ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా సన్నద్ధతపై కేంద్ర వైద్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా సమీక్ష.. నిరంతర అప్రమత్తత, పటిష్ట నిఘాకు ఆదేశం
प्रविष्टि तिथि:
21 AUG 2026 4:10PM by PIB Hyderabad
దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 ఇన్ఫ్లూయెంజా పరిస్థితి, సన్నద్ధతపై నేడు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి శ్రీ జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ వైద్యశాఖ మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వ్యాధిపై జాతీయ స్థాయి నిఘా, అంటువ్యాధుల వ్యాప్తిని, ఇన్ఫ్లూయెంజా వంటి అనారోగ్య లక్షణాలు (ఐఎల్ఐ), తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (ఎస్ఏఆర్ఐ) ధోరణులు, పరీక్షలు, ప్రయోగశాల పర్యవేక్షణ, సీజనల్ ఇన్ఫ్లూయెంజా కేసులను నిర్వహించేందుకు వైద్య సంరక్షణ కేంద్రాల సన్నద్ధతను కేంద్ర వైద్యశాఖ మంత్రి సమీక్షించారు. ఇన్ఫ్లూయెంజా ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, కేసుల్లో అసాధారణ పెరుగుదల లేదా ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు వాటిని సకాలంలో గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు నిరంతర అప్రమత్తత, పటిష్ట నిఘా, ముందస్తు సన్నద్ధత అవసరమని శ్రీ జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ఢిల్లీలోని వైద్య సంరక్షణ కేంద్రాల సన్నద్ధతపై కూడా కేంద్రమంత్రి సమీక్షించారు. ఆసుపత్రి పడకలు, అత్యవసర చికిత్సా సదుపాయాలు, ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకలు, వెంటిలేటర్లు, అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ సదుపాయాలు, ఇతర కీలక సామగ్రి లభ్యతను పరిశీలించారు. ముఖ్యంగా ప్రత్యేక లేదా అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు తగినన్ని అదనపు సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం, ఆసుపత్రుల మధ్య రోగుల తరలింపులో ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతమైన రిఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ముఖ్యమని తెలిపారు.

ఇన్ఫ్లూయెంజా కేసులను సత్వరంగా గుర్తించడం, సమయానికి పరీక్షలు నిర్వహించడం, తగిన వైద్య నిర్వహణ వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని, ఇప్పటికే ఉన్న నిఘా, ప్రయోగశాలల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని కేంద్ర వైద్యశాఖ మంత్రి సూచించారు.

అంతకుముందు 2026 జూలై 10న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి ప్రత్యేక లేఖ రాశారు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై (ఏఆర్ఐ) సన్నద్ధత, నిఘాను మరింత బలోపేతం చేయాలని, వైద్య సంరక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు.
ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడంపై శ్రీ జేపీ నడ్డా ప్రత్యేకంగా దృష్టి సారించారు. చేతుల పరిశుభ్రత, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తీసుకోవాల్సిన శ్వాసకోశ ముందస్తు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణకు నిరంతర, సమన్వయ ప్రయత్నాలు అత్యవసరమని పేర్కొన్న కేంద్రమంత్రి.. ప్రస్తుత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఈ సీజనల్ వ్యాధుల నివారణ, వ్యాప్తి, నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టాలని, ఇందులో మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర స్థానిక సంస్థలు క్రియాశీలకంగా భాగస్వామ్యం కావాలని శ్రీ జేపీ నడ్డా పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల చురుకైన భాగస్వామ్యం, సమగ్ర ప్రభుత్వ విధానం ద్వారా జాతీయ రాజధానిలో క్షయ వ్యాధి కేసులను గుర్తించడం పెరిగిందని కేంద్రమత్రి తెలిపారు. వాస్తవాలు, శాస్త్రీయ నిరూపిత సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంలోనూ అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనడం కీలకమని చెప్పారు.
హెచ్1ఎన్1 సహా సీజనల్ ఇన్ఫ్లూయెంజాపై సమర్థవంతమైన నిఘా, ముందస్తు గుర్తింపు, సకాలంలో వైద్య నిర్వహణ, ముందస్తు సన్నద్ధతను నిర్ధారించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది.
ఈ సమావేశానికి కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ, అదనపు కార్యదర్శి (ప్రజారోగ్యం) డాక్టర్ రాకేష్ గుప్తా, ఢిల్లీ రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి శ్రీ రూపేష్ కుమార్ ఠాకూర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
***
(रिलीज़ आईडी: 2302228)
आगंतुक पटल : 12