ప్రధాన మంత్రి కార్యాలయం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
प्रविष्टि तिथि:
15 AUG 2026 4:44PM by PIB Hyderabad
1. సాధారణ అంశాలు
· నేడు మనం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ ప్రతి భారతీయుడి గుండె చప్పుడు వందేమాతరం నినాదంతో ప్రతిధ్వనిస్తోంది.
· ఈ రోజు 'హర్ ఘర్ తిరంగా హై, హర్ మన్ తిరంగా హై' (ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం, ప్రతి మనసులోనూ త్రివర్ణ పతాకం) అనే భావనతో దేశం కొత్త ఉత్సాహంతో, నూతన శక్తితో, కొత్త సంకల్పాలను మోసుకుంటూ ముందుకు సాగుతోంది.
· స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను, అమరవీరులను నేడు దేశం స్మరించుకుంటోంది. వారి కఠోరదీక్ష, త్యాగం, అంకితభావంతో స్వాతంత్ర్య సాధనే వారి జీవిత లక్ష్యంగా మలచుకున్నారు.
· పూజ్య బాపునకు, స్వాతంత్ర్య సమరయోధులందరికీ, ఈ త్యాగనిరతికి స్ఫూర్తినిచ్చిన గొప్ప విప్లవకారులందరికీ గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నా.
· స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆగస్టు 15న ఎర్రకోట నుంచి వందేమాతరం ప్రతిధ్వనిస్తోంది. నేడు మనం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో దీనికంటే అద్భుతమైన సందర్భం మరొకటి ఉంటుందా?
· ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎన్నో కుటుంబాలు ప్రభావితమయ్యాయి. వారి బాధను, క్షోభను పూర్తిగా అర్థం చేసుకోగలం. పంచుకోగలం. బాధిత కుటుంబాలకు మాతో పాటు యావత్ దేశం వెంట ఉంటుందని నేను హామీ ఇస్తున్నా.
· కలలు, సంకల్పాలు, సామర్థ్య బలంతో ఒక దేశం ముందుకు సాగినప్పుడు అది గొప్పగా మారుతుంది. లక్ష్యాలను సాధిస్తుంది.
· మన సంకల్పాలు కూడా ఉన్నతంగా ఉండాలి. మన కలలు, సంకల్పాలు ఉన్నతంగా ఉన్నప్పుడు సామర్థ్యాల స్థాయి కూడా పెరుగుతుంది. మన ప్రయత్నాల పరిమాణం పెరుగుతుంది. అప్పుడే మనం కలలను నిజం చేసుకోగలం.
· భారత్ నేడు ఒక పెద్ద కలని కంటోంది. దృఢ సంకల్పంతో కూడిన కల, నూతన శిఖరాలను అధిరోహించాలనే కల. అదేమిటంటే... 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) ను మనం నిర్మిస్తాం.
· 140 కోట్ల మంది పౌరుల శ్రమ, కృషితో మనం ఈ లక్ష్యాన్ని సాధించాలి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం... అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పించుకున్నప్పుడు, అది ప్రపంచ దృష్టిలో మన ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృష్టిని మార్చుకోవాల్సి ఉంటుంది.
· గత 12 ఏళ్లుగా దళితులు, అణగారిన వర్గాలు, నిరుపేదలు, గిరిజన సంఘాలు, గ్రామాలు, నగరాల్లో నివసించే ప్రజలు, పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు... ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల ప్రజలు... దేశంలోని కోట్లాది మంది పౌరులు సంకల్పంతో, అంకితభావంతో దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చేందుకు సాధ్యమైనంత కృషి చేశారు.
· వారి కృషిని నేను అభినందిస్తున్నా. ఈ పౌరుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే అతి తక్కువ సమయంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు.
· ఒకప్పుడు మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండగా, ఈ పౌరుల కృషితోనే కేవలం 12 ఏళ్లలోనే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించాం.
· గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఖాదీ, గ్రామ పరిశ్రమల రంగం ఉత్పత్తి దాదాపు ఐదు రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్స్ తయారీ దాదాపు ఏడు రెట్లు వృద్ధిని సాధించింది.
· ఆధునిక రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరిగింది. ఇది మాత్రమే కాదు. ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఆవిష్కరణల ప్రపంచంలోనూ మనదైన ముద్ర వేశాం.
· ఇంటర్నెట్ వినియోగదారులు, కస్టమర్ల సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. మంజూరైన పేటెంట్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.
· డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయి. సాధారణ పౌరుల దైనందిన జీవితాలను మెరుగుపరిచేందుకు మేం కూడా అంతే శ్రద్ధతో పనిచేశాం.
· గతంతో పోలిస్తే ఏటా సగటున 15 రెట్లు వేగంగా నల్లా నీటి కనెక్షన్లను అందించాం.
· గ్యాస్ కనెక్షన్లు ఏటా సగటున ఆరు రెట్లు వేగంగా అందిస్తున్నాం. పేదల కోసం మరుగుదొడ్ల నిర్మాణం వార్షిక రేటు కన్నా నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. పేదలకు ఇళ్లు సమకూర్చే వేగం ఏటా మూడు రెట్లు పెరిగింది.
· దేశంలో పెద్దఎత్తున పాలనాపరమైన మార్పులు జరిగాయి. వేలాది నిబంధనలను తొలగించాం. కాలం చెల్లిన వందలాది చట్టాలు రద్దయ్యాయి. గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రయాణాన్ని సాగించటం సాధ్యం కాదు.
· ఆధునిక మౌలిక వసతుల కోసం మెట్రో వ్యవస్థలను విస్తరించాం. ప్రజా రవాణాను బలోపేతం చేశాం. పనులు జరిగిన వేగం, చేపట్టిన పరిమాణం, పురోగతి, ఈ విస్తరణ, ఈ విజయాలు స్వాతంత్ర్యానంతరం గత దశాబ్దంలో దేశం తొలిసారిగా చూసినవి.
· మన ముందు ఇన్ని విజయాలు, ఇంత వేగవంతమైన పురోగతి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ప్రతి క్షణం దేశ పౌరుల సామర్థ్యాలు బలపడుతున్నప్పుడు 2047 నాటికి 'వికసిత్ భారత్'ను సాధించాలనే సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది.
2. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
· మన సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకోవాలి. అందుకే 'ఆత్మనిర్భర్ భారత్' (స్వావలంబన భారత్)ను నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలతో నేడు ప్రతి భారతీయుడి మనసు, ఆలోచనలు అనుసంధానమవుతున్నాయి.
· 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్టీఏలు) మనం కుదుర్చుకున్నాం. దీనివల్ల లభించిన అద్భుతమైన అవకాశాలను గమనించండి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఎంతో కీలకమైన అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అందుకే మనం ఈ అవకాశాలని చేజార్చుకోకూడదని మన ఎంఎస్ఎంఈలకు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నా.
