రక్షణ మంత్రిత్వ శాఖ
టెరిటోరియల్ ఆర్మీపై రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ సలహా సంఘం సమావేశం
प्रविष्टि तिथि:
06 AUG 2026 12:36PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సలహా మండలి గురువారం (ఆగస్టు 6, 2026) న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘టెరిటోరియల్ ఆర్మీ’ ప్రధాన అంశంగా విస్తృతంగా చర్చించారు. భేటీలో సలహా మండలి సభ్యులకు టెరిటోరియల్ ఆర్మీ బాధ్యతలు, పాత్ర, సాధించిన కీలక విజయాలపై రక్షణ శాఖ ఉన్నతాధికారులు వివరంగా తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి సభ్యులు పలు విలువైన సూచనలు చేశారు.
సమావేశాన్ని ఉద్దేశించి రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో టెరిటోరియల్ ఆర్మీ అందిస్తున్న సహకారం ఎంతో గణనీయమైనదని కొనియాడారు. సాధారణ రక్షణ బలగాల బాధ్యత ప్రధానంగా దేశ భద్రత చుట్టూనే తిరుగుతుంది. కానీ, టెరిటోరియల్ ఆర్మీ దానికి భిన్నంగా పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో కూడా విశేషంగా సేవలందిస్తోందని చెప్పారు. ‘‘టెరిటోరియల్ ఆర్మీ పౌర-సైనికుడు భావనకు ఒక సజీవ రూపం. ఇందులో పని చేసే సైనికులు, అధికారులు ఒకవైపు తమ సొంత ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే... మరోవైపు సైనిక యూనిఫాం ధరించి దేశ సరిహద్దులను కాపాడటంలో, అంతర్గత భద్రతను నిర్వహించడంలో భాగస్వాములవుతున్నారు’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.

అవసరమైన సమయాల్లో తక్షణమే రంగంలోకి దిగేలా శిక్షణ పొందిన సైనికుల రిజర్వ్ బలగాన్ని సిద్ధంగా ఉంచడం ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రక్షణ దళాలకు కొండంత అండగా నిలుస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమ సర్వీసు కాలం పూర్తయ్యాక ఈ సైనికులు తిరిగి సాధారణ పౌర జీవితంలోకి వెళ్లినప్పుడు, వారు సమాజానికి, సైన్యానికి మధ్య ఒక బలమైన వారధిగా పనిచేస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇది యువతలో సైన్యంలో చేరాలనే తీవ్రమైన ఆకాంక్షను, స్ఫూర్తిని నింపుతుందని ఆయన అన్నారు.
‘‘ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీ అత్యంత క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన బలగంగా నిలిచింది. ఇందులో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 రకాల విభిన్న విభాగాలు సేవలందిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణమే స్పందించి సహాయం అందించే ‘ఫస్ట్ రెస్పాండర్స్’ (తొలి స్పందనదారు)గా టెరిటోరియల్ ఆర్మీ సేవలు గొప్పవి’’ అని మంత్రి కొనియాడారు. కేరళ వరదలు, ఒడిశా తుఫాను, అసోంలో ఇటీవల సంభవించిన వరదల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ అందించిన సహాయక చర్యలు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తక్షణ వైద్య సదుపాయాలు అందించడం వంటి సేవలను శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.
పర్యావరణ నిర్వహణ, వాతావరణ మార్పుల నివారణలో టెరిటోరియల్ ఆర్మీ అందిస్తున్న సేవలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మొక్కలను నాటినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, నాటిన మొక్కల్లో 80 నుంచి 85 శాతం సురక్షితంