హోం మంత్రిత్వ శాఖ

పద్మ పురస్కారాలు-2021 నామినేషన్లకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు గడువు

Posted On: 02 JUL 2020 1:15PM by PIB Hyderabad

వచ్చే ఏడాది (2021) గణతంత్ర దినోత్సవం రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాలకు ఆన్‌లైన్‌ నామినేషన్లు లేదా సిఫారసులను ఈ ఏడాది మే 1 నుంచి ప్రారంభించారు. నామినేషన్లకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు గడువుంది. నామినేషన్లు లేదా సిఫారసులను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే, పద్మ పురస్కారాల పోర్టల్‌ https://padmaawards.gov.in ద్వారా స్వీకరిస్తారు.

                పద్మ విభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పేర్లతో ఇచ్చే పద్మ పురస్కారాలు, పౌరులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలు.

1954లో పురస్కారాలను ప్రారంభించారు. ఏటా గణతంత్ర దినోత్సవం నాడు గ్రహీతల పేర్లు ప్రకటిస్తారు. కళ, సాహిత్యం&విద్య, క్రీడలు, ఔషధాలు, సామాజిక సేవ, విజ్ఞానం&ఇంజినీరింగ్, ప్రజా కార్యక్రమాలు, ప్రజాసేవ, వాణిజ్యం&పరిశ్రమలు వంటి రంగాల్లో సాధించిన అసాధారణ విజయాలు లేదా సేవలకు గుర్తింపుగా పద్మ పురస్కారాలను అందజేస్తారు. జాతి, వృత్తి, హోదా, లింగ బేధం లేకుండా అవార్డులు ప్రకటిస్తారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప మిగిలిన సిబ్బంది ఈ పురస్కారాలకు అనర్హులు. స్వయం నామినేషన్లు సహా ప్రముఖులను నామినేట్‌ లేదా సిఫారసు చేయాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.

                పద్మ పోర్టల్‌ అందుబాటులో ఉన్న నిర్ణీత నమూనా ప్రకారం నామినేషన్లు లేదా సిఫారసులు ఉండాలి. నామినేట్‌ లేదా సిఫారసు చేస్తున్న వ్యక్తి, సంబంధింత రంగంలో సాధించిన విజయాలు లేదా సేవల గురించి 800 పదాలకు మించకుండా స్పష్టంగా రాయాలి.

                సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న అర్హులైన మహిళలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు వంటి ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రయత్నాలు చేయమని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారతరత్న, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీతలు, అత్యున్నత సంస్థలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది.

                హోంమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ www.mha.gov.in లో 'అవార్డ్స్‌ అండ్‌ మెడల్స్‌' శీర్షిక కింద మిగిలిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. పురస్కారాలకు సంబంధించిన విధానాలు, నియమాలను వెబ్‌సైట్‌ లింక్‌ https://padmaawards.gov.in/AboutAwards.aspx లో చూడవచ్చు.

 

****

 



(Release ID: 1635964) Visitor Counter : 322