యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం సమావేశంలో సంయుక్త ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు
ప్రకటనలకే పరిమితం కాకుండా క్రీడా సహకారం కోసం నిజమైన వేదికను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
“ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో, క్రీడా మైదానం నుంచి పతకం అందుకునే పోడియం దాకా అవకాశాలను విస్తరిస్తూ పురోగమిస్తున్న భారత క్రీడా రంగం” - డాక్టర్ మాండవీయ
प्रविष्टि तिथि:
23 AUG 2026 4:22PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం-2026... బ్రిక్స్ క్రీడల ఉమ్మడి ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించడంతో ముగిసింది. చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళితత్వం ద్వారా క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడం పట్ల సభ్య దేశాల నిబద్ధతను ఈ ప్రకటన పునరుద్ఘాటిస్తుంది.
బ్రిక్స్-2026 సారథిగా భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం... సహకార ప్రాధాన్యాలు, క్రీడాభివృద్ధిపై చర్చించడానికి బ్రిక్స్ దేశాల మంత్రులు, సీనియర్ క్రీడా ప్రతినిధులను ఒకచోట చేర్చింది.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తన ప్రారంభోపన్యాసంలో... సభ్య దేశాల ఉమ్మడి దార్శనికతను స్పష్టమైన క్రీడా సహకారంగా మార్చే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
"మనం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా... క్రీడాకారులు, కోచ్ల వ్యూహాత్మక సలహాలు-సూచనలను పంచుకోవడం, సంయుక్తంగా పోటీల నిర్వహణ, క్రీడా విజ్ఞాన సంబంధిత పరిజ్ఞానాన్ని పంచుకోవడం వంటి క్రీడా సంబంధిత సహకారం కోసం నిజమైన వేదికను సృష్టించే బ్రిక్స్ క్రీడా భాగస్వామ్యాన్ని నిర్మించాలి" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.
దేశ నిర్మాణంలో క్రీడల పాత్రను స్పష్టం చేస్తూ... భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తన క్రీడా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ క్రీడా మైదానం నుంచి పతకాలు అందుకునే పోడియం వరకు అవకాశాలను విస్తరిస్తోందని డాక్టర్ మాండవీయ అన్నారు.
క్రీడా సామాగ్రి తయారీని బలోపేతం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. త్వరలో ప్రారంభించనున్న క్రీడా సామాగ్రి తయారీ క్లస్టర్ల ప్రోత్సాహక పథకం... పెట్టుబడులను సులభతరం చేస్తుందనీ, ప్రపంచ మార్కెట్ల కోసం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుందనీ ఆయన పేర్కొన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు, టెక్నాలజీ కంపెనీలు, పెట్టుబడిదారులు 'మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా'లో పాలుపంచుకోవాలని మేం ఆహ్వానిస్తున్నాం" అని ఆయన అన్నారు.
పారా-క్రీడల ప్రోత్సాహక కార్యక్రమాలు, క్రీడల్లో మహిళల అధిక భాగస్వామ్యం కోసం కొత్త మార్గాల ద్వారా క్రీడలను మరింత సమ్మిళితం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు.
బ్రిక్స్ సారథిగా భారత్ ఆధ్వర్యంలో మూడు కీలక కార్యక్రమాలు
బ్రిక్స్ సారథిగా భారత్... క్రీడల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి మూడు ప్రాధాన్య కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించింది:
క్రీడా సాంకేతికతపై బ్రిక్స్ కార్యాచరణ బృందం:
క్రీడా విజ్ఞానం, క్రీడాకారుల ప్రదర్శన, నిర్వహణ, ఏఐ, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ రంగాల్లో బ్రిక్స్ సహకారాన్ని ఈ కార్యాచరణ బృందం బలోపేతం చేస్తుంది. ఇందులో భాగంగా కీలక క్రీడా విభాగాల కోసం నిపుణులను భారత్ అందిస్తుంది.
బ్రిక్స్ క్రీడా సామాగ్రి తయారీ సదస్సు:
బ్రిక్స్ క్రీడా సామాగ్రి తయారీ సదస్సు నిర్వహణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు విస్తృత మద్దతు లభించింది. దీని తొలి సమావేశం 2026 నవంబరు నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ సదస్సు... తయారీదారులు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు, సాంకేతిక ప్రదాతలు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈలు), అంకురసంస్థలు, పరిశోధనా సంస్థలను ఒకచోట చేర్చుతుంది. ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, సాంకేతికత, ఆవిష్కరణలు, నాణ్యతా ప్రమాణాలు, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పటిష్ఠమైన సరుకు రవాణా వ్యవస్థలపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
బ్రిక్స్ సాంప్రదాయిక, దేశీయ క్రీడా వారసత్వ ప్రదర్శన క్రీడలు - 2026:
ఈ క్రీడలను 2026 అక్టోబర్ 12-13 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాలు తమ విభిన్న సాంప్రదాయిక, దేశీయ క్రీడా వారసత్వాన్ని ప్రదర్శించడానికి, పరిరక్షించుకోవడానికి ఈ క్రీడా పోటీలు ఒక చక్కని వేదికను అందిస్తాయి. పోటీ లేని, సంస్కృతిపై ప్రధానంగా దృష్టి సారించే కార్యక్రమంగా రూపొందించిన ఈ క్రీడలు... ఆయా దేశాల సంస్కృతిని గురించి తెలుసుకోవడాన్ని, ప్రజల మధ్య సంబంధాలను, పరస్పర అవగాహననూ ప్రోత్సహిస్తాయి.
సముచితమైన, సాధ్యమైన సందర్భాల్లో భాగస్వామ్య దేశాల క్రీడాకారులు- అభ్యాసకుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్నీ ఈ క్రీడలు సులభతరం చేస్తాయి. ప్రతి క్రీడతో ముడిపడి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆచారాలు, సాంప్రదాయిక విజ్ఞాన వ్యవస్థలను గుర్తిస్తూ... ఇతర దేశాల సంస్కృతినీ గౌరవించే నియమావళి, పరస్పరం గౌరవించుకునే విధానాలు ఈ క్రీడల్లో భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేస్తాయి.
బ్రిక్స్ స్నేహపూర్వక సైక్లింగ్ ఈవెంట్
అధికారిక కార్యక్రమాలకు ముందు... విశాఖపట్నంలో జరిగిన 87వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్లో మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ... కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సేల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, యూఏఈ, ఇరాన్, దక్షిణాఫ్రికా దేశాల మంత్రులు పాల్గొన్నారు.
క్రీడల ద్వారా ఫిట్నెస్ను, ఆరోగ్యకరమైన జీవనశైలిని, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
యువజన అభివృద్ధి, సమ్మిళితత్వం, సాంస్కృతిక వినిమయం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్రను ప్రతినిధి బృందాలు పునరుద్ఘాటించాయి. భారత బ్రిక్స్ సారథ్యంలో సాధించిన పురోగతిని స్వాగతించాయి.
బ్రిక్స్ విధాన ప్రణాళికలో భాగంగా క్రీడల్లో సహకారాన్ని బలోపేతం చేయడం కోసం నిరంతర నిబద్ధతతో కృషి చేస్తున్న సభ్య దేశాలను డాక్టర్ మాండవీయ అభినందించారు. ఈ భాగస్వామ్యం సభ్య దేశాల మధ్య అర్థవంతమైన, నిరంతర క్రీడా సహకారంగా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత బ్రిక్స్ సారథ్య నినాదం... “అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” సాధనకు ఈ సమావేశ తీర్మానాలు దోహదపడతాయి.
****
(रिलीज़ आईडी: 2302554)
आगंतुक पटल : 13