· మనం ప్రపంచ స్థాయికి చేరుకోవాలి. భారతదేశ ప్రతి ఉత్పత్తికి ప్రపంచ మార్కెట్లలో స్థానం లభించాలి. మన వస్త్రాలు, యంత్రాలు, ఔషధాలు - వంటి వాటికి సంబంధించి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రపంచ ప్రమాణాలను అందుకోవడమే కాక మనం వాటిని అధిగమించాలి కూడా. ప్రపంచం నుంచి మనం పొందే దానికన్నా మెరుగైన దాన్ని మనం తిరిగి అందించాలి.
· సంస్కరణల ప్రయాణాన్ని మనం ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మనం తదుపరి స్థాయి సంస్కరణల దిశగా అడుగులు వేయనున్నాం. కాబట్టి ప్రభుత్వం, సమాజం, పరిశ్రమలు, ఉత్పత్తిదారులు, రైతులు సంప్రదాయ విధానాలను సంస్కరించుకోవాలి. మన ఆలోచనా విధానాన్ని, లక్ష్యాలను కూడా సంస్కరించుకోవాలి.
· రాబోయే రోజుల్లో నేను 'సప్త ధార' (శక్తికి సంబంధించిన ఏడు రంగాలు) గురించి ప్రస్తావించినప్పుడు... తయారీ రంగ శక్తి వాటిలో మొదటగా ఉంటుంది.
· మనం తయారీ రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలి. ఉత్పత్తిని పెంచటంతో పాటు, అత్యంత చిన్న విడిభాగాల నుంచి అతిపెద్ద ఉత్పత్తుల వరకు అన్నింటినీ మనం తయారు చేయాలి.
· విలువ వ్యవస్థ మొత్తం మనదే అయ్యిండాలి. ఆ దృక్పథంతోనే మనం ముందుకు సాగాలి. మనకు విడిభాగాలు, పూర్తి స్థాయి తయారీ ప్రక్రియ అవసరం. మనం పూర్తి స్థాయి ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. డిజైన్ నుంచి తయారీ వరకు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ కేంద్రంగా భారత్ మారాలి.
· మన పరిశ్రమలు పోటీతత్వంతో, మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా, మన ప్యాకేజింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలి. లోపాలు లేని ఉత్పత్తి, కచ్చితత్వంతో కూడిన తయారీ మన గుర్తింపుగా మారాలి.
· ప్రపంచ మార్కెట్లో మన గుర్తింపు... విశ్వసనీయత, నాణ్యతపై ఆధారపడి ఉండాలని ప్రతి తయారీదారుడికి, ప్రతి పారిశ్రామికవేత్తకు, ప్రతి ఎంఎస్ఎంఈకి చెబుతున్నా. నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. మన మంత్రం ఒక్కటే: నాణ్యత, నాణ్యత, నాణ్యత. ఇదే మన ప్రపంచ స్థాయి బ్రాండ్ విలువకు పునాదిగా నిలుస్తుంది.
· 3. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ
· ·రైతులపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ వ్యయాన్ని భరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3,000 ధర చేసే యూరియా బస్తాను మన రైతులకు కేవలం రూ.300కే అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
· ·అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధర ప్రస్తుతం రూ.5,000కు చేరుకుంది. అయినప్పటికీ, మన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా డీఏపీని ఇప్పటికీ రూ.1,350కే అందిస్తున్నాం.
· · ‘సప్తధారలో రెండో శక్తి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి. ఆహార శుద్ధి రంగాల్లో కూడా మనం ముందుకు సాగాలి. మన రైతులకు ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.
· ·స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా మనకు విస్తృత మార్కెట్ లో మనకు ప్రవేశం లభిస్తోంది. ఆ మార్కెట్లను చేరుకోవాలి. అక్కడ మన ఉనికిని బలంగా చాటాలి. వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా ఎగుమతి మార్కెట్ వరకు మన ప్రయాణాన్ని సాగించాలి.
· · మన రైతులు రసాయన రహిత వ్యవసాయానికి మరింత ప్రాధాన్యమివ్వాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరగబోతోంది. మన వ్యవసాయ ఉత్పత్తులు అన్ని విధాలా అంతర్జాతీయ ప్రమాణాలకు పూర్తి అనుగుణంగా ఉన్నప్పుడు ప్రపంచ మార్కెట్లలోకి మనం సులభంగా ప్రవేశించగలుగుతాం.
· 4. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ
· . మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 35 రెట్లు పెరిగింది. అంతేకాదు, డిజిటల్ సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో కూడా ఆధునిక కాల అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ భారత్ తనదైన ముద్ర వేసుకుంది.
· ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. మంజూరైన పేటెంట్ల సంఖ్య కూడా నాలుగు రెట్లు పెరిగింది.
· డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయి. అదే సమయంలో, సాధారణ ప్రజల సౌకర్యాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూడా అంతే చిత్తశుద్ధితో కృషి చేశాం.
· నేటి డిజిటల్ ప్రపంచంలో, సాంకేతిక యుగంలో చిప్ ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, రవాణా వ్యవస్థలు ఏవైనా సరే - ప్రతిచోటా చిప్లు అనివార్యంగా మారాయి.
· చిప్లు లేకపోతే ప్రపంచం మొత్తం స్తంభించే పరిస్థితికి మనం చేరుకున్నాం. అందుకే, సెమీకండక్టర్ తయారీలో స్వావలంబన సాధించే దిశగా భారత్ కీలకమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడు సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం.
· దేశ ప్రజలకు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే రాబోయే ఏడు నుంచి ఎనిమిదేళ్లలో మరో ఐదు నుంచి ఎనిమిది సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ వైపు సాగుతున్న ఈ ప్రయాణం దేశం వికసిత్ భారత్గా ఎదగడానికి మనకు ఒక మార్గాన్ని చూపిస్తోంది.
· నా 'సప్త ధార' శక్తులలో మూడవ ప్రధానమైన అంశం సాంకేతికత, ఆవిష్కరణలు. ఇది కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్ల యుగం. మన ముందు పూర్తి నూతన రంగం ఆవిష్కృతమైంది.
· .అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ప్రతి క్షణం మనకు సవాళ్లు విసురుతున్నాయి. అందువల్ల భారత్ను కేవలం ప్రపంచ మార్కెట్గా మార్చడం మాత్రమే కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దాలి.
· .యూపీఐ, డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా మన సామర్థ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా ప్రపంచానికి కూడా తెలియచేశాం. ఇప్పుడు భారత్ తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీలను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలి. తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతల్లో భారత్ నాయకత్వం వహించాలి.
· .భారత్లో తయారైన 6జీ సాంకేతికత ప్రపంచంలోని నలుమూలలకూ చేరేలా చూడటమే మన లక్ష్యం కావాలి. ఈ దిశగా మన ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఈ విషయంలో మన నిబద్ధత, కృషి ఏమాత్రం తగ్గకూడదు.
