చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యాయ విభాగంలో నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్
చట్టాలను సులభంగా, వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా, మరింత పౌర కేంద్రకంగా మార్చేలా మెరుగుపరిచిన పోర్టల్
ఏఐ ఆధారిత, సిమాంటిక్, స్పీచ్ శోధనలు, మెరుగైన నేవిగేషన్, బహుళ భాషల్లో సమాచారం లాంటి కీలకమైన ఫీచర్లు
प्रविष्टि तिथि:
13 AUG 2026 8:54PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్–2లో 2026 ఆగస్టు 13న నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్ను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ ఆర్ వెంకటరమణి, శాసన విభాగం, న్యాయ వ్యవహారాల విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి, అదనపు కార్యదర్శి డాక్టర్ మనోజ్ కుమార్, శాసన విభాగానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటుగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రియాంక్ భార్తి, ఇండియా ఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సుదీప్ శ్రీవాస్తవ, ఎన్ఐసీకి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి అందరికీ సులభంగా, వేగంగా చట్టాలను అందుబాటులోకి తీసుకురావడానికీ, వాటిని పౌర కేంద్రకంగా మార్చడానికీ ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ముఖ్యమైన సందర్భాన్ని నవీకరించిన ఈ పోర్టల్ ప్రారంభం సూచిస్తుంది.
ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యాంగ ప్రాముఖ్యాన్ని, అందరికీ చట్టాలు సులభంగా అందుబాటులో ఉండేలా, అర్థమయ్యేలా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. రాజ్యాంగం, కేంద్ర చట్టాలు, నిబంధనలు, ఇతర శాసనపరమైన సమాచారాన్ని పౌరులు సులభంగా పొందేందుకు విశ్వసనీయమైన, సమగ్రమైన వేదికగా ఇండియా కోడ్ పోర్టల్ పనిచేస్తుందన్నారు. చట్టాన్ని ప్రజలకు చేరువ చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర గురించి వివరించారు. ఈ పోర్టల్ను మెరుగుపరచడంలో, సమన్వయం చేయడంలో, పర్యవేక్షించడంలో శాసన విభాగ అధికారులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషిని అభినందించారు. అలాగే సాంకేతిక నైపుణ్యం, అభివృద్ధిలో తోడ్పాటు అందించిన ఎన్ఐసీ బృందాన్ని కూడా ప్రశంసించారు. చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు మరింత సులభంగా, పారదర్శకంగా, వారి అవసరాలకు అనుగుణంగా అందించడంలో ఈ ఉమ్మడి కృషి గణనీయంగా తోడ్పడుతుందని శ్రీ మేఘ్వాల్ తెలిపారు.
చట్టాలను భౌతిక రూపం నుంచి డిజిటల్ రూపంలోకి తీసుకురావడం గురించి శ్రీ ఆర్ వెంకటరమణి వివరించారు. నూతన, వినియోగదారునికి అనుకూలమైన ఫీచర్లతో అభివృద్ధి చేసిన నూతన ఇండియా కోడ్ పోర్టల్ను ప్రశంసించారు. వెబ్సైటును సాంకేతికపరంగా నవీకరించడం, కొత్తగా ఎదురవుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించేలా చూడటానికున్న ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. స్పష్టమైన, సమర్థమైన, నాణ్యమైన చట్టాల రూపకల్పనలో శాసన విభాగ అధికారుల బాధ్యత గురించి తెలియజేశారు. చట్టాలను అందరికీ చేరువ చేయాల్సిన అవసరముందన్నారు. ఈ కొత్త పోర్టల్ రూపకల్పనలో శాసన విభాగం, సాంకేతిక బృందం చేసిన సమన్వయ కృషిని ఆయన ప్రశంసించారు. దీని ద్వారా చట్టాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు మరింత పారదర్శకంగా చేరువవుతుందని ఆయన తెలిపారు.
