రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్సీసీకి చెందిన అఖిల భారత బాలికల హై ఆల్టిట్యూడ్ లాంగ్ ట్రెక్ ‘అపరాజిత-పరంగ్ లా 2026'ను ప్రారంభించిన రక్షణ మంత్రి
త్రివిధ దళాలకు చెందిన మహిళా అధికారుల సారథ్యంలో భారత్లోనే అత్యంత సవాలుతో కూడిన మార్గంలో 28 మంది ఎన్సీసీ బాలికల 250 కి.మీ, 30 రోజుల సాహస యాత్ర
ఈ యాత్ర దేశ నారీ శక్తి ధైర్యసాహసాలు, పట్టుదల, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనం: శ్రీ రాజ్నాథ్ సింగ్
प्रविष्टि तिथि:
18 AUG 2026 12:55PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఆగస్టు 18, 2026న జరిగిన కార్యక్రమంలో జాతీయ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ప్రతిష్ఠాత్మక సాహస యాత్ర కార్యక్రమమైన అఖిల భారత బాలికల హై ఆల్టిట్యూడ్ లాంగ్ ట్రెక్ ‘అపరాజిత-పరాంగ్ లా 2026’ను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్లోని స్పితి లోయను లడఖ్లోని చాంగ్థాంగ్ ప్రాంతంతో అనుసంధానించే 5,578 మీటర్లు (18,300 అడుగులు) ఎత్తైన పరాంగ్ లా పాస్ మీదుగా ఈ ట్రెక్ సాగనుంది. దేశంలోని అత్యంత సవాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతాల ట్రెక్కింగ్ మార్గాల్లో ఇది ఒకటిగా పరిగణిస్తారు.
త్రివిధ దళాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళా అధికారులు ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సాహస యాత్రలో సగటు 19 ఏళ్ల వయసు కలిగిన 28 మంది బాలికా క్యాడెట్లు పాల్గొంటున్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కురాలు కేవలం పదహారున్నర ఏళ్ల అమ్మాయి కావడం విశేషం. ఇంతటి సవాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతాల సాహస యాత్రలో యువ బాలికలు పాల్గొనడం దేశ మహిళల ధైర్యం, సంకల్పం, పెరుగుతున్న సామర్థ్యాలకు శక్తిమంతమైన నిదర్శనమని రక్షణమంత్రి పేర్కొన్నారు.
అధికారులు, వైద్య సిబ్బంది, శిక్షకులు, సహాయక సిబ్బందితో కూడిన ఈ బృందం సుమారు 250 కిలోమీటర్ల దూరాన్ని 30 రోజుల్లో పూర్తి చేయనుంది. హిమాలయాల్లోని అత్యంత మారుమూల, సవాళ్లతో కూడిన ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఎత్తైన ఎడారులు, హిమానీనదాలు, మంచు క్షేత్రాలు, నదీ లోయల గుండా సాగే ఈ యాత్ర మార్గంలో కిబ్బర్, డుమ్లా, థాల్టక్, బొంగ్రోజెన్, పరాగ్ లా పాస్, డాక్ కార్జోంగ్, నోర్బు సుమ్డో, కియాంగ్డమ్, కోర్జోక్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.
యాత్ర సురక్షితంగా, విజయవంతంగా సాగాలని మహిళా బృందానికి కేంద్రమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇటువంటి యాత్రలు కీక పాత్ర పోషిస్తాయని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఎంపికైన క్యాడెట్ల శారీరక, మానసిక సన్నద్ధతను ఆయన ప్రశంసించారు. ఈ యాత్ర వారిలో దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మశోధనకు ఒక జీవిత పాఠంగా నిలుస్తుందని చెప్పారు. ‘‘క్యాడెట్లు పరాంగ్ లా నుంచి కేవలం మరిచిపోలేని అనుభవాలతోనే కాకుండా, తమ అంతర్గత శక్తిపై లోతైన అవగాహనతో కూడా తిరిగి వస్తారు’’ అని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
యాత్ర పొడవునా ‘భద్రత’, ‘పర్యావరణ పరిరక్షణ’, ‘స్థానిక సమాజాలతో మమేకమవడం’ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని బృంద సభ్యులకు సూచించారు. ‘‘శిక్షకుల సూచనలను కచ్చితంగా పాటించండి. అనవసరమైన ప్రమాదాల జోలికి వెళ్లకండి. హిమాలయ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వ్యర్థ రహిత విధానాన్ని అవలంబించండి. స్థానిక ప్రజలతో మర్యాదగా వ్యవహరించండి. వారి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుంటూ, వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. ఈ యాత్ర మీ జీవితాల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచి, జీవితంలోని ప్రతి దశలో ‘అపరాజిత’గా నిలిచే స్ఫూర్తిని అందించాలి’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ క్యాడెట్లకు పిలుపునిచ్చారు.
నేల, నీరు, ఆకాశం అనే తేడా లేకుండా అన్ని రకాల సాహస కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు సాధిస్తున్న విజయాలను శ్రీ రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ప్రధాన పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న బాలికల నారీ శక్తి స్ఫూర్తిని ప్రత్యేకంగా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్సీసీ డైరెక్టరేట్ల నుండి వచ్చిన క్యాడెట్ల భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తూ.. భిన్నమైన భాషలు, సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వీరి ఐక్యత 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి నిదర్శనమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాత్స్తో పాటు ఎన్సీసీ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సాహస యాత్రను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలిదశలో భాభా పిన్ వ్యాలీ ప్రాంతంలో సన్నాహక, ఎత్తైన ప్రాంతాలకు అలవాటు చేసే యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రతిభ ఆధారంగా తుది ఎన్సీసీ బాలికా క్యాడెట్ల బృందాన్ని ఎంపిక చేశారు. బాలికా క్యాడెట్లలో నారీ శక్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బృందస్ఫూర్తి, సహనశక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ యాత్రను రూపొందించారు.
***
(रिलीज़ आईडी: 2300860)
आगंतुक पटल : 6