· 5. గనుల మంత్రిత్వ శాఖ
· .దేశానికి అవసరమైన కీలక ఖనిజాల లభ్యత లక్ష్యంతో ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్’ను ప్రారంభించాం. బడ్జెట్లో కీలక ఖనిజాల కారిడార్ను కూడా ప్రకటించాం.
· .అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. కీలక ఖనిజాల విషయంలో ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్పై నమ్మకంతో ఉన్నాయి.
· 6. విద్యుత్ మంత్రిత్వ శాఖ / నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
· ఇంధనం లేకుండా ఆధునిక ప్రపంచాన్ని నడపడం రోజురోజుకూ కష్టతరమవుతోంది. చిప్లు, ఏఐ, డేటా సెంటర్లు - ఏ రంగమైనా సరే, మనకు భారీ మొత్తంలో విద్యుత్ అవసరం ఉంటుంది.
· .ఇంధన భద్రత నేటి కాలంలో అత్యవసరంగా మారింది. అందుకే ఈ దిశగా ఇప్పటికే పటిష్ఠమైన అనేక చర్యలు చేపట్టాం.
· .ఇంధన భద్రత కోసం ప్రధాన మార్గాల్లో అణుఇంధనం ఒకటి. పార్లమెంట్లో ‘శాంతి చట్టం’ను ఆమోదించడం ద్వారా కొత్త లక్ష్యం దిశగా మార్గం సుగమం చేశాం. 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో కృషి చేస్తున్నాం.
· .2014కు ముందు కేవలం 20 - 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది. నేడు దాదాపు 1.75 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ అందిస్తున్నాం.
· .పన్నెండేళ్ల క్రితం దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే - కేవలం 2 గిగావాట్లు. నేడు మనం 160 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాం.
· .పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించాం. ఇంత తక్కువ వ్యవధిలోనే 50 లక్షల కుటుంబాలు సౌర విద్యుత్ను స్వీకరించిన మైలురాయిని అధిగమించడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఫలితంగా వేలాది కుటుంబాల విద్యుత్ బిల్లులు దాదాపు సున్నాగా మారాయి.
· .వేలాది కుటుంబాలు తమ అవసరాలకు సరిపడా విద్యుత్ను వినియోగించుకున్న అనంతరం మిగిలిన విద్యుత్ను విక్రయిస్తూ ఆదాయం కూడా ఆర్జిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.80,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సహకారంతో ఈ మార్పును పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాం.
· .మన ‘సప్తధార’లో ఆరో శక్తి హరిత ఆర్థిక వ్యవస్థ, నీలి ఆర్థిక వ్యవస్థ. ఇవి హరిత ఉద్యోగాల సృష్టికి కూడా దోహదపడతాయి.
· .గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఇంధన నిల్వ, హరిత రవాణా, హరిత తయారీ రంగాల్లో ప్రపంచస్థాయి నాయకత్వాన్ని సాధించాలి. ఈ అన్ని రంగాల్లోనూ భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలపాలి.
· 7. అణుఇంధన శాఖ
· ఇంధన భద్రత కోసం ప్రధాన మార్గాల్లో అణుఇంధనం ఒకటి. పార్లమెంట్లో ‘శాంతి చట్టం’ ను ఆమోదించడం ద్వారా కొత్త లక్ష్యం దిశగా మార్గం సుగమం చేశాం. 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో కృషి చేస్తున్నాం.
· .ఈ దశాబ్దంలోనే ఐదు కొత్త అణు రియాక్టర్లను ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ ఏడాది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతను విజయవంతంగా సాధించడంతో భారత్ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఫలితంగా అణు ఇంధన రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది.
· 8. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ
· .2014కు ముందు, అంటే 12 ఏళ్ల క్రితం, దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా సౌకర్యం ఉండేది. ఈ 12 ఏళ్లలో ఆ నెట్వర్క్ను 70 నగరాల నుంచి 700 నగరాలకు విస్తరించాం. ఇదే వేగానికి నిదర్శనం. ఇదే విస్తరణకు నిదర్శనం. ప్రతి ఏడాది గ్యాస్ కనెక్షన్లను గతంతో పోలిస్తే సగటున ఆరు రెట్లు వేగంగా అందించాం.
· .2014కు ముందు కేవలం 20- 22 లక్షల కుటుంబాలకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ చేరేది. నేడు 1.75 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా గ్యాస్ అందిస్తున్నాం. పన్నెండేళ్ల క్రితం దేశ సౌర విద్యుత్ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే. కేవలం 2 గిగావాట్లు. నేడు 160 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాం.
· 9. రైల్వే మంత్రిత్వశాఖ
· .ఆధునిక రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది. మన రైల్వే నెట్వర్క్ విద్యుదీకరణ 1925లో ప్రారంభమైంది. అయినప్పటికీ, ఆ తర్వాత 90 ఏళ్లలో అంటే 1925 నుంచి 2015 వరకురైల్వే నెట్వర్క్లో కేవలం 30 శాతం మాత్రమే విద్యుదీకరణ జరిగింది.
· .మిగిలిన విద్యుదీకరణ పనిని మేం కేవలం ఒక దశాబ్దంలోనే పూర్తి చేసి దాదాపు సంపూర్ణ విద్యుదీకరణను సాధించాం. 90 ఏళ్లలో 30 శాతం, 10 ఏళ్లలో 70 శాతం - ఇదే పురోగతికి నిదర్శనం.
· .దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించాం. మన రైళ్లు క్రమంగా విద్యుత్తో నడుస్తుండటంతో పర్యావరణానికి కూడా గణనీయమైన ప్రయోజనం కలుగుతోంది.
· .దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రవేశపెట్టాం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు కావడం సంతోషకరం. హైడ్రోజన్ రైళ్ల రంగంలో కూడా భారత్ ప్రపంచస్థాయిలో తన నాయకత్వాన్ని చాటుకుంది.
· 10. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ
· నక్సలిజం, మావోయిజం లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేశాయి. సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాల పాటు, నక్సలిజం దేశంలోని చాలా ప్రాంతాలను, జనాభాలో అధిక భాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంది. వారిని తుపాకీ బెదిరింపుల కింద ఉంచింది. అది రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసింది. దేశంలోని సాధారణ పౌరులను రక్షించే ప్రయత్నంలో... మన పోలీసు, భద్రతా సిబ్బందిలో 3,500 మందికి పైగా తమ ప్రాణాలను అర్పించారు.
· నక్సలైట్-మావోయిస్టు హింస బహుశా ఇక తన తుది శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో ఉండడం ఈ రోజు నాకు సంతోషం కలిగిస్తోంది. ఒకప్పుడు నక్సలైట్లు తుపాకులు పేల్చిన, నేల రక్తంతో తడిసిన అవే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు అభివృద్ధి, విశ్వాసం, కృషి అనే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు నక్సల్ రహితంగా మారుతున్నాయి.
