రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

తాల్చెర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్రగతిపై సమీక్షించిన శ్రీ గౌడ

Posted On: 23 JUN 2020 5:22PM by PIB Hyderabad

         తాల్చెర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎండి శ్రీ ఎస్.ఎన్. యాదవ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎస్. గవాడే తో జరిగిన సమావేశంలో రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డివి సదానంద గౌడ తాల్చెర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టిఎఫ్ఎల్) పురోగతిని తెలుసుకున్నారు.

 

           తాల్చెర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఒడిశాలోని తాల్చెర్ వద్ద సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల యూరియా యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది గెయిల్, సీఐఎల్, ఆర్సిఎఫ్, ఎఫ్సిఐఎల్ తో జాయింట్ వెంచర్ కంపెనీ (జెవిసి). ఇది పూర్తయితే యూరియా ఉత్పత్తికి బొగ్గు గ్యాసిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం భారతదేశంలో ఇదే మొదటిది అవుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 13,270 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం వల్ల దిగుమతి చేసుకున్న యూరియాపై భారతదేశం ఆధారపడటం తగ్గుతుంది, అలాగే వందలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు.

           కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రాజెక్ట్ పురోగతి ప్రాజెక్ట్ అమలు సమయంలో ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళ గురించి సమావేశంలో ఎండి శ్రీ ఎస్.ఎన్. యాదవ్ వివరించారు. మే నుంచి పనులు ప్రారంభమయ్యాయని, వేగవంతం చేశామని చెప్పారు. ప్రయాణ ఆంక్షలు, కార్మికుల కొరత వంటి సమస్యల కారణంగా ఈ రోజు నాటికి ఈ ప్రాజెక్ట్ ఆరు నెలల ఆలస్యం అయింది. అయితే నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు

             కోవిడ్ పరిస్థితి ప్రస్తుతం ప్రాజెక్టు అమలును ఆలస్యం చేసి ఉండవచ్చని అయితే, భవిష్యత్తులో పనులు వేగవంతం చేయడం ద్వారా ప్రస్తుత ఆలస్యాన్ని భర్తీ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలని మంత్రి అన్నారు. తద్వారా ఈ ప్రాజెక్ట్ గడువులోగా అంటే 2023 సెప్టెంబర్ లోగా ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. టిఎఫ్ఎల్ ను ప్రారంభం అయిన తరువాత, రామగుండం, గోరఖ్పూర్, బరౌని, సింద్రీలలో ఇతర నాలుగు పునరుజ్జీవన ప్రాజెక్టులతో కలిపి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ప్రధానమంత్రి దార్శనికత సాకారమవుతుందని మంత్రి తెలిపారు.

 

*****



(Release ID: 1633748) Visitor Counter : 179