పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆవాల జన్యు వనరుల నుంచి వచ్చిన రూ.15.52 కోట్ల ఏబీఎస్ నిధులను విడుదల చేసిన జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ
ఈ మొత్తాన్ని ఆవాల సాగు విస్తీర్ణం ఆధారంగా 26 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు, 3 కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య మండళ్ల మధ్య పంపిణీ
प्रविष्टि तिथि:
13 AUG 2026 8:44AM by PIB Hyderabad
భారతదేశ జీవ వనరులను ఉపయోగించి పది వాణిజ్య రకాల ఆవాల (బ్రాస్సికా జున్సియా) హైబ్రిడ్ వంగడాలను అభివృద్ధి చేసిన ఎంఎస్. పయనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ నుంచి యాక్సెస్, బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్) ద్వారా రూ.15.52 కోట్ల నిధులను జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) విడుదల చేసింది. ఆవాల సాగు విస్తీర్ణం ఆధారంగా ఈ మొత్తాన్ని 26 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు (ఎస్ బీబీలు), 3 కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య మండళ్ల (యూటీబీసీలు) మధ్య పంపిణీ చేయనున్నారు.
ఈ పది రకాలను ఎంఎస్. పయనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ సంస్థలోనే అభివృద్ధి చేసినా… జన్యువులను మాత్రం బహిరంగ మార్కెట్లు, ట్రేడర్ల నుంచి సేకరించింది. వనరులకు సంబంధించి ఏ ఒక్క రైతును, వర్గాన్ని మూలంగా గుర్తించటానికి వీల్లేని సందర్భాల్లో ఏబీఎస్ నిధులను పంపిణీ చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించటానికి నిపుణుల కమిటీని ఎన్బీఏ ఏర్పాటు చేసింది.
నిపుణల కమిటీ సూచించిన విధివిధానాలను అథారిటీ ఆమోదించింది. దీని ప్రకారం.. మధ్యవర్తుల ద్వారా జీవ వనరులను సేకరించిన సందర్భాల్లో, ఆ వనరులను సాగు చేస్తున్న ఎస్బీబీలు, యూటీబీసీల మధ్య ఏబీఎస్ వాటాను పంపిణీ చేయాలి. రాజస్థాన్లోని భరత్పూర్లో ఐసీఏఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాపీసీడ్ మస్టర్డ్ రీసెర్చ్ నుంచి సాగు విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాలను ఎన్బీఏ సేకరించింది. ప్రతి రాష్ట్ర వాటాను లెక్కించేందుకు ఈ గణాంకాలను ఉపయోగించింది.
భారతదేశంలో 42 శాతం ఆవాల సాగు చేస్తున్న రాజస్థాన్ భారీగా ప్రయోజనాలను పొందుతోంది. ఆ తర్వాత వరుసలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆవాల సాగు విస్తరించటంతో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం సమానంగా వాటాను అందుకుంటున్నాయి. అత్యధికంగా ఏబీఎస్ను పొందుతున్న మొదటి పది రాష్ట్రాలు:
|
క్రమ సంఖ్య.
|
రాష్ట్రం
|
విడుదలైన నిధులు (రూ. కోట్లలో)
|
|
1.
|
రాజస్థాన్
|
6.43
|
|
2.
|
ఉత్తరప్రదేశ్
|
2.28
|
|
3.
|
మధ్యప్రదేశ్
|
1.86
|
|
4.
|
హర్యానా
|
1.21
|
|
5.
|
పశ్చిమబెంగాల్
|
1.10
|
|
6.
|
జార్ఖండ్
|
0.73
|
|
7.
|
అస్సాం
|
0.53
|
|
8.
|
గుజరాత్
|
0.48
|
|
9.
|
బీహార్
|
0.15
|
|
10.
|
పంజాబ్
|
0.08
|
|
11.
|
ఇతరులు
|
0.67
|
జీవవైవిధ్య చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం ప్రతి ఎస్బీబీ, యూటీబీసీ... ఏబీఎస్ మొత్తాన్ని వినియోగించాలి. ఇందులో సంరక్షణకు సంబంధించిన పనులు, ప్రజల జీవవైవిధ్య రిజిస్టర్లను డాక్యుమెంట్ చేయటం, అప్డేట్ చేయటం, జీవవైవిధ్యాన్ని నివాస స్థానంలోనే, ఇతర ప్రాంతాల్లో పరిరక్షించటం, దెబ్బతిన్న ఆవరణ వ్యవస్థలను పునరుద్ధరించటం, జీవవైవిధ్య వారసత్వ ప్రాంతాలను బలోపేతం చేయటం, జీవవైవిధ్య నిర్వహణ కమిటీల సామర్థ్యాన్ని పెంపొందించటం, జీవనోపాధిని మెరుగుపరచటం వంటి ఇతర కార్యకలాపాలు ఉంటాయి.
భారత జీవవైవిధ్య చట్టం-2002 ద్వారా ఎన్బీఏ చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ నిధుల విడుదల ఒక భాగం. భారత జన్యు వనరుల ద్వారా వాణిజ్యపరమైన విలువను సృష్టించినప్పుడు ఆ లాభంలో కొంత మొత్తాన్ని జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న రాష్ట్రాలు, స్థానిక కమ్యూనిటీల సంక్షేమానికి, పరిరక్షణకు వెచ్చించేలా చూడటం దీని ఉద్దేశం. నగోయా ప్రోటోకాల్, కున్మింగ్-మాంట్రియల్ ప్రపంచ జీవవైవిధ్య వ్యవస్థలోని టార్గెట్-13 ప్రకారం న్యాయమైన, సమానమైన ప్రయోజనాల పంపిణీకి అనుగుణంగా ఇది ఉంటుంది.
ఇప్పటివరకు ఎన్బీఏ మొత్తం రూ.182.5 కోట్ల ఏబీఎస్ నిధులను విడుదల చేసింది. గత 12 నెలల్లోనే రూ.116.22 కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అందించింది.
జాతీయ జీవవైవిధ్య అథారిటీ గురించి
జీవవైవిధ్య చట్టం-2002 ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి గల సంస్థ జాతీయ జీవవైవిధ్య అధారిటీ. భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. భారతదేశ జీవ వనరులు, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందే విధానాన్ని ఇది నియంత్రిస్తుంది. ప్రయోజనాలను న్యాయంగా, సమానంగా పంచుకోవాలనే నగోయా ప్రోటోకాల్ సుత్రాన్ని అమలు చేస్తుంది.
****
(रिलीज़ आईडी: 2298844)
आगंतुक पटल : 8