· సాయుధ నక్సలైట్లు ఓడిపోయారు, కానీ నక్సల్ మనస్తత్వం ఇంకా మిగిలే ఉంది. ఈ శక్తులు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాయి. వారు హింస, అరాచక మార్గాలను అన్వేషిస్తూ... సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి రకరకాల ఎత్తుగడలను ప్రయోగిస్తున్నారు.
· మనం ఈ నక్సల్ మనస్తత్వాన్ని గుర్తించాలి. అటువంటి శక్తులను ఏకాకిగా చేసి, దేశ యువతరాన్ని అభివృద్ధి చెందిన దేశ నిర్మాణమనే ప్రధాన మార్గంతో అనుసంధానించాలి.
· సురక్షితమైన భారత్ను నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు మన సరిహద్దుల లోపల నుంచి వచ్చినా, సరిహద్దు అవతల నుంచి వచ్చినా... భారత్ ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధ స్వరూపం మారుతోంది. యుద్ధం కేవలం యుద్ధభూమిలోనో లేదా సరిహద్దు వెంబడినో మాత్రమే జరుగుతుందనే గ్యారెంటీ ఇప్పుడు లేదు.
· రాబోయే రోజుల్లో మేం ఒక శక్తిమంతమైన పౌర రక్షణ వ్యవస్థను నిర్మిస్తామని ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రకటిస్తున్నా. మన పౌరులకు, పౌర రక్షణ సిబ్బందికి ఆధునిక వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాలను అందించి, సమకాలీన సన్నద్ధతా పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తాం.
· 11. రక్షణ మంత్రిత్వశాఖ
· మన సప్తధారలోని ఐదో శక్తి వనరు రక్షణ శక్తి. రక్షణ శక్తి ప్రాముఖ్యత ఏ విధంగానూ కాదనలేనిది. రక్షణ రంగం విషయంలో స్వయం-సమృద్ధి సాధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భారత్ ఇప్పుడు గ్రహించింది. ప్రపంచమూ దానిని గుర్తించింది.
· మనం అత్యాధునిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేసి, ప్రపంచ రక్షణ సరఫరాదారుగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మనం డ్రోన్లను, డ్రోన్ నిరోధక వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. హైపర్సోనిక్ రక్షణ సాంకేతికతల్లో ముందంజలో ఉండాలి.
· నేడు ప్రతి కుటుంబానికీ సైబర్ భద్రత ఒక సవాలుగా మారుతోంది. ఇదీ ఒక రక్షణ రంగ సంబంధిత సమస్యే. దీని పరిష్కారం కోసం మనం మన యువత సామర్థ్యాలను వినియోగించుకోవాలి. దేశానికీ, ప్రపంచానికీ ప్రయోజనం చేకూర్చేలా వారి ప్రతిభను మనం ఉపయోగించుకోగలం.
· మేం ఇటీవలి సంవత్సరాల్లో మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాం. దాని పనులు చాలా వేగంగా పురోగమిస్తున్నాయి. నేడు, మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. మన ఆయుధాలు, రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు చేరుతున్నాయి.
· 12. రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ
· సప్త ధారల్లో నాల్గో శక్తి రవాణా శక్తి. రవాణా శక్తి కింద, మనం దేశంలో నిరాటంకమైన, వేగవంతమైన అనుసంధానంపై దృష్టి పెట్టాలి.
· మనం మన నగరాలను హై-స్పీడ్ రైలు ద్వారా అనుసంధానించుకోవాలి. మనకు ఆధునిక రహదారులు, అంతర్గత జలమార్గాలు, విమానాశ్రయాలు, బహుళ రవాణా మార్గాల లాజిస్టిక్స్ వ్యవస్థ అవసరం.
· 13. నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వశాఖ
· మనం మన ఓడరేవులను కేవలం సరుకులను ఎక్కించే, దించే ప్రదేశాలుగానో లేదా ప్రపంచం నలుమూలల నుంచి ఓడలు వచ్చి లంగరు వేసే స్థలాలుగానో చూడకూడదు. ఓడరేవుల ఆధారిత అభివృద్ధి, ఎదుగుదల దిశగా మనం మన ఓడరేవులను ముందుకు తీసుకువెళ్లాలి.
· బ్లూ ఎకానమీలో భారత్కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా పొడవైన తీరప్రాంతం ఉంది. అక్కడ బ్లూ ఎకానమీకి అపారమైన అవకాశాలు ఉన్నాయి.
· మత్స్య పరిశ్రమ, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సంబంధిత సాంకేతికత ఇంకా అనేక ఇతర రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు.
· 14. మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖ
· ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫలితంగా, కేరళం నుంచి గుజరాత్ వరకు... తమిళనాడు నుంచి బెంగాల్ వరకు... మన తీరప్రాంతం వెంబడి, మన రొయ్యలను ఎగుమతి చేసే సామర్థ్యం గణనీయంగా పెరిగింది. మన సముద్రపు ఆహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరే అవకాశమూ పెరిగింది.
· బ్లూ ఎకానమీలో భారత్కు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మనకు చాలా పొడవైన తీరప్రాంతం ఉంది. అక్కడ బ్లూ ఎకానమీలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మత్స్య పరిశ్రమ, తీరప్రాంత పర్యాటకం, సముద్ర సంబంధిత సాంకేతికత, మనం ముందుకు సాగగల అనేక ఇతర రంగాలూ ఉన్నాయి.
· 15. పర్యాటక మంత్రిత్వశాఖ
· భారత్ అపారమైన వన్యప్రాణి సంపదను కలిగి ఉంది. మనకు 100కు పైగా జాతీయ పార్కులు ఉన్నాయి. సామర్థ్యం అపారంగా ఉంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం మనం వెనకబడి ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను భారత్ వైపు ఆకర్షించేలా మన సాఫ్ట్ పవర్ను ఉపయోగించుకునే అవకాశం మనకు ఉంది. మనం మన సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించాలి.
· నేడు, క్రీడలూ భారత్ కోసం ఒక ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ప్రపంచ క్రీడా కార్యక్రమాలను దేశంలో ఎందుకు నిర్వహించకూడదు? కన్సర్ట్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతూ, దేశ యువతకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
· ప్రపంచంలోని ప్రతి ప్రముఖ కళాకారుడు ఏదో ఒక సమయంలో భారత్లో ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. దానిని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యవస్థలను మనం తప్పనిసరిగా సృష్టించాలి.
· 16. సాంస్కృతిక / జౌళి మంత్రిత్వశాఖ
· మన సప్త ధారల్లో ఏడో ధార భారత సాఫ్ట్ పవర్. ఇదే భారత సాఫ్ట్ పవర్ బలం. నేడు, యోగా యావత్ ప్రపంచాన్నీ భారత్తో అనుసంధానించింది. యోగా ప్రపంచానికి అంతకంతకూ శక్తి వనరుగా మారుతోంది.
