నీతి ఆయోగ్

ఎంపిక చేసిన 29 అంతర్జాతీయ సూచికల పనితీరును పర్యవేక్షించడానికి ఆన్ లైన్ లో వర్క్ షాప్ నిర్వహించిన - నీతీ ఆయోగ్.

Posted On: 10 JUL 2020 8:11PM by PIB Hyderabad

దేశంలో సంస్కరణలు మరియు వృద్ధిని పెంపొందించడానికి గాను, ఎంపిక చేసిన 29 అంతర్జాతీయ సూచికల పనితీరును పర్యవేక్షించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షతన 47 కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలతో నీతీ ఆయోగ్ ఈ రోజు ఆన్ లైన్ లో ఒక వర్క్‌ షాప్ ను నిర్వహించింది.  వాటాదారుల సంప్రదింపుల పద్దతి;  ప్రచురణ మరియు సర్వే / డేటా ఏజెన్సీలతో ఒప్పందం;  రాష్ట్రాల  ర్యాంకింగ్స్ కోసం ఫ్రేమ్ వర్క్;  సమాచార భాగస్వామ్యం కోసం వేదిక;  పర్యవేక్షణ యంత్రాంగం;  మొదలైన అంశాలపై ఈ వర్క్‌ షాప్ ‌లో సుదీర్ఘంగా చర్చించారు. 

క్యాబినెట్ కార్యదర్శి ఈ వర్క్ షాప్ ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పర్యవేక్షణ ప్రక్రియ కేవలం ర్యాంకింగ్స్ ‌ను మెరుగుపరచడానికి మాత్రమే కాక, వ్యవస్థలను మెరుగుపరచదానికీ, పెట్టుబడులను ఆకర్షించడానికీ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ అవగాహనను పెంపొందించడంతో పాటు, సంస్కరణలను పెంచడానికని, పేర్కొన్నారు. భారతదేశ పౌరుల సేవా కార్యక్రమాల పరివర్తన మెరుగుదలను ఈ పర్యవేక్షణ ప్రక్రియ ప్రేరేపిస్తుందని, ఆయన చెప్పారు. 

నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్లోబల్ సూచికల పర్యవేక్షణకు సంబంధించి నీతీ ఆయోగ్, ఎన్.‌ఐ.సి, డి.పి.ఐ.ఐ.టి, ఎమ్.ఓ.ఎస్.పి.ఐ. తో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వివిధ నేపథ్య కార్యకలాపాల గురించి ఈ సదస్సులో పాల్గొన్నవారికి వివరించారు. సంస్కరణలను రేకెత్తించే విధంగా ఈ సూచికల పనితీరును మెరుగుపరచడం కోసం,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రచురణ సంస్థలు, పౌర సమాజాల సంస్థల మధ్య సన్నిహిత మరియు నిరంతర సమన్వయాన్ని నెలకొల్పవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సూచికల ద్వారా వివిధ ముఖ్యమైన సామాజిక, ఆర్థిక మరియు ఇతర నిర్ణయాత్మక విషయాలపై భారతదేశ పనితీరును కొలవడం మరియు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా భావించబడింది.  ప్రభుత్వ పథకాల అమలును మెరుగుపరుస్తూ, ఈ సూచికలను స్వీయ-అభివృద్ధికి సాధనంగా ఉపయోగించడం మరియు విధానాలలో సంస్కరణలను తీసుకురావడం ఈ ప్రక్రియ యొక్క లక్ష్యం.  అదే సమయంలో, భారతదేశం యొక్క ఖచ్చితమైన విధానాన్ని ప్రపంచానికి అందించడం కూడా అంతే ముఖ్యం.  పరిశ్రమాభివృధి మరియు అంతర్గత వాణిజ్య పురోభివృద్ధి శాఖ భారీ ఎత్తున ప్రారంభించిన సంస్కరణలు మరియు సులభతర వాణిజ్యంలో భారత దేశ మెరుగుదల (2020 నివేదికలో భారతదేశం 63వ స్థానానికి పెరిగింది) వంటివి ఈ ప్రక్రియను ముందుకు నడిపించడానికి అండగా ఉన్నట్లు భావించడం జరిగింది.   

19 అంతర్జాతీయ సంస్థలు ప్రచురించిన 29 అంతర్జాతీయ సూచికలను భారత ప్రభుత్వంలోని 18 నోడల్ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు కేటాయించారు.

ఈ అన్ని సూచికల పనితీరు మరియు పురోగతిని పర్యవేక్షించడంలో నీతీ ఆయోగ్ సహాయం చేస్తుంది. ప్రచురణ సంస్థలతో వారి ఒప్పందానికి సహాయం చేస్తుంది.  గుర్తించిన ముఖ్య నిర్ణయాత్మక విషయాలను సంబంధిత మంత్రిత్వ శాఖ / విభాగం పర్యవేక్షిస్తుంది, సంస్కరణ మరియు పురోగతి సాధించబడిందని నిర్ధారిస్తుంది. ఖచ్చితమైన మరియు ప్రాతినిధ్య నివేదికను నిర్ధారించడానికి సమాచార ప్రచురణ సంస్థలతో  మంత్రిత్వ శాఖ / విభాగం సమన్వయం చేస్తుంది.  ఈ ప్రక్రియను నిర్వహించడానికీ, పర్యవేక్షించడానికీ, సూచికల పర్యవేక్షణ కేంద్రాలను ఇప్పటికే చాలా మంత్రిత్వ శాఖలలో ఏర్పాటు చేయడం జరిగింది.   ఈ కార్యక్రమ నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  మరియు పౌర సమాజ సంస్థల మధ్య సన్నిహిత సమన్వయం చాలా అవసరం.

మొత్తం 29 అంతర్జాతీయ సూచికల కోసం ఒకే, సమాచార డాష్‌ బోర్డు తయారు చేయబడుతోంది.  ఈ డాష్ బోర్డు అధికారిక సమాచారం మరియు ప్రచురణ సంస్థలు ఉపయోగించే సమాచారం ఆధారం ప్రకారం ముఖ్య నిర్ణయాత్మక విషయాలను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది.  సంస్కరణలతో సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును పర్యవేక్షించడానికి కూడా ఇది దోహదపడుతుంది.

క్యాబినెట్ కార్యదర్శి చివరిగా మాట్లాడుతూ,  దేశం యొక్క ఖచ్చితమైన పరిస్థితిని తెలియజేయడానికి ప్రచురణ సంస్థలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  సులభతర వ్యాపారం సూచికలో  భారత ర్యాంకింగ్ మెరుగుదలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.  మొత్తం ప్రక్రియకు నాయకత్వం వహించడానికి అన్ని నోడల్ మంత్రిత్వ శాఖలలో పి.ఎం.యు. లను  ఏర్పాటు చేయడం గురించి ఆయన మాట్లాడారు.

 

*****



(Release ID: 1637895) Visitor Counter : 177