వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రతిపాదిత విత్తన చట్టంపై దేశవ్యాప్తంగా ఉన్న రైతు నేతలతో శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ చర్చలు
సాగుకు సంబంధించిన ప్రతి విధానాన్నీ రైతులతో చర్చలు, సంప్రదింపుల తరువాతే నిర్ణయించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
1966 నాటి చట్టం ఈ కాలపు సవాళ్లను పరిష్కరించలేదు
చట్ట పరిధికి వెలుపల 70 శాతం విత్తనాలు
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
రైతుల హక్కులకు పూర్తి రక్షణ
సాంప్రదాయిక విత్తనాలతో పాటు రైతులు రూపొందించిన విత్తన రకాలపై ఆంక్షలుండవు: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
నకిలీ విత్తనాల వాణిజ్యాన్ని అరికట్టడానికి భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా విధించే ప్రతిపాదనలు: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
తప్పనిసరిగా పేర్ల నమోదు ప్రక్రియ, క్యూఆర్ కోడ్స్ ద్వారా విత్తనాల రాకపోకల క్రమబద్ధీకరణ...: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
కొత్త విత్తనాలను తరచుగా విడుదల చేసేందుకు రాష్ట్రాలకు అధికారాలు: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
రైతులకు 15 రోజుల లోపల పరిహారం..
ప్రతి రాష్ట్రంలో ‘విత్తన భద్రతా నిధి’ ప్రతిపాదన: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 8:55PM by PIB Hyderabad
నకిలీ, నాసిరకం విత్తనాల వలలో చిక్కుకోకుండా రైతులను రక్షించడానికి ఒక బలమైన విత్తన చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీ.. కృషి భవన్లో ఈ రోజు సంప్రదింపులు జరిపారు. ఈ సంప్రదింపుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ప్రతిపాదిత చట్టం విషయమై సూచనలు చేశారు. సుమారు 20 రైతు సంఘాలు తమ ఆలోచనలను వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ కార్యదర్శి శ్రీ ఆతిశ్ చంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సంప్రదింపుల్లో భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన వివిధ వర్గాలు, ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేసీసీ), కిసాన్ మహాపంచాయత్, భారతీయ కృషక్ సమాజ్, గావ్ కిసాన్ ఉన్నయన్, సొసైటీ ఫర్ ఇండిపెండెంట్ ఫార్మర్స్ అసోసియేషన్ (ఎస్ఐఎఫ్ఏ), కర్ణాటక రాజ్య రైత సంఘ, తెలంగాణ రైతు సంఘం, మహారాష్ట్రకు చెందిన షేత్కారీ సంస్థలు, గుజరాత్కు చెందిన ఖేదుత్ సమాజ్, తమిళనాడుకు చెందిన వివసాయిగళ్ సంగమ్, జార్ఖండ్కు చెందిన ప్రగతిశీల్ కృషి మంచ్, కేరళ.. కొట్టాయంకు చెందిన ఒక రైతుల సంస్థ, తదితర సంఘాలు ఉన్నాయి.
ప్రస్తుత 1966 చట్టానికి సవరణలు అవసరం
ఇప్పుడున్న విత్తన చట్టాన్ని 1966లో రూపొందించారనీ, విత్తన నియంత్రణ ఉత్తర్వును 1983లో అమల్లోకి తీసుకువచ్చినట్లు శ్రీ చౌహాన్ తెలిపారు. గత ఆరు దశాబ్దాల్లో వ్యవసాయంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయనీ, నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాల అమ్మకం, జవాబుదారుతనం లోపించడం వంటి సరికొత్త సవాళ్లను ప్రస్తుత చట్టం పరిష్కరించ జాలదనీ ఆయన అన్నారు. ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ సందర్భంగా కొత్త విత్తనాలు, పురుగుమందుల అవసరాన్ని రైతులు చాటిచెప్పారని ఆయన గుర్తుచేశారు. విత్తన చట్టం ముసాయిదా పై సూచనలను, సలహాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం 2025 నవంబరు, డిసెంబరులలో కోరగా రైతులు, రైతు సంఘాల వద్ద నుంచి దాదాపు 18,000 సూచనలు అందాయన్నారు. రైతులతో కలిసి పనిచేసే సంస్థల వద్ద నుంచి నేరుగా సూచనలను అందుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. చట్టాన్ని ఖరారు చేయడానికి తొందర పడబోరనీ, ఎలాంటి తుది గడువునూ అనుకోలేదనీ శ్రీ చౌహాన్ చెప్పారు. ప్రభుత్వం ముందుకు పోయే లోపు రైతులు, రైతు సంఘాలు, ఇతర ఆసక్తిదారు వర్గాల నుంచి సూచనలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు.