· దేశంలో మతపరమైన, ఆధ్యాత్మికపరమైన విశ్వాస కేంద్రాలు, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉన్నాయి. 'హీల్ ఇన్ ఇండియా' ఉద్యమంతో, మనం భారత సామర్థ్యాలను ప్రపంచ స్థాయికి విస్తరించగలం.
· హస్తకళలు, సంస్కృతి, మన సినిమాలు, మన సృజనాత్మక ప్రపంచం, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ లేదా డిజిటల్ కంటెంట్ ఏదైనా సరే... సృజనాత్మక ప్రపంచంలో భారత్ తన స్థాయిని చాటుకోగలదు.
· ఈ రోజు, భారత్ వేవ్స్ సమ్మిట్కు అపారమైన బలాన్ని అందించింది. ప్రపంచ ప్రేక్షకులకు భారత సాఫ్ట్ పవర్, సృజనాత్మక ప్రపంచాన్ని పరిచయం చేసే భారత వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
· 17. ఆర్థిక మంత్రిత్వశాఖ / ఆర్థిక సేవల విభాగం
· ఒకప్పుడు 'ఫ్రాగైల్ ఫైవ్' (బలహీనమైన ఐదు దేశాలు) జాబితాలో ఉన్న మనం... కేవలం 12 సంవత్సరాల్లోనే ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగామంటే, అది మన తోటి పౌరుల కృషి ఫలితమే.
· ఒక దేశం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు. ప్రతి పౌరుడూ దేశంలో ఒక భాగమే. రాబోయే దశాబ్దంలో ఫార్చూన్ 500 జాబితాల్లో 50 భారతీయ కంపెనీలు ఉండాలని మనం ఎందుకు ఆకాంక్షించకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు?
· యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనం మన సామర్థ్యాలను ప్రదర్శించి, మన విశ్వసనీయతను నిరూపించుకున్నాం. డిజిటల్ లావాదేవీలు వంద రెట్లు పెరిగాయి. ఇప్పుడు, భారత్ తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీలను ప్రపంచంలోని ప్రతి మూలకూ తీసుకువెళ్లాలి. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీల్లో భారత్ ముందంజలో నిలవాలి.
· నేడు బ్యాంకింగ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన భారతీయ బ్యాంకు పతాకం ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని ఐదు అగ్రగామి బ్యాంకుల్లో భారతీయ బ్యాంకు ఉండాలి.
· స్వామిత్వ పథకం ద్వారా దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఫలితంగా సుమారు రూ. 140 లక్షల కోట్ల విలువైన ఆస్తులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు.
18. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
· భారత్లో విశ్వాస కేంద్రాలు, ఆయుర్వేదం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉన్నాయి. 'హీల్ ఇన్ ఇండియా' ఉద్యమం ద్వారా, మనం భారత్ సామర్థ్యాలను ప్రపంచానికి తీసుకెళ్లగలం.
· ఔషధ రంగంలో మనం ఎంతో గొప్ప కృషి చేశాం. అయితే, ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఔషధ కంపెనీలలో ఒకటో రెండో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు చోటు దక్కించుకోవడం ప్రస్తుత తక్షణ అవసరం.
· గత ఐదు నుండి ఏడు దశాబ్దాలలో కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత లభించగా, కేవలం ఒకే ఒక్క దశాబ్ద కాలంలో మనం 100 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రతను అందించగలిగాం.
· ఆయుష్మాన్ భారత్ పథకం కింద, 70 ఏళ్లు, ఆ పై వయస్సు ఉన్న వృద్ధులకు కూడా ఇప్పుడు ₹5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, మందులు అందిస్తున్నాం
19. విద్యా మంత్రిత్వ శాఖ
· మనం అంతరిక్ష రంగాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాం. జాతీయ డ్రోన్ విధానాన్ని రూపొందించాము. ఖేలో ఇండియా విధానాన్ని ప్రవేశపెట్టాము. 35 ఏళ్లుగా ఎలాంటి కొత్త విద్యా విధానం లేని నేపథ్యంలో మనం కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చాం. దీని వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎంతో లబ్ధి పొందాయి.
· 2004 నుంచి 2014 మధ్య, మన దేశంలో 350 కన్నా తక్కువ విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. ప్రస్తుతం, 10-12 సంవత్సరాల్లో దాదాపు 650 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పటయ్యాయి. మనం సుమారు 1,000 విశ్వవిద్యాలయాల స్థాయికి చేరువవుతున్నాం.
· 2014 కు పూర్వం, మెడికల్ సీట్లు 400 మాత్రమే. ఇవాళ, దాదాపు 850 మెడికల్ సీట్లు ఉన్నాయి. అంతేకాదు, విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత్లో అడుగుపెడుతున్నాయి. మన యువత భారత్లోనే ఉండి చదువుకుంటూ, విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలను అందుకొనేటట్లు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
· మన యువత బాల్యం నుంచే సాంకేతిక విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకొనే దిశగా కూడా మేం పనిచేస్తున్నాం. ఈ కారణంగానే 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను మేం చిన్న వయసు పిల్లలకు అప్పగించాం. దీంతో వారు నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విజ్ఞానం పట్ల మక్కువ పెంచుకోగలుగుతారు.
· మన యువత వేర్వేరు పరీక్షలు రాయడానికి వీలుగా వారికి ఆన్లైన్లో ఉచిత శిక్షణను అందించాలని మేం నిర్ణయించాం. మనకు డిజిటల్ మాధ్యమంలో ప్రజలకు వివిధ సేవలను అందించే వ్యవస్థలున్నాయి. మంచి ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఈ వనరులన్నింటినీ ఒక చోటుకు చేర్చి, దేశ యువతకు ఉచిత కోచింగును ఇవ్వడానికి ఒక సంపూర్ణ నెట్వర్కును మేం ఏర్పాటు చేయబోతున్నాం.
20. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ
· అభివృద్ధి చెందిన భారత్ (‘వికసిత్ భారత్’) దిశగా సాగే పయనంలో యువజనులు ఒక కీలక పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. అంతే కాదు, ‘వికసిత్ భారత్’లో అతి పెద్ద లబ్ధిదారులుగా ఉండేది కూడా నా దేశ యువతయే.
· అందువల్ల, మనం మన యువతీయువకులను ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన ప్రస్థానంలో ముందుకు తీసుకువెళ్లక తప్పదు. మనం మన యువజనులకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చి, వారితో కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది.
· గత 10-12 సంవత్సరాల్లో ఈ దిశగా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘స్టార్టప్ ఇండియా’ ప్రచార ఉద్యమం వల్ల ప్రస్తుతం దేశమంతటా 2.5 లక్షల కన్నా ఎక్కువ అంకుర సంస్థలు నమోదయ్యాయి.
· మన దేశ యువత తమ కోసం ఉద్యోగాలను సృష్టించుకోవడంతో పాటు, ఎంతో మందికి కూడా ఉపాధిని కల్పిస్తున్నారు.