ఇండియా కోడ్ పోర్టల్ పరిణామాన్ని శాసన విభాగం, న్యాయ వ్యవహారాల శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి వివరించారు. పౌరులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ విభాగాలు, ఇతర భాగస్వాములకు చట్టాల గురించి కచ్చితమైన, తాజా సమాచారాన్ని సులభంగా అందించేందుకు చేస్తున్న కృషిని ఆయన తెలియజేశారు. చట్టాలను అందరికీ చేరువయ్యేలా చేయడంలో సాంకేతికత పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నవీకరించిన పోర్టల్లో ఏర్పాటు చేసిన సులభమైన ఇంటర్ఫేస్, మెరుగైన శోధన, నావిగేషన్, యాక్సెస్ లాంటి ప్రధాన ఫీచర్ల గురించి వివరించారు. ఈ పోర్టల్ రూపకల్పనలో శాసన విభాగం, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) చేసిన సమన్వయ కృషిని ఆయన అభినందించారు. ఈ కొత్త వేదిక ద్వారా చట్టాలకు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం ప్రజలకు మరింత విస్తృతంగా, సులభంగా అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్ గురించి శాసన విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ మనోజ్ కుమార్ వివరించారు. దీని ప్రధాన ఫీచర్లను, ఈ మార్పు వెనక ఉన్న విస్తృత లక్ష్యాల గురించి తెలియజేశారు. న్యాయాన్ని పొందడానికి చట్టాల గురించి తెలుసుకోవడమే తొలి మెట్టు అని ఆయన చెప్పారు. అలాగే.. చట్టాలు అందుబాటులో ఉండటంతో పాటు వాటిని సులభంగా వెతికి అర్థం చేసుకొని, ఉపయోగించుకొనేలా ఉండాలన్నారు. చట్టపరమైన పత్రాల భాండాగారంలా మాత్రమే కాకుండా.. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే పౌర కేంద్రీకృత డిజిటల్ వేదికగా ఈ నూతన పోర్టల్ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. మెరుగైన సెర్చ్, నావిగేషన్, చట్టాలకు అనుబంధ చట్టాలతో అనుసంధానం, ఈ-గెజిట్ వ్యవస్థతో విలీనం, ఏఐ ఆధారిత సెర్చ్, వాయిస్ ద్వారా వెతికే సదుపాయం, బహుళ భాషల మద్దతు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలియజేశారు. చట్టానికీ, ప్రజలకూ మధ్య ఉన్న దూరాన్ని సాంకేతికత తగ్గించాలని ఆయన స్పష్టం చేశారు. చట్టపరమైన సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకునేలా, వాడుకునేలా చేయాలని సూచించారు. తద్వారా పారదర్శకత, చట్టాలపై అవగాహన, పౌర కేంద్రీకృత పాలన మరింత బలోపేతమవుతాయన్నారు.
కేంద్ర చట్టాలు, వాటి అనుబంధ చట్టాలు, రాష్ట్ర చట్టాలు, వాటి అనుబంధ చట్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు, నిబంధనలను ఒకే చోట అందించే డిజిటల్ వేదికగా ఇండియా కోడ్ పనిచేస్తుంది. కొత్తగా తీర్చిదిద్దిన ఈ పోర్టల్ ద్వారా చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు, న్యాయ నిపుణులు, పరిశోధకులు, న్యాయవ్యవస్థ, ప్రభుత్వం సులభంగా శోధించి, వాటిని పొందవచ్చు. ఇందులో మెరుగైన ఇంటెలిజెంట్ సెర్చ్, ఏఐ ఆధారిత, సెమాంటిక్, స్పీచ్ ఆధారిత శోధనలు, చట్టాల సవరణలు, వాటి చరిత్రకు సంబంధించిన సమాచారం, సంబంధిత అనుబంధ చట్టాలతో చట్టాల అనుసంధానం, ఈ-గెజిట్ వ్యవస్థతో ఏకీకరణ, మెరుగైన డాక్యుమెంట్ వీక్షణ, క్యూఆర్ ఆధారిత యాక్సెస్, క్రమబద్ధమైన పౌర అభిప్రాయ సేకరణ విధానం ఉన్నాయి. ఇది రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చిన 22 భాషల్లోనూ చట్టాలను ఏఐ ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తుంది. తద్వారా దేశం అంతటా చట్టాలను విస్తృతంగా, సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చి మరింత పౌరకేంద్రకంగా మారుస్తుంది.
ఇండియా కోడ్ను కేవలం చట్టాలను భద్రపరిచే ఆన్లైన్ భాండాగారంగా మాత్రమే కాకుండా, చట్టాలను సులభంగా అందించే డిజిటల్ వేదికగా మార్చడమే ఈ సాంకేతిక ఆధునికీకరణ ప్రధాన లక్ష్యం. దీనికి పరస్పర అనుసంధానమైన, పౌరులకు అనుకూలమైన న్యాయ సమాచార వ్యవస్థ అండగా నిలుస్తుంది.
చట్టాలను సులభంగా తెలుసుకోవడం, పారదర్శకతను పెంచడం, పౌరుల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం, న్యాయ, పౌర సేవలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించడానికి సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది.
భారతదేశం కోసం విశ్వసనీయమైన, సాంకేతికత ఆధారిత న్యాయ సమాచార వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన ముఖ్యమైన అడుగే నవీకరించిన ఇండియా కోడ్ పోర్టల్. దీని ద్వారా చట్టాలను సులభంగా వెతికి, వాటి గురించి తెలుసుకోవచ్చు. అలాగే చట్టాల మధ్య ఉన్న సంబంధాలను కూడా తెలుసుకోవచ్చు. పౌరులకు అనువైన భాషలో, రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి.
***
(रिलीज़ आईडी: 2299469)
आगंतुक पटल : 3