పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

గంగ, దాని ఉపనదుల్లో కాలుష్య పర్యవేక్షణను మరింత బలోపేతం చేయనున్న కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు

Posted On: 09 JUL 2020 7:20PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌, జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో దిల్లీలో ఆ రెండు శాఖల సమావేశం జరిగింది. రెండు శాఖల సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

    కేంద్ర జల కమిషన్‌, జాతీయ జలాభివృద్ధి ఏజెన్సీ, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన-ఏఐబీపీకి చెందిన జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పర్యావరణ/అటవీ అంశాల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.

 

    భారీ స్థాయిలో కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్రమల్లో రోజువారీ తనిఖీలు జరుగుతున్నందున, గంగానది, దాని ప్రధాన ఉపనదుల్లో కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయమని 'కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు'ను జలశక్తి మంత్రి షెకావత్‌ అభ్యర్థించారు. 'స్వచ్ఛ గంగ జాతీయ మిషన్‌'తో కలిసి, నీటి నాణ్యతను క్షుణ్నంగా పరిశీలించాలని కోరారు. దీనికి సంబంధించి సరైన యంత్రాంగం ఏర్పాటుకు సమావేశంలో అంగీకారం కుదిరింది.

    సరైన విధానాల ద్వారా, జాతీయ ప్రాముఖ్యత గల ముఖ్యమైన నదీ ప్రాజెక్టుల ఆమోదాలను వేగవంతం చేయాలని రెండు మంత్రిత్వ శాఖల అధికారులను శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌ కోరారు. గంగ, దాని ప్రధాన ఉపనదుల్లో నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. "ప్రాజెక్ట్ టైగర్", "ప్రాజెక్ట్ ఎలిఫెంట్" తరహాలోనే, గంగా డాల్ఫిన్ల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడానికి.. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు శ్రీ జావడేకర్‌ ఈ సమావేశంలో వెల్లడించారు.
 


(Release ID: 1637730)