· లక్ష కోట్ల రూపాయలతో ‘ఇన్నొవేషన్ ఫండ్’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘‘దేశ యువజనులారా.. మీ కలలతో మా దగ్గరకు రండి, మీకు నిధుల లోటు లేకుండా మేం చూస్తాం..’’ ఈ మాటలను మన యువతకు నేను చెప్పదలుచుకున్నాను.
· ‘డిజిటల్ ఇండియా’ మాధ్యమం ద్వారా పరిశోధనకు కొత్త కొత్త అవకాశాలూ, తక్కువ ధరకే డేటా అందుబాటులోకి వస్తూ మన యువతకు సాధికారతను కల్పించాయి.
· సగటున 28 ఏళ్ల లోపు వయసున్న వారు నెలకొల్పిన భారతీయ ప్రయివేటు అంకుర సంస్థలు తమ ప్రథమ ప్రయత్నాల్లోనే మానవ నిర్మిత ఉపగ్రహాలనూ, రాకెట్లనూ ప్రయోగించి, ఎంతో పెద్ద పనిని ఇప్పటికే చేసి చూపించాయి.
· నమోదైన అంకుర సంస్థలు ఇవాళ 2.5 లక్షలకు పైనే ఉన్నాయి. ఇటీవలే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను నిర్వహించాం. కృత్రిమ మేధ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది.
· మన దేశ యువజనులను నేను దృష్టిలో పెట్టుకొని ఎర్రకోట బురుజుల మీది నుంచి ఒక ప్రకటన చేయదలుచుకున్నాను... వచ్చే సంవత్సర కాలంలో ఒక కోటి మంది యువతీయువకులకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణను అందించాలని మేం నిర్ణయించాం. దీంతో మన దేశ యువత ఏఐ జగతిలోనూ నాయకత్వం వహించే సామర్థ్యాన్ని సంపాదిస్తారు.
· బయోఎకానమీలో దేశ యువత తమ శక్తియుక్తులను నిరూపించుకుంది. 2014 కన్నా పూర్వం, ఈ రంగంలో టర్నోవర్ రూ.60,000 కోట్లు ఉంది. మిత్రులారా, ఇవాళ మన బయోఎకానమీ రూ.20 లక్షల కోట్లకు చేరుకుంది.
· ‘టీఓపీఎస్ పథకం’ గొప్పగా విజయవంతమైంది. ‘ఖేలో ఇండియా గేమ్స్’, ‘యూనివర్సిటీ గేమ్స్’, ‘శీతాకాల క్రీడలు’, బీచ్ ఆటలు, క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పన, క్రీడల్లో పాల్గొనడానికి అవసరమైన శిక్షణ, స్పోర్ట్స్ మెడిసిన్, క్రీడాకారుల పోషణ.. ఈ రంగాలన్నింటిలోనూ భారత్ ప్రస్తుతం ప్రావీణ్య సాధన దిశగా దూసుకుపోతోంది.
· క్రీడాజగతిలో భారత్ ప్రదర్శన మెరుగుపడుతోంది. మనం ‘2036 ఒలింపిక్స్’కు బలమైన పోటీదారులుగా మారే దిశగా సాగుతున్నాం. భారత్ 2030లో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనుంది.
· 2036 ఒలింపిక్స్కు భారత్ వేదిక కావాలని మనం కోరుకుంటున్నాం. అయితే భారత్ ప్రస్తుతం ఆడని, లేదా అర్హతను సాధించని, పోటీపడడం మానుకున్న విభాగాల్లో 2036లో క్రీడాపోటీలు జరగనున్నాయి.
· నాలుగింట మూడు వంతుల అవకాశాలు మన కోసం వేచి ఉన్నాయి. ఆయా విభాగాలపై భారత్ శ్రద్ధ వహిస్తుంది. మరి దీనికి గాను మేమొక ప్రతిభాన్వేషణ ప్రచార ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టాలనుకుంటున్నాం.
· 5- 15 ఏళ్ల లోపు బాలల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామ గ్రామాల్లోనూ, నగరాల్లోనూ, బడులలోనూ ప్రతిభాన్వేషణ ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తారు. వారి ప్రతిభను అంచనా వేసి, వారు దేశానికి ప్రాతినిధ్యం వహించేటట్లు మెరికల్లాంటి క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిక్షణను అందిస్తారు.
· మత్తుపదార్థాలకు బానిసలుగా మారడం దేశానికీ, దేశ యువతీయువకులకీ ఒక ప్రధాన సవాలుగా పరిణమిస్తోంది. మాదకద్రవ్యాలకు చోటుండని భారత్ (‘నషా ముక్త్ భారత్’)ను ఆవిష్కరించడం మన అందరి ఉమ్మడి బాధ్యత.
21. అంతరిక్ష విభాగం
· నేను చెబుతున్న ‘సప్త ధార’లో మూడో శక్తి... సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలకు సంబంధించింది. ప్రస్తుతం కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్తో పాటు డేటా సెంటర్ల కాలం నడుస్తోంది. పూర్తిగా ఒక కొత్త రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి.
· సరికొత్తగా తెర మీదకు వస్తున్న సాంకేతికతలు మనకు సవాళ్లను విసురుతున్నాయి. అందువల్ల, మనం ప్రపంచానికి ఒక మార్కెట్టుగా మాత్రమే మిగిలిపోకూడదు. నూతన ఆవిష్కరణలకు ఒక కూడలి (హబ్)గా నిలవాలి.
· అంతరిక్ష రంగంలో మేం అవకాశాలను అందించాం. జాతీయ డ్రోన్ విధానంతో పాటు ఖేలో ఇండియా విధానాన్ని కూడా రూపొందించాం. గత 35 సంవత్సరాలుగా విద్యావిధానమంటూ ఏదీ లేదు. అయితే మేం ఒక నూతన విద్యావిధానాన్ని ప్రారంభించాం. ఈ విధాన ప్రయోజనాలను మధ్యతరగతి కుటుంబాలు అందుకున్నాయి.
22. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ
· దేశ నిర్మాణంలో మన అక్కచెల్లెళ్లు, కుమార్తెలు పోషిస్తున్న పాత్ర మనందరికీ ఇవాళ ఒక గొప్ప స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉంటోంది. ఫైటర్ జెట్లు గాని, లేదా పౌర విమానయానం గాని.. మన కుమార్తెలు ముందు వరుసలో నిలుస్తున్నారు.
· 3 కోట్ల మంది అక్కచెల్లెళ్లు ‘లఖ్పతి దీదీలు’ (లక్షాధికారి అక్కచెల్లెళ్లు) గా ఎదిగేటట్లు చేయాలని మేం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇప్పుడు 6 కోట్ల మంది లఖ్పతి దీదీలకు సాయపడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం. 3 కోట్ల మంది కొత్తగా లఖ్పతి దీదీల స్థాయికి చేరుకొనేటట్లు చూడడమంటే, మహిళా శక్తి అందించే ఊతంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద మార్పు చోటు చేసుకొంటోందన్న మాటే.
