ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారతదేశ ఈశాన్య సరిహద్దు వెంట డీఆర్ఐ నిఘా
మూడు కీలక ఆపరేషన్లలో మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా చేసిన 15 కిలోల మెథాంఫేటమిన్, 11 ఎంటీల విదేశీ గసగసాలు, 10 ఎంటీల పోకచెక్కలను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ… ముగ్గురి అరెస్ట్
प्रविष्टि तिथि:
07 AUG 2026 3:06PM by PIB Hyderabad
భారతదేశ ఈశాన్య ప్రాంతాల సరిహద్దుల వెంట అంతర్రాష్ట్ర స్మగ్లింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన డీఆర్ఐ.. పక్కా సమాచారంతో మిజోరాం, అస్సాం రాష్ట్రాల్లో వరుస ఆపరేషన్లను నిర్వహించింది. ఈ ఆపరేషన్ల ద్వారా 15 కిలోల మెథాంఫేటమిన్, 11 ఎంటీల విదేశీ గసగసాలు, 10 ఎంటీల పోకచెక్కలను స్వాధీనం చేసుకుంది.
మాదకద్రవ్యాల నిషేధం కోసం నిన్న డీఆర్ఐ అధికారులు కీలక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా ఐజ్వాల్కు 40 కి.మీ. దూరంలో ఐజ్వాల్-చంఫాయ్ రోడ్డులోని సైకీ బంగ్లా సమీపంలో అంబులెన్స్ను అడ్డుకున్నారు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితిని సృష్టించి ఆ అంబులెన్స్లో అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు అనుమానించి, తనిఖీలు చేపట్టారు. రోగి మంచం పక్కన తెల్లని హెచ్డీపీఈ సంచిలో ఇటుక ఆకారంలో 15 ప్యాకెట్లను గుర్తించారు. వాటిలో దాదాపు 15 కిలోల గులాబీ-నారింజ రంగులో ఉన్న మెథాంఫేటమిన్ మాత్రలు బయటపడ్డాయి. ఆ సమయంలో అంబులెన్స్లో నకిలీ రోగి ఉన్నాడు. ఈ మత్తు పదార్థాలను మయన్మార్ నుంచి చంపై-జోఖవ్థార్ సెక్టార్ మీదుగా మిజోరాంకు తరలించారని, అనంతరం అస్సాంకు చేరవేయటం లక్ష్యమని ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న మెథాంఫేటమిన్తో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన అంబులెన్స్ను ఎన్డీపీఎస్ చట్టం-1985 ద్వారా సీజ్ చేశారు. అంబులెన్స్ డ్రైవర్, అతనికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు.

మెథాంఫేటమిన్ మాత్రలను సాధారణంగా "యాబా" అని పిలుస్తారు. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే అత్యంత వ్యసనపరమైన సింథటిక్ డ్రగ్. అక్రమంగా తయారైన మెథాంఫేటమిన్ మాత్రలను మయన్మార్ నుంచి రవాణా చేస్తారు. ఇవి వ్యసనం, కోపం, ఆందోళన, దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన శారీరక, మానసిక ముప్పును కలిగిస్తాయి. దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున సైకోట్రోపిక్ పదార్ధమైన మెథాంఫేటమిన్ ను ఎన్డీపీఎస్ చట్టం-1985 ప్రకారం నియంత్రిస్తారు. దీని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదకద్రవ్యాల నిరోధక చట్ట అమలు సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.

ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన మరో ఆపరేషన్లో డీఆర్ఐ అధికారులు, అస్సాం రైఫిల్స్ సహకారంతో సోదాలు చేపట్టారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్లోని గోడౌన్లో ఆగస్టు 5 నుంచి 6,2026వ తేదీల్లో మధ్య రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో వాణిజ్యపరమైన టీ సరకు గుర్తులున్న హెచ్డీపీఈ బ్యాగులు, అట్టపెట్టెల్లో విదేశాలకు చెందిన దాదాపు 11 ఎంటీల గసగసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సరకును సులభంగా దాటగలిగేలా ఉన్న భారత్-మయన్మార్ సరిహద్దుల గుండా అక్రమంగా భారతదేశంలోకి రవాణా చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు రూ. 1.67 కోట్ల విలువైన ఈ గసగసాలను కస్టమ్స్ చట్టం-1962 ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
అనేక వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా గసగసాలను ఉపయోగిస్తారు. అయితే భారతదేశంలోకి వీటి దిగుమతి కఠినమైన నిబంధనలకు లోబడి ఉంటుంది. భారతదేశ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం… గసగసాలను కేవలం నిర్దేశిత దేశాల నుంచి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలి. చట్టబద్ధమైన సరఫరా వ్యవస్థలోకి అక్రమంగా పండించిన ఉత్పత్తులు రాకుండా నిరోధించేందుకు, వాటి వివరాలను తెలుసుకునేందుకు ఈ నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి గసగసాలను అక్రమ రవాణా చేయటం వల్ల ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. చట్టబద్ధమైన వ్యాపారం, నియంత్రణ పర్యవేక్షణ కూడా దెబ్బతింటాయి.
ఆగస్టు 5, 2026న రంగియా రైల్వేస్టేషన్లో 22411 నంబర్ రైలులో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. ఆ రైలులోని పార్శిల్ వ్యాను నుంచి విదేశాలకు చెందిన 10 ఎంటీల పోకచెక్కలున్న 120 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు మయన్మార్ నుంచి భారత్ కు అక్రమంగా రవాణా అయిందని, ఈశాన్య ప్రాంతం వెలుపలున్న మార్కెట్లకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు కోటి రూపాయల విలువైన ఈ పోకచెక్కలను కస్టమ్స్ చట్టం-1962 ద్వారా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సుపారిగా పిలిచే పోకచెక్కలు.. భారతదేశ ఈశాన్య సరిహద్దుల గుండా అక్రమంగా రవాణా అయ్యే అత్యంత సాధారణ వస్తువుల్లో ఒకటి. విదేశాల నుంచి పెద్దఎత్తున పోకచెక్కలను అక్రమంగా రవాణా చేయటం వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోవటమే కాక, దేశీయ రైతుల జీవనోపాధి దెబ్బతింటుంది. సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న వ్యవస్థీకృత అక్రమ రవాణా ముఠాలతో ఈ వ్యాపారానికి సంబంధాలు ఉండటం వల్ల అధికారులకు సమస్యగా మారుతోంది.
***
(रिलीज़ आईडी: 2296161)
आगंतुक पटल : 9