మంత్రిమండలి
జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) ప్రగతి, ఎన్హెచ్ఎం సారథ్య బృందంతోపాటు కార్యక్రమ సాధికార కమిటీ నిర్ణయాలగురించి కేంద్ర మంత్రిమండలికి వివరణ
Posted On:
02 JAN 2019 6:00PM by PIB Hyderabad
జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) ప్రగతి, సరికొత్త చర్యలు, ఎన్హెచ్ఎం సారథ్య బృందంతోపాటు కార్యక్రమ సాధికార కమిటీ నిర్ణయాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలికి అధికారవర్గాలు వివరించాయి.
ముఖ్యాంశాలు:
గడచిన ఐదేళ్లతోపాటు 2017-18లో జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద సాధించిన లక్ష్యాలు ఇలా ఉన్నాయి:-
1. ప్రసవ సమయంలో మాతృ మరణాలు 2010-12 మధ్య 178 కాగా, ఈ నిష్పత్తి 2014-16 మధ్య 2.7 శాతం తగ్గి 130కి దిగివచ్చింది;
2. శిశు మరణాల నిష్పత్తి 2011లో 44 కాగా, 2016లో 34కు దిగివచ్చింది. ఈ మేరకు 2015-2018 మధ్య వార్షిక తగ్గుదల 8.1 శాతంగా నమోదైంది;
3. ఐదేళ్లలోపు బాలల మరణాల సంఖ్య 2011లో 55 కాగా, 2016నాటికి 39కి దిగివచ్చింది. ఈ మేరకు 2015-16 మధ్య వార్షిక తగ్గుదల 9.3 శాతంగా నమోదైంది;
4. సంతాన సాఫల్య నిష్పత్తి 2011లో 2.3 శాతం కాగా, 2016నాటికి 2.3 శాతం స్థాయికి దిగివచ్చింది. ఈ మేరకు 2011-16 మధ్య వార్షిక తగ్గుదల 1.7 శాతంగా నమోదైనట్లు అంచనా;
అంతేకాకుండా వివిధ వ్యాధుల సంబంధిత ఆరోగ్య సూచీలు కూడా మెరుపడి కిందివిధంగా నమోదయ్యాయి:-
i. మలేరియాకు సంబంధించి వార్షిక పరాన్న జీవుల ఉనికి 2011లో 1.10 కాగా, 2016లో 0.84కు దిగివచ్చింది. అలాగే 2017లో పరాన్నజీవుల ఉనికి 30 శాతానికిపైగా తగ్గటమేగాక మలేరియా సంబంధిత మరణాలు 70 శాతందాకా తగ్గిపోయాయి;
ii. క్షయ (TB) వ్యాధి ఉనికి 2013లో లక్ష జనాభాకు 234 కాగా, 2017నాటికి 204కు తగ్గిపోయింది. అలాగే 2016లో లక్ష జనాభాకు 211గా నమోదైతే, 2017కల్లా 204కు తగ్గింది. అంతేకాకుండా క్షయ సంబంధిత మరణాలు 2016లో లక్ష జనాభాకు 32 కాగా, 2017కల్లా 21కి తగ్గిపోయాయి;
iii. కుష్ఠువ్యాధి పీడితుల సంఖ్యను లక్ష జనాభాకు 1కన్నా తక్కువ ఉంచాలన్న జాతీయ లక్ష్యం నెరవేరింది. ఈ మేరకు దేశంలో కుష్ఠువ్యాధి నిర్మూలన లక్ష్యం సాధించిన జిల్లాల సంఖ్య 2017లో 554 కాగా, 2018 మార్చికల్లా 571కి పెరిగింది;
iv. దేశంలోని అన్ని సమితులలో విషజ్వరం పీడితుల సంఖ్యను 10000 జనాభాకు 1కన్నా తక్కువగా ఉంచాలన్న లక్ష్యం నేపథ్యంలో 2016లో 10వేల జనాభాకు 94గా ఉన్న వ్యాధిపీడిత కేసుల సంఖ్య 2017కల్లా 72 స్థాయికి తగ్గింది.
v. పొగాకు వినియోగ సంబంధ వ్యాధుల సంఖ్యను తగ్గించే దిశగా వివిధ కేన్సర్లు, మధుమేహం, పక్షవాతం, గుండెజబ్బులవంటి 4 ప్రధాన అసాంక్రమిక వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల నియంత్రణ లక్ష్యం నెరవేరింది. ఈ మేరకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో 2009-10లో 34.6 శాతంగా నమోదైన పొగాకు వినియోగం 2016-17కల్లా 28.6 శాతానికి దిగివచ్చి సగటున 6 శాతం పాయింట్ల మేర లక్ష్యం నెరవేరింది.
****
(Release ID: 1558300)
Visitor Counter : 280