· ఈ రోజు, ఎర్రకోట బురుజుల మీద మువ్వన్నెల జెండా నీడన నేను నిలబడి దేశంలో రాజకీయ పక్షాలన్నింటికీ ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను... అది, వీలయినంత త్వరగా చట్టసభల్లోనూ, లోక్సభలోనూ మన మాతృమూర్తులకీ, అక్కచెల్లెళ్లకీ 33 శాతం ప్రాతినిధ్యం దక్కేటట్లు చూసి మహిళలను గౌరవించుకోవడంలో ముందంజ వేద్దామని వాటిని కోరుతున్నాను. అదే జరిగితే, భారతదేశ విధాన రూపకల్పనలో వారు తమ వంతు పాత్రను పోషించే అవకాశాన్ని పొందగలుగుతారు.
· మహిళా రిజర్వేషన్ను అమలుచేసి, మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు వచ్చి, సహకరించాల్సిందిగా అన్ని రాజకీయ పక్షాలకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది తక్షణావసరం. దీనిలో మీరు కూడా కీర్తిని సంపాదించుకోండి, ఖ్యాతిని పొందండి. అయితే నా మాతృమూర్తులకీ, అక్కచెల్లెళ్లకీ మాత్రం వారి హక్కులను వారికి ఇవ్వండి.
23. సామాజిక న్యాయం, సాధికారత కల్పన మంత్రిత్వశాఖ
· ఈ ప్రయత్నాలను నేను ఆదరణపూర్వకంగా అంగీకరిస్తున్నాను... ఈ ప్రయత్నాలతో అతి కొద్ది కాలంలోనే ఫలితం లభించింది... 25 కోట్ల మంది పౌరులు పేదరికం నుంచి బయటకు వచ్చారు... వారు
జీవితంలో ఒక మెట్టు పైకి చేరారు.
· గత 5-7 దశాబ్దాల్లో 25 కోట్ల మంది మాత్రమే పేదరికం నుంచి బయటకు వచ్చారు. మేం ఒక్క దశాబ్దిలోనే 100 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత కవచాన్ని అందించాం.
· మేం 3 కోట్ల మంది అక్కచెల్లెళ్లను ‘లఖ్పతి దీదీలు’గా ఎదిగేటట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఆ లక్ష్యాన్ని అధిగమించాం. ఇప్పుడు 6 కోట్ల మంది ‘లఖ్పతి దీదీలు’గా ఎదిగేటట్లు చేసే దిశగా పయనిస్తున్నాం.
· 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను కొత్తగా తీర్చిదిద్దడం మహిళా శక్తి సాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలలో చెప్పుకోదగిన మార్పును తీసుకురావడాన్ని సూచిస్తోంది.
· పేదలకు టాయిలెట్లను నిర్మించే పనులు ప్రతి సంవత్సరం నాలుగింతల వేగంతో పురోగమిస్తున్నాయి.
· పేదలకు ఇళ్లను అందించే దిశగా పనులు ఏటా మూడింతల వేగంతో పురోగమిస్తున్నాయి.
· ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా, 5 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని ప్రస్తుతం 70 ఏళ్లు, అంతకు పైబడిన వయసు కల పౌరులకు కూడా అందిస్తున్నారు.
24. గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ
· గత 12 సంవత్సరాల్లో, దేశం నలుమూలలా ఎంతో మంది పౌరులు.. వారు దళితులు కావొచ్చు, లేదా అణచివేతకు గురి అయిన వారు, ఆదరణకు నోచుకోని వర్గాలు, లేదా గిరిజనులు, గ్రామీణులు, నగర వాసులు, పేదలు లేదా మధ్యతరగతికి చెందిన వారు, యువత లేదా వృద్ధులు, మహిళలు, పురుషులు, ఉత్తరాది, దక్షిణాది, తూర్పు ప్రాంతాల వారు, లేదా పశ్చిమ రాష్ట్రాల వారు కావొచ్చు.. అందరూ దేశాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చడానికి ఉమ్మడి సంకల్పంతో, అంకిత భావంతో తమ చేతనైన స్థాయుల్లో సేవలను అందించారు.
· 25. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
· · మేం గతంలో కంటే సగటున 15 రెట్లు వేగంగా మంచి నీటి కనెక్షన్లను అందించాం. ప్రతి ఏటా సగటున ఆరు రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.
· · పేదలకు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రతి ఏటా నాలుగు రెట్ల వేగంతో చేపట్టాం. ప్రతి ఏటా పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని మూడు రెట్ల వేగంతో అందించాం.
· · 3 కోట్ల మంది సోదరీలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్ది సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ లక్ష్యాన్ని అధిగమించాం. ఇప్పుడు 6 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారుచేసే దిశగా ముందుకు సాగుతున్నాం.
· · కొత్తగా 3 కోట్ల మంది లఖ్పతి దీదీలు రూపొందడం అనేది మహిళా శక్తి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన భారీ మార్పుకు నిదర్శనం.
· · 26. జలశక్తి మంత్రిత్వ శాఖ
· · ప్రతి ఏటా సగటున 15 రెట్లు వేగంగా కుళాయి నీటి కనెక్షన్లను అందించాం.
· · పేదలకు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రతి ఏటా నాలుగు రెట్ల వేగంతో పూర్తి చేశాం.
· 27. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
· · మన యువత కోసం విమానయాన రంగం కూడా చాలా వేగంగా ఎదుగుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త మార్గాలు, నూతన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
· · విమానాల నిర్వహణ, పూర్తి స్థాయి మరమ్మతులు సంబంధిత కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ఉన్న అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఉద్యోగాలను అందిస్తున్నాయి.
· · మేడ్ ఇన్ ఇండియా విమానాల తయారీ దిశగా మనం విజయం సాధించాం.
· · మేడ్ ఇన్ ఇండియా సీ295 రక్షణ రవాణా విమానం ఇప్పటికే తన విజయవంతమైన విమాన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
· 28. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
· · భారత ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్లతో నూతన ఆవిష్కరణల నిధిని ప్రకటించింది. దేశ యువతకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ కలలతో ముందుకు రండి, వనరుల కొరత లేకుండా మేం చూసుకుంటాం.
· · మన దేశంలోని చిన్న పిల్లలకు చిన్ననాటి నుంచే సాంకేతికతపై ఆసక్తి పెరిగేలా మనం కృషి చేస్తున్నాం. అందుకే 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్నారులకు అందుబాటులో ఉంచాం. తద్వారా వారు వినూత్న ఆలోచనలు, సాంకేతికత వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాం.
· · పరిశోధనలకు లభిస్తున్న కొత్త అవకాశాలు, డిజిటల్ ఇండియా కింద చౌకగా లభిస్తున్న డేటా మన యువతకు మరింత శక్తినిచ్చాయి.
