శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శా స్త్ర & సాంకేతిక శాఖ ప్రాంగణం నుంచి సూర్య గ్రహణాన్ని తిలకించిన పిల్లలు, మహిళలు, శాస్త్రవేత్తలు మరియు ఉద్యోగులు
శాస్త్ర & సాంకేతిక శాఖ భవనం ఆవరణలో విజ్ఞాన్ ప్రసార్ సహకారంతో జాతీయ శాస్త్ర & సాంకేతిక సమాచార మండలి (ఎన్ సి ఎస్ టి సి), శాస్త్ర & సాంకేతిక శాఖ (డి ఎస్ టి) కలసి సౌర తెర అమర్చిన కళ్లజోళ్ల సహాయంతో నేరుగా సూర్య గ్రహణం చూసే ఏర్పాట్లు చేశారు
Posted On:
21 JUN 2020 5:55PM by PIB Hyderabad
శాస్త్ర & సాంకేతిక శాఖ తమ భవనం ఆవరణలో విజ్ఞాన్ ప్రసార్ సహకారంతో జాతీయ శాస్త్ర & సాంకేతిక సమాచార మండలి (ఎన్ సి ఎస్ టి సి), శాస్త్ర & సాంకేతిక శాఖ (డి ఎస్ టి) కలసి సౌర తెర అమర్చిన కళ్లజోళ్ల సహాయంతో ఆదివారం 21 జూన్ నాడు నేరుగా సూర్య గ్రహణం చూసే ఏర్పాట్లు చేశారు. గ్రహణాన్ని చూసిన పిల్లలు, మహిళలు, శాస్త్రవేత్తలు మరియు ఉద్యోగులు అనిర్వచనీయమైన ఆనందానికి, ఉద్వేగానికి లోనయ్యారు. వెలుగు నీడల మధ్య సూర్యుని దోబూచులాట, గ్రహణం ఏర్పడటం, జ్వాలా వలయం అది కూడా నేరుగా చూడటం వారికి ఎనలేని ఆశ్చర్యాన్ని, విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది.

ఎన్ సి ఎస్ టి సి మరియు విజ్ఞాన్ ప్రసార సంస్థలు ప్రత్యేకంగా తయారు చేసిన సులోచనాలను గ్రహణాన్ని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. గ్రహణాన్ని గురించి వీక్షకులకు అర్ధమయ్యే విధంగా వివరించారు. మైలార్ ఫిలిం ఉపయోగించి గ్రహణం ఫోటోలను తీశారు.
ఢిల్లీలో ఈ రోజు సూర్యగ్రహణం ఉదయం 10:19:58 నుంచి కనిపించడం ప్రారంభమై మధ్యాహ్నం 01:48:40 వరకు కొనసాగింది. మిట్ట మధ్యాహ్నం 12:01:40 కు గ్రహణం గరిష్టంగా కనిపించింది. ఢిల్లీలో ఆదివారం మబ్బులేమీ లేకుండా ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల
ఢిల్లీ వాసులు మొత్తం పాక్షిక సూర్య గ్రహణం ఉదంతం ఆద్యంతం ఢిల్లీ వాసులు ఆసక్తితో తిలకించారు. జ్వాలా వలయంగా పిలిచే కంకణ గ్రహణం రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ తో సహా దేశంలోని కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో కూడా కనిపించింది. ఇతర ప్రాంతాల వారు గ్రహణాన్ని పాక్షికంగా చూడగలిగారు. ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో పగటి పూట ఎక్కువ సమయం ఉండే రోజు కూడా జూన్ 21వ తేదీ కూడా కావడం కాకతాళీయంగా జరిగినప్పటికీ ఈ ఖగోళ ఘటనను సులభంగా చూసే వీలు కలిగింది.
ఇటువంటి అరుదైన సూర్య గ్రహణం ఉత్తరాయణం మొదటి రోజున సంభవించడం కూడా విశేషం. గ్రహణం అది సూర్య గ్రహణమైనా, చంద్ర గ్రహణమైనా శాస్త్రజ్ఞులకు వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, అధ్యయనాలు జరపడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. గ్రహణం వంటి మహత్తర ఖగోళ ఘటన వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని గురించి తెలియజెప్పే ఛాన్స్ శాస్త్ర సందేశాలు, సమాచారం వ్యాప్తి చేసే వారికి లభిస్తుంది. అంతేకాక గ్రహణాలు గురించిన కల్పితాలు, మూఢ విశ్వాసాలు తొలగించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది.


1980 ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇప్పటి పరిస్థితి నాటి పరిస్థితికి పూర్తిగా భిన్నం. నాడు గ్రహణం వల్ల దుష్ప్రభావం తమపై పడుతుందేమో అని గడప దాటి బయటకు రాకుండా ఇళ్ల లోనే ఉండిపోయారు. ఎవరో కొద్దీ మంది శాస్త్రీయ ఔత్సహికులు మినహా జనం ఎవరూ బయటికి రాలేదు. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. తెలియని భయంతో స్కూళ్ళు , మార్కెట్లు, ఇతర సంస్థలు మూసి ఉంచారు. ఆ తరువాత 1995 అక్టోబర్ 24వ తేదీన సంభవించిన గ్రహణాన్ని గురించి ముంచు నుంచే ఎన్ సి ఎస్ టి సి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. పిల్లలు, టీచర్లు, శాస్త్రీయ సమాచారం వ్యాప్తి చేసే సంస్థలు, శాస్త్రజ్ఞులు మరియు జన బాహుళ్యంలోని సామాన్య పౌరులకు మైలార్ ఫిలిం సులోచనాలతో సురక్షితంగా గ్రహణం చూడటాన్ని గురించి తెలియజెప్పింది.
ఆ తరువాత వచ్చిన గ్రహణాలప్పుడు పరిస్థితిలో మార్పు కనిపించడం మొదలైంది. కలసికట్టుగా చేసిన ప్రయత్నాల వల్ల ప్రజల మైండ్ సెట్ మారింది. ఆ విధంగా ఈ సారి నేరుగా సూర్య గ్రహణం చూడాలనే ఆసక్తితో జనం బయటికి వచ్చారు. ముందు జాగ్రత్తలు, భౌతిక దూరం పాటిస్తూనే ఆ ఖగోళ ఘటనను నేరుగా చూసిన అనుభూతిని పొందారు. శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నైనితాల్ కు చెందిన ఆర్యభట్ట పరిశోధనా సంస్థ , బెంగళూరుకు చెందిన భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర సంస్థ మరియు విజ్ఞాన్ ప్రసార్ వంటి పలు స్వతంత్ర సంస్థలు వివిధ ప్రాంతాల నుంచి గ్రహణం చిత్రాలను, వీడియోలను చిత్రించి జూమ్, యూ ట్యూబ్ మరియు ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.
*******
(Release ID: 1633249)