ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా డాక్టర్ హర్ష్ వర్ధన్ ఎన్నిక

"ఆర్థిక పనితీరు మరియు మానవ సామర్థ్యాలను పెంచడానికి ఆరోగ్యం ప్రధానమైనది"

ప్రజారోగ్య బాధ్యతలకు సమర్థవంతంగా, ప్రభావవంతంగా ప్రతిస్పందించేల పని చేసేందుకు నేను కట్టుబడి ఉన్నాను: డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 22 MAY 2020 5:39PM by PIB Hyderabad

2020-21 సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఎన్నికయ్యారు. ఇది ఈ రోజు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ యొక్క 147 వ సెషన్లో జరిగింది, వర్చ్యువల్ గా జరిగిన సమావేశంలో జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో డాక్టర్ హర్ష్ వర్ధన్ నియమితులయ్యారు. 

బాధ్యతలు స్వీకరిస్తూ, ముందుగా డాక్టర్ హర్ష్ వర్ధన్ కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళి అర్పించారు. మహమ్మారితో పోరాడుతూ ముందు వరుసలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర యోధులు  వారి గౌరవానికి, దృఢ నిశ్చయానికి, అంకితభావానికి అందరం కృతజ్ఞతాభినందనలు తెలియజేయాలని  ప్రముఖులందరినీ ఆయన అభ్యర్థించారు.

“మీ అందరి నమ్మకం, విశ్వాసం నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ గౌరవం మాకు లభించినందుకు నా దేశ ప్రజలందరూ కూడా విశేషంగా భావిస్తున్నారు” అని ఆయన అన్నారు. ఇది తీవ్రమైన మానవ విషాదం అని అంగీకరించి, రాబోయే రెండు దశాబ్దాలు ఇలాంటి అనేక సవాళ్లను ఇంకా చూడాల్సి రావచ్చని ఆయన అన్నారు, “ఈ సవాళ్లన్నీ భాగస్వామ్య ప్రతిస్పందనను కోరుతున్నాయి, ఎందుకంటే ఇది అందరికీ ఆందోళన కలిగించే అంశం, దీనికి భాగస్వామ్య బాధ్యత అవసరం.” అని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. "మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బలోపేతం మరియు సంసిద్ధతను విస్మరించడం వల్ల కలిగే పరిణామాల గురించి మహమ్మారి మానవాళికి గుణపాఠం నేర్పింది. ప్రపంచ సంక్షోభ సమయాల్లో, రిస్క్ మేనేజ్‌మెంట్, ఉపశమనం రెండూ ప్రపంచ ప్రజారోగ్యంలో ఆసక్తి, పెట్టుబడులను తిరిగి శక్తివంతం చేయడానికి ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసి ఉంటుంది. ” అని ఆయన తెలిపారు. 

డాక్టర్ హర్ష్ వర్ధన్ కోవిడ్-19ని ఎదుర్కోవడంలో భారతదేశ అనుభవాన్ని కూడా పంచుకున్నారు. "మాకు 3 శాతం మరణాలు మాత్రమే ఉన్నాయి. 1.35 బిలియన్ల దేశంలో, కోవిడ్-19 కేసులు 0.1 మిలియన్లు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటు 40 శాతానికి మించి, రెట్టింపు రేటు 13 రోజులు. ” అని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కొత్త చైర్మన్ అయిన డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. శతాబ్దాలుగా మానవాళిని పీడిస్తున్న వ్యాధుల విషయంలో అధిక కట్టుబాట్ల అవసరాన్ని నొక్కిచెప్పారు.

జాతి, మతం, రాజకీయ నమ్మకం, ఆర్థిక లేదా సామాజిక స్థితి అనే భేదం లేకుండా ప్రతి మానవుడి ప్రాథమిక హక్కులలో అత్యున్నత ఆరోగ్యాన్ని పొందడమే ఆనందం అనే సూత్రాన్ని డబ్ల్యూహెచ్ఓ విశ్వసిస్తుందని డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. "ఆర్థిక పనితీరు, మానవ సామర్థ్యాలను పెంచడానికి ఆరోగ్యం ప్రధానమని నేను నమ్ముతున్నాను. ప్రజారోగ్య విధానం ప్రకృతిపై సరైన అవగాహనపై ఆధారపడి ఉండాలి, మార్గనిర్దేశం చేయాలి. సంపూర్ణ ఆరోగ్యం భారతీయ సాంప్రదాయ వైద్య విధానాల అంతర్లీన సూత్రం” అని ఆయన అన్నారు. దార్శనికత గల తమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయుష్మాన్ భరత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాలు దేశ వైద్య విధానానికి చాల కీలకంగా మారాయని డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పారు. 

డబ్ల్యూహెచ్ఓతో దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తుచేస్తూ, పోలియోకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో డబ్ల్యూహెచ్ఓ బలమైన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. " డబ్ల్యూహెచ్ఓలోని స్నేహితుల నైతిక మద్దతు, ధైర్యం ఉండి ఉండకపోతే, తాము ఇంత పెద్ద ప్రయత్నంలో సఫలీకృతం అయి ఉండేవారం కాదని డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు.

డాక్టర్ హర్ష్ వర్ధన్ డబ్ల్యూహెచ్ఓ కి చెందిన పలు ప్రతిష్టాత్మక కమిటీలలో స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (సేజ్) పోలియో నిర్మూలనపై గ్లోబల్ టెక్నికల్ కన్సల్టేటివ్ గ్రూప్ (టిసిజి) లో సభ్యుడిగా ఉన్నారు. డబ్ల్యుహెచ్ఓ సలహాదారుగా కూడా పనిచేశారు. డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మూడేళ్ల కాలానికి ఎన్నుకోబడిన 34 సాంకేతికంగా అర్హత కలిగిన సభ్యులతో కూడి ఉంటుంది. ఆరోగ్య అసెంబ్లీ నిర్ణయాలు, విధానాలను అమలు చేయడం దాని పనికి సలహా ఇవ్వడం, సులభతరం చేయడం బోర్డు ప్రధాన విధులు.

***



(Release ID: 1626229) Visitor Counter : 276