చట్ట పరిధికి వెలుపలే 70 శాతం విత్తనాలు
విత్తనాల్లో 70 శాతం వరకూ ప్రస్తుత విత్తనాల చట్టం పరిధికి వెలుపల ఉన్నాయని, విత్తనాలకు సంబంధించిన ప్రక్రియలు రాష్ట్రం వారీగా వేర్వేరుగా ఉన్నాయనీ, ఇప్పుడున్న శిక్షాత్మక నిబంధనలు సరిపోవడంలేదనీ శ్రీ చౌహాన్ వివరించారు. ఈ నేపథ్యంలో నకిలీ, అప్రామాణిక విత్తనాలకు వ్యతిరేకంగా బలమైన, ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండే, ఒకే విధమైన నియంత్రణతో కూడిన ప్రాథమిక ప్రణాళికను తీసుకురావడానికి ఒక కొత్త చట్టాన్ని రూపొందించవలసి ఉందని ఆయన అన్నారు.
రైతుల సాంప్రదాయిక విత్తన హక్కుల పరిరక్షణ
ప్రతిపాదిత చట్టం రైతులకు ఇప్పుడున్న హక్కులను పరిమితం చేయబోదని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తమ సాంప్రదాయిక, దేశవాళీ రకం విత్తనాలను ఉపయోగించడం, ఇచ్చి పుచ్చుకోవడం, విక్రయించడంలో ఇదివరకటి మాదిరి స్వతంత్రులుగానే ఉంటారని ఆయన తెలిపారు. సాంప్రదాయిక విత్తనాలకు నమోదు తప్పనిసరి కాదన్నారు. రైతులు కోరుకుంటే తమ విత్తన రకాలకు నమోదు చేయొచ్చని ఆయన తెలిపారు. సొంత వినియోగం, గ్రామాల్లో పంపిణీ, లేదా ఏదైనా కంపెనీ కోసం విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులు ఈ నిబంధనల్లో భాగంగా డిజిటల్ నమోదు చేయించాల్సిన పని లేదన్నారు.
తీవ్ర నేరాలకు రూ.30 లక్షల వరకూ జరిమానా, అదనంగా జైలు శిక్ష
ప్రతిపాదిత చట్టం నేరాలను మూడు శ్రేణులుగా వర్గీకరిస్తుంది:
అల్ప అతిక్రమణలు: మొదటి సారి నేరానికి పాల్పడితే హెచ్చరిక చేస్తారు. రెండో సారి నేరం చేస్తే రూ.50,000 వరకు జరిమానాను విధిస్తారు.
ఉద్దేశపూర్వక అతిక్రమణలు: ఒక క్యూఆర్ కోడ్ను అంటించకపోతే, అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోతే, లేదా తప్పుడు బ్రాండింగుకు ఒడిగట్టడం వంటి నేరాలకు తొలి ఉల్లంఘనకు రూ.1 లక్ష, మలి ఉల్లంఘనకు రూ.2 లక్షల జరిమానాను విధిస్తారు.
తీవ్ర నేరాలు: ఈ కేటగిరీలో నకిలీ విత్తనాల అమ్మకం, నమోదు చేసుకోకుండానే వాణిజ్యాన్ని నిర్వహించడం లేదా కావాలనే మోసానికి పాల్పడడం వంటి నేరాలకు జైలు శిక్షతో పాటు రూ.30 లక్షల వరకు జరిమానాను విధిస్తారు.
చట్టవిరుద్ధ విత్తన వ్యాపారాన్ని నిరోధించేందుకు ఈ కఠిన నియమ నిబంధనలు ఉపయోగపడతాయని శ్రీ చౌహాన్ అన్నారు.
100 శాతం నమోదు, క్యూఆర్-ఆధారిత ట్రేసబులిటీ
ప్రతిపాదిత చట్టంలో భాగంగా - అన్ని రకాల విత్తనాలనీ, వ్యవసాయ సామగ్రినీ జాతీయ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయించాల్సి ఉంటుంది. విత్తనాలను నమోదు చేయకపోడాన్ని చట్టవిరుద్ధంగా భావిస్తారు. బహిరంగ మార్కెట్లో విక్రయించడం కూడా నేరమే అవుతుంది. ప్రతి ఒక్క విత్తన ప్యాకెట్టుకూ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనివల్ల రైతులు మూలాన్ని, తయారీదారునీ, ప్రయోగశాల అనుమతినీ, సరఫరా మార్గానికి సంబంధించిన సమాచారాన్నీ తెలుసుకోగలుగుతారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయిన సందర్భంలో బాధ్యులను గుర్తించడం కష్టమవుతోంది. నకిలీల నివారణను కొత్త చట్టం అరికడుతుంది. నేరగాళ్లను గుర్తించే దిశగా పటిష్ఠ వ్యవస్థను ఏర్పరుస్తుంది.
కొత్త రకాలను విడుదల చేయడానికి రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు
రాష్ట్ర స్థాయి సంఘాల సిఫార్సు చేసిన మీదట కొత్త విత్తన రకాలను విడుదల చేసే అధికారాలను ప్రతిపాదిత చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. జాతీయ ప్రమాణాలు కూడా అమల్లో ఉంటాయి. స్థానిక వాతావరణం, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరింత ప్రభావవంతమైన రకాలను రాష్ట్రాలు విడుదల చేయగలుగుతాయి. అన్ని రకాల విత్తనాల జాబితాను ఆన్ లైనులో నమోదు చేస్తారు. ఈ జాబితా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉంటుంది.
‘విత్తన భద్రత నిధి’.. 15 రోజుల్లోపల పరిహారం
రైతుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని... రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఒక విత్తన భద్రతా నిధిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. జరిమానాలు, విత్తన చట్టం ప్రకారం వసూలు చేసిన నగదును ఈ నిధుల్లో జమ చేస్తారు. విత్తనం విఫలమైనా, రైతు నష్టపోయినా సమీక్షాసంఘం 15 రోజుల లోపల పరిహారం అందేటట్లు చూస్తుంది. రైతులకు వినియోగదారు పరిరక్షణ చట్టం కింద పరిహారాన్ని కోరే హక్కు కూడా ఉంటుంది.
ఇక ముందూ రైతులతో సంప్రదింపులు
అనుభవాలను పంచుకోవడంతో పాటు సలహాలు ఇచ్చినందుకు శ్రీ చౌహాన్... రైతు సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రైతు సంఘాలు అందించిన సూచనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఆచరణీయ సూచనలను తుది ముసాయిదాలో చేర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను ప్రధానంగా లెక్కలోకి తీసుకొని, వారితో సంప్రదింపులు, చర్చలు జరుపుతూ విధానాలను ఖరారు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ చౌహాన్ మరోసారి స్పష్టం చేశారు. నకిలీ, నాసి రకం విత్తనాల వలలో రైతులు చిక్కుకోకుండా వారిని కాపాడుతూ పటిష్ఠమైన, జవాబుదారుతనంతో కూడిన విత్తన నియంత్రణ వ్యవస్థను నెలకొల్పే దిశగా ప్రస్తుతం జరుపుతున్న సంప్రదింపులు ముఖ్యపాత్రను పోషిస్తాయని
ఆయన అన్నారు. ఇతర ఆసక్తిదారు వర్గాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఈ ప్రక్రియ అంతటికీ రైతుల హితమే ప్రధానంగా ఉంటుందనీ ఆయన తెలిపారు. రైతులకు సౌభాగ్యాన్నీ, సాధికారతనీ, ఆత్మనిర్భరతనీ సమకూర్చాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిపాదిత చట్టం ఒక భాగమని శ్రీ చౌహాన్ వర్ణించారు.
***
(రిలీజ్ ఐడి: 2309376)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4