ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రత్యేక వార్డులలో, సంసర్గనిషేధం(క్వారెంటైన్) కేంద్రాలలో ఉన్న కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోవడానికి డాక్టర్ హర్ష వర్ధన్ కరోనా వైరస్ ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖల మంత్రులకు ఫోన్ చేశారు.

మేదాంత మరియు సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్న కొందరు రోగులతో కేంద్ర మంత్రి స్వయంగా మాట్లాడారు. తమకు లభిస్తున్న చికిత్స, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సంరక్షణ సేవల పట్ల వారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. రోగులందరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Posted On: 10 MAR 2020 8:16PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు డిల్లీ, హర్యానా, కేరళ, తెలంగాణ, కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు,  కేంద్రపాలిత ప్రాంతాలు లద్దాక్ మరియు జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లకు ఫోన్ చేసి రాష్ట్రంలోని ఆసుపత్రులలోని కోవిడ్ -19  ప్రత్యేక వార్డులలో, సంసర్గనిషేధం(క్వారెంటైన్) కేంద్రాలలో ఉన్న రోగుల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.

దేశంలో కోవిడ్ -19 పరిస్థితిని గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని తన కార్యాలయం నుంచి  పర్యవేక్షించిన డాక్టర్ హర్షవర్ధన్ వీడియో కాల్ చేసి కొందరు రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ఐసోలేషన్ వార్డులలో తమకు లభిస్తున్న చికిత్స పట్ల వారు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.  నిజానికి తాను ఆసుపత్రిని సందర్శించాలని అనుకొన్నానని,  అయితే తన రాకవల్ల చికిత్సా ఏర్పాట్లకు అంతరాయం కలుగుతుందని ఆసుపత్రి అధికారులు చెప్పినందువల్ల రాలేకపోయాయనని మంత్రి రోగులకు తెలిపారు. చికిత్స సంతృప్తికరంగా ఉందని, తాము వేగంగా కోలుకున్తున్నామని రోగులు మంత్రికి తెలిపారు.  సమయోచితంగా సహాయం అందజేస్తున్నందుకు వారు ప్రభుత్వాన్ని అభినందించారు.  గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తరపున,  తన తరపున రోగులకు ఆయన హోలీ శుభాకాంక్షలు కూడా అందజేశారు.

డిల్లి ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యేంద్ర జైన్,  హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అనిల్ విజ్, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ బి. శ్రీరాములు,  రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రఘు శర్మ, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజేష్ తోపే,  పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ బి. ఎస్. సిద్దు, ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జయ ప్రతాప్ సింగ్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు శ్రీ ఆర్.కె.మాథుర్ (లద్దాక్) మరియు శ్రీ జి.సి. ముర్ము (జమ్మూ & కాశ్మీర్) లకు ఫోన్ చేసి రోగుల ఆరోగ్య పరిస్థితిని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకున్నారు. రోగులు కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తెలిపారు.

        రాష్ట్రాలు చెపతీన చర్యలను అభినందిస్తూ, రోగులకు తగిన  చికిత్స అందించడానికి, వ్యాధి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవడం,  మాస్కులు ఇతర సామగ్రి పంపడంలో రాష్ట్రాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.  మున్ముందు కోవిడ్ -19 వ్యాపించకుండా నిశిత పర్యవేక్షణ జరపాలని,  నిఘా వేసి ఉండాలని ఆయన రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను  కోరారు.  అత్యవసర పరిస్థితిలో కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని  ఆయన తెలిపారు.

 

 



(Release ID: 1607115) Visitor Counter : 177