· 29. జీవ సాంకేతిక శాఖ
· · దేశ యువశక్తి జీవ ఆర్థిక వ్యవస్థ రంగంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. మిత్రులారా, 2014 కంటే ముందు రూ. 60,000 కోట్ల టర్నోవర్తో ఉన్న జీవ ఆర్థిక వ్యవస్థ నేడు రూ. 20 లక్షల కోట్లకు చేరుకుంది.
· 30. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
· · గతంలో 2009-10లో కేవలం 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2025-26 నాటికి ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి.
· 31. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
· · ఎర్రకోట నుంచి దేశ యువత కోసం నేను ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే ఒక సంవత్సరంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతుంది.
· · విమానయాన రంగం కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. మన యువతకు నూతన అవకాశాలను సృష్టిస్తోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త మార్గాలు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి.
· · విమానాల నిర్వహణ, సమగ్ర తనిఖీ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ఉన్న భారీ సంఖ్యలోని నైపుణ్యం కలిగిన మానవవనరులకు ఉద్యోగాలను అందిస్తున్నాయి.
· · మేడ్ ఇన్ ఇండియా విమానాల తయారీలో మనం విజయం సాధించాం. మేడ్ ఇన్ ఇండియా సీ295 రక్షణ రవాణా విమానం ఇప్పటికే తన విజయవంతమైన విమాన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
· 32. న్యాయ, చట్ట వ్యవహారాల మంత్రిత్వ శాఖ
· · దేశ పాలనలో కూడా మనం గణనీయమైన మార్పులను తీసుకువచ్చాం. వేలాది నిబంధనల భారాన్ని తొలగించాం. వందలాది పాతబడిన చట్టాలను రద్దు చేశాం. గత శతాబ్దపు చట్టాలు 21వ శతాబ్దపు వేగాన్ని అందుకోలేవు.
· · ఈ విషయమై నేను రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇది భారత ప్రభుత్వ బాధ్యత కూడా. మనం మన సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలి.
· · 2047 నాటి లక్ష్యాలకు అనుగుణంగా మనం మన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. గడిచిపోయిన కాలపు విధానాలు, నియమాలతో మనం ఇక ముందుకు సాగలేము. భవిష్యత్తు కలలు, ఆకాంక్షలకు తగినట్లుగా మనం కొత్త విధానాలను, నిబంధనలను రూపొందించుకోవాలి.
· 33. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ. భారత జనాభా గణన
· జనగణన ప్రక్రియ కొనసాగుతోంది. లెక్కింపు జరుగుతోంది. అయితే జనగణన అంటే కేవలం సంఖ్యలను లెక్కించడం మాత్రమే కాదు.
· ఈ గణాంకాల్లోని సూక్ష్మ వివరాలే విధానాలు. ప్రణాళికలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశ పురోగతికి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించేందుకు ఇవి దోహదపడతాయి. అందుకోసం కచ్చితమైన సమాచారం ఉండటం ఎంతో ముఖ్యం.
· దేశ యువత తమ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని జనగణన ఫారాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను.
· ఇంత పెద్ద కార్యక్రమాన్ని దేశం విజయవంతంగా పూర్తి చేయనుంది. దేశ సమయం, శక్తి సరైన పనికి వినియోగించేలా జనగణన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొనాలని నేను కోరుతున్నాను.
· 34. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఔషధాల విభాగం
· ఔషధ రంగంలో మనం ఎంతో కృషి చేశాం. అయితే ప్రస్తుతం అవసరమైనది ఏంటంటే.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు ఔషధ కంపెనీల్లో ఒకటి లేదా రెండు భారతీయ ఔషధ కంపెనీలు స్థానం సంపాదించాలి.
· ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థల్లో మన భారతీయ కన్సల్టింగ్ సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు ఎందుకు ఉండకూడదు? భారతీయ టెక్నాలజీ కంపెనీలను ప్రపంచంలోనే అగ్రగాములుగా నిలపడం మన లక్ష్యం కావాలి.
· ప్రపంచాన్ని ఆకర్షించే భారతీయ బ్రాండ్లు మనకు ఉండాలి. మన బ్రాండ్లను దేశానికి గుర్తింపుగా, ప్రపంచానికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు మనం కృషి చేయాలి.
· మన కన్సల్టింగ్ సంస్థలు, అకౌంటింగ్ సంస్థలు ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో ఎందుకు ఉండకూడదు? భారతీయ సాంకేతిక కంపెనీలను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే మన లక్ష్యం
· 35. అభివృద్ధి చెందిన భారత్
· ఒక దేశం అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు. ప్రతి పౌరుడూ దేశంలో భాగమే. ఫార్చ్యూన్ 500 కంపెనీల గురించి మనం తరచూ వింటుంటాం. రాబోయే దశాబ్దంలో ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 భారత్ చెందినవిగా ఉండాలని మనం లక్ష్యంగా పెట్టుకోలేమా?
· ప్రపంచాన్ని ఆకర్షించే భారతీయ బ్రాండ్లు మనకు ఉండాలి. మన బ్రాండ్లను దేశానికి గుర్తింపుగా, ప్రపంచానికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు మనం కృషి చేయాలి.
· ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నేను చెప్పదలచుకున్నది ఏంటంటే... భారత ప్రభుత్వ బాధ్యత కూడా ఇదే. మన సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలి.
· 2047 లక్ష్యాలను సాధించేలా మన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. గతంలోని విధానాలు, నిబంధనలపైనే ఆధారపడకూడదు. భవిష్యత్తుపై మన ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలను రూపొందించాలి.
· ఎర్రకోట నుంచి నేను ‘పంచ ప్రాణ్’ (అయిదు సంకల్పాల) గురించి మాట్లాడాను. ఈ అయిదు సంకల్పాలు దేశానికి అపారమైన శక్తిని అందించాయి. ఆత్మగౌరవంతో ముందుకు సాగేందుకు, నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించే సామర్థ్యాన్ని దేశానికి కల్పించాయి. బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం నిర్మూలిస్తూనే ఉండాలి.
· · వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనమే ఉన్నతమైనదిగా ఉండాలి. మన స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కర్తవ్యమే మన గుర్తింపుగా ఉండాలి. నా దేశ ప్రజలందరికీ నేను చెప్పదలచుకున్నది ఏంటంటే..సమయం మనది, అవకాశం మనది, సంకల్పం మనది. మన కలలను సంకల్పాలుగా, సంకల్పాలను శక్తిగా, ఆ శక్తిని విజయంగా మార్చుకుందాం.
· మన ప్రతి అడుగూ అభివృద్ధి వైపు పడే అడుగుగా ఉండాలి. అడుగులో అడుగు కలుపుదాం, హృదయంతో హృదయాన్ని కలుపుదాం, మన లక్ష్యంతో అనుసంధానమై కొనసాగుదాం. ఒక దీపం వేల దీపాలను వెలిగిస్తుంది. మనమందరం కలిసి వికసిత భారత్ను నిర్మిద్దాం.
***
(रिलीज़ आईडी: 2300023)
आगंतुक पटल : 10