యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం సమావేశంలో బ్రిక్స్ క్రీడా మంత్రుల ఉమ్మడి ప్రకటన ఆమోదం
కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారానికి నిజమైన వేదికను సృష్టించే బ్రిక్స్ స్పోర్టింగ్ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
"ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, భారతదేశం మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తూ తన క్రీడా పర్యావరణ వ్యవస్థను రూపాంతరం చేస్తోంది" – డాక్టర్ మాండవీయ
प्रविष्टि तिथि:
23 AUG 2026 4:22PM by PIB Vijayawada
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం 2026 ముగిసింది. సంభాషణ, పరస్పర గౌరవం మరియు సమ్మేళనం ద్వారా క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి సభ్య దేశాల కట్టుబడిని పునరుద్ఘాటిస్తూ ఏకగ్రీవంగా 'బ్రిక్స్ క్రీడా ఉమ్మడి ప్రకటన'ను ఆమోదించారు.
భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత 2026 కింద జరిగిన ఈ సమావేశం, క్రీడా అభివృద్ధి మరియు సహకార ప్రాధాన్యతలను చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులను, సీనియర్ క్రీడా ప్రతినిధులను ఒకచోటకు చేర్చింది.

తన ప్రారంభ ఉపన్యాసంలో, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సభ్య దేశాల ఉమ్మడి విజన్ను స్పష్టమైన క్రీడా సహకారాలుగా మార్చే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

"అథ్లెట్లు మరియు కోచ్ల మార్పిడి, ఉమ్మడి పోటీలు లేదా క్రీడా విజ్ఞాన పరిజ్ఞాన మార్పిడి ఏదైనా కావచ్చు, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారాలకు నిజమైన వేదికలను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని మనం నిర్మించాలి" అని డాక్టర్ మాండవీయ అన్నారు.
HH65.jpg)
దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను నొక్కిచెబుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం తన క్రీడా పర్యావరణ వ్యవస్థను రూపాంతరం చేస్తోందని, మైదానం నుండి పోడియం వరకు అవకాశాలను సృష్టిస్తోందని డాక్టర్ మాండవీయ అన్నారు.
క్రీడా సామాగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారతదేశం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. త్వరలో ప్రారంభించబోయే 'స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ప్రోత్సాహక పథకం' పెట్టుబడులను సులభతరం చేయడమే కాకుండా గ్లోబల్ మార్కెట్ల కోసం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
"గ్లోబల్ తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులను 'మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా మరియు గ్రో విత్ ఇండియా' కు ఆహ్వానిస్తున్నాం" అని ఆయన అన్నారు.
పారా-స్పోర్ట్ ప్రోత్సాహక కార్యక్రమాలు మరియు క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత అందరినీ కలుపుకొనిపోయేలా చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ ఉద్ఘాటించారు.
భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత కింద మూడు కీలక కార్యక్రమాలు
భారత అధ్యక్షత సమయంలో, క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి మూడు ప్రాధాన్యత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది:
క్రీడా సాంకేతికతపై బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్:
ఈ వర్కింగ్ గ్రూప్ స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ పనితీరు, గవర్నెన్స్, ఏఐ, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలలో బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేస్తుంది. ఇందులో కీలక క్రీడా విభాగాల్లో భారత నిపుణులు తమ సహకారాన్ని అందిస్తారు.
బ్రిక్స్ స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్:
'బ్రిక్స్ స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంక్లేవ్' కోసం భారతదేశం చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. నవంబర్ 2026లో జరిగే దీని మొదటి ఎడిషన్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరాన్ని ఆతిథ్య నగరంగా ప్రతిపాదించారు. ఈ కాంక్లేవ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు, సాంకేతిక ప్రదాతలు, ఎస్ఎంఇలు, స్టార్టప్లు మరియు పరిశోధనా సంస్థలను ఒకచోటకు చేర్చుతుంది. ఉత్తమ విధానాల మార్పిడి, సాంకేతికత మరియు ఆవిష్కరణలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్గత బ్రిక్స్ వాణిజ్యం మరియు బహుముఖ సరఫరా గొలుసులపై ఇది దృష్టి సారిస్తుంది.

బ్రిక్స్ సాంప్రదాయ మరియు దేశీయ క్రీడల ప్రదర్శన ఆటలు 2026:
12-13 అక్టోబర్ 2026న గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించాలని ప్రతిపాదించిన ఈ క్రీడలు, బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయ, దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించడానికి ఒక వేదికను అందిస్తాయి. పోటీతత్వం లేని, సాంస్కృతిక దృష్టి కలిగిన కార్యక్రమంగా రూపొందించబడిన ఈ క్రీడలు సాంస్కృతిక మార్పిడిని, ప్రజల మధ్య సంబంధాలను మరియు పరస్పర అవగాహనను ప్రోత్సహిస్తాయి.
ఈ క్రీడలు, సముచితమైన మరియు సాధ్యమైన చోటల్లా అథ్లెట్లు మరియు క్రీడాకారుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తాయి. ప్రతి క్రీడతో ముడిపడి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆచారాలు, సాంప్రదాయ పరిజ్ఞాన వ్యవస్థలను గుర్తిస్తూ, ఉమ్మడి సాంస్కృతిక సున్నితత్వ ప్రోటోకాల్లు, పరస్పర గౌరవ చట్రాలు భాగస్వామ్యానికి మార్గదర్శకంగా ఉంటాయి.
బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్
అధికారిక కార్యకలాపాలకు ముందు, పాల్గొన్న మంత్రులు మరియు ప్రముఖులు విశాఖపట్నంలో 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్' 87వ ఎడిషన్లో భాగంగా నిర్వహించిన 'బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్'లో పాల్గొన్నారు. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మరియు యువజన వ్యవహారాలు, క్రీడల సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యుఏఈ, ఇరాన్ మరియు దక్షిణాఫ్రికా మంత్రులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం క్రీడల ద్వారా ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో బ్రిక్స్ ఉమ్మడి కట్టుబడిని ప్రతిబింబించింది.
భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత సమయంలో సాధించిన పురోగతిని స్వాగతిస్తూనే, యువజన అభివృద్ధి, సమ్మేళనం, సాంస్కృతిక మార్పిడి మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి.

బ్రిక్స్ చట్రంలో క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కట్టుబడి ఉన్నందుకు పాల్గొన్న అన్ని దేశాలను డాక్టర్ మాండవీయ అభినందించారు. ఈ భాగస్వామ్యం సభ్య దేశాల మధ్య అర్థవంతమైన మరియు నిరంతర క్రీడా సహకారంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సమావేశం యొక్క ఫలితాలు భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత థీమ్ అయిన "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" కు తోడ్పడతాయి.
****
(रिलीज़ आईडी: 2302555)
आगंतुक पटल : 32