భావంతో త‌క్ష‌ణం
మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్థ మంద‌గించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. నిత్య విధానాల నుంచి కొంత విరామానికి, పునరాలోచన చేయ‌డానికి మరియు తిరిగి వాటిని త‌గు విధంగా రూపకల్పన చేయడానికి ఇది ఒక‌ అవకాశాన్ని అందించింది. మహమ్మారి సమయంలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విష‌యమై మంత్రి ప్ర‌ధాన్ మాట్లాడుతూ కోవిడ్ -19 మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ప్రధానమంత్రి మోడీ 265 బిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు - ఇది భారత దేశ జీడీపీలో 10 శాతానికి స‌మానం. కోవిడ్ -19 విసిరిన సవాళ్లను అవకాశంగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఒక స్వావలంబన భారత్‌ మరియు 21 వ శతాబ్దంలో ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మార్చే విధంగా ప‌లు ప్రధానమైన సంస్కరణలు ప్రకటించబడ్డాయి. ఈ సంస్కరణలలో ఇంధ‌న మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌
ఇందులో ఒక అంతర్భాగం.”

***



(Release ID: 1638144) Visitor Counter : 180