ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ వివక్ష మీద పోరులో ఒడిశా ఆశా కార్యకర్తలు


స్థానిక చైతన్యంలో 46,000 మందికి పైగా ఆశా కార్యకర్తల కీలకపాత్ర

Posted On: 02 JUL 2020 12:18PM by PIB Hyderabad

ఒడిశాలోని ఖుర్దా జిల్లా కందలై గ్రామంలో మంజు జీనా ఒక ఆశా కార్యకర్త. కోవిడ్ సంబంధ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటూ వచ్చింది. స్థానిక ప్రజలకు నిత్యావసరాలు, వైద్య సేవలు అందించటంలో ఆమె అవిశ్రాంతంగా కృషిచేసింది. అక్కడి ప్రజలతో మమేకమవుతూ ఏళ్ళ తరబడి ఆమె సంపాదించుకున్న పరిచయాలే అక్కడి ప్రజలతో మాట్లాడి కోవిడ్ బాధిత్ల పట్ల వివక్ష తగదని ఒప్పించటంలో సాయం చేసింది. ఒక వలస కార్మికుడు ఊరికి తిరిగొచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు అతణ్ణి రానివ్వలేదు. దీంతో అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మార్చటానికి ఆమె ఒంటరి పోరాటం చేసింది. ప్రజలలో అవగాహన పెంచింది. ఆ వలస కార్మికుడు ఇంట్లోనే క్వారంటైన్ కావటానికి వీలుందని నచ్చజెప్పింది. క్వారంటైన్ కాలంలో అతడి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఆరోగ్య అవసరాలు తీరుస్తూ ముందుకు నడిపింది.

లాక్ దౌన్ కాలంలో అందరికీ నిత్యావసరకులు అందటానికి, ఇతర వైద్య సేవలు అందటానికి ఆమె నిరంతరం శ్రమించింది. అనేకమంది గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవానికి వీలుగా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంది. కేవలం తన విధుల నిర్వహణకే పరిమితం కాకుండా మాస్కులు స్వయంగా కుట్టి ఆ నిరుపేదల గ్రామంలో ఇంటిటికీ తిరిగి పంచిపెట్టింది.

ఒడిశాలోని 46,627 మంది ఆశా కార్యకర్తలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కోవిడ్ మీద పోరులో విజయవంతమైన పాత్ర నిర్వహించారు. స్థానికుల ఆరోగ్య అవసరాలు తీర్చారు. గ్రామాల్లోని గావోం కల్యాణ్ సమితులు, పట్టణ ప్రాంతాల్లోని మహిళా ఆరోగ్య సమితులతో కలిసి పనిచేశారు. వాళ్ళ అవసరం ఎక్కడున్నా ప్రత్యక్షమయ్యారు. కోవిడ్ నివారణ కోసం బహిరంగ ప్రదేశాలలో మాస్కుల వాడకం, తరచూ చేతులు కడుక్కోవటం, భౌతిక దూరం పాటించటం, కోవిడ్ లక్షణాలు గుర్తించటం లాంటి విషయాలమీద ప్రజలకు అవగాహన పెంచటంలో వాళ్ళ కృషి అనన్య సామాన్యం.

ప్రజలలో అవగాహన కలిగించే దిశలో కోవిడ్ కు సంబంధించిన కరపత్రాల పంపిణీ, పోస్టర్ల ప్రచారం, గ్రామాలలో గోడలమీద రాతలవంటి పనుల్లోనూ ఆశా కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించారు.

 

****



(Release ID: 1635924) Visitor Counter : 226