వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మూలానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పత్రాలను సులభతరం చేసేందుకు మొదటి అదనపు ప్రోటోకాల్పై సంతకం చేసిన భారత్, మెర్కోసూర్
భారతదేశం - మెర్కోసూర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం కింద కాగిత రహిత వాణిజ్యానికి, కస్టమ్స్ విధానాల ఆధునికీకరణకు ఉద్దేశించిన ప్రోటోకాల్
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 4:31PM by PIB Hyderabad
భారతదేశం, మెర్కోసూర్ దేశాల మధ్య కాగిత రహిత వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, కస్టమ్స్ విధానాలను ఆధునికీకరించడానికి ఉద్దేశించిన భారత్-మెర్కోసూర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందపు (పీటీఏ) మొదటి అదనపు ప్రోటోకాల్పై సంతకాలు జరిగాయి.
ఈ ప్రోటోకాల్పై కేంద్ర ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్, ఉరుగ్వే రాయబారి శ్రీ అల్బెర్టో గువానీ, పరాగ్వే రాయబారి శ్రీ ఫ్లెమింగ్ రౌల్ దువార్తే రామోస్ సంతకం చేశారు. మెర్కోసూర్ తాత్కాలిక అధ్యక్ష హోదాలో ఉన్న ఉరుగ్వే విదేశాంగ మంత్రి శ్రీ మారియో లుబెట్కిన్తో పాటు అర్జెంటీనా, బ్రెజిల్ రాయబార కార్యాలయాల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
2004 జనవరి 25న సంతకాలు అయిన భారత్-మెర్కోసూర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం 2009 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారత్ 450 టారిఫ్ లైన్లపై, మెర్కోసూర్ 452 టారిఫ్ లైన్లపై ప్రాధాన్య సుంకాల రాయితీలను అందిస్తున్నాయి.
ఈ మొదటి అదనపు ప్రోటోకాల్ ఒప్పందంలోని అనుబంధం-IIIలోని (మూలానికి సంబంధించిన నిబంధనలు) ఆర్టికల్ 16ను సవరిస్తుంది. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ రూపంలో జారీ అయిన మూలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్) పేపర్ రూపంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలతో సమానమైన చట్టబద్ధత, విలువను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత దేశాల దేశీయ చట్టాలకు అనుగుణంగా అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థలు, అధికారులు ఎలక్ట్రానిక్గా సంతకం చేసి జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రోటోకాల్ డిజిటల్, కాగిత రహిత వాణిజ్య పత్రాల వైపు మారడాన్ని సులభతరం చేస్తుందని.. మూలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జారీ, ధ్రువీకరణతో ముడిపడి ఉన్న లావాదేవీ ఖర్చులు, సమయాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. అలాగే ప్రస్తుత భారత్-మెర్కోసూర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం కింద ప్రాధాన్య వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
భారత్-మెర్కోసూర్ పీటీఏ సంయుక్త పరిపాలనా కమిటీలో జరిగిన చర్చలను అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 నవంబర్ 27న జరిగిన నాలుగో సమావేశంలో మూలానికి సంబంధించిన డిజిటల్ ధ్రువీకరణ పత్రాల వాడకాన్ని సులభతరం చేసే ఒప్పందాన్ని అప్డేట్ చేసేందుకు ఇరుపక్షాలు మద్దతు తెలిపాయి. తదనంతరం 2026 ఏప్రిల్ 9న జరిగిన సంయుక్త పరిపాలనా కమిటీ ఐదో సమావేశంలో పరస్పర అంగీకారంతో అదనపు ప్రోటోకాల్ ప్రతిపాదనను ఆమోదించారు.
భారత్, మెర్కోసూర్ దేశాలు తమ అంతర్గత ప్రక్రియలను పూర్తి చేసి ఆ సమాచారాన్ని ఒకరికొకరు తెలియజేసిన తర్వాత ఈ ప్రోటోకాల్ అమలోకి వస్తుంది.
ఈ మొదటి అదనపు ప్రోటోకాల్పై సంతకం చేయడం ద్వారా వాణిజ్య సౌలభ్యాన్ని పెంచడం, ఆధునిక కస్టమ్స్ పద్ధతులను అవలంబించడం, ద్వైపాక్షిక వాణిజ్యానికి మద్దతు ఇచ్చే సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై భారత్, మెర్కోసూర్ దేశాల నిబద్ధత స్పష్టమవుతోంది.
భారత్, మెర్కోసూర్ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, విస్తరించడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో ఈ సంతకం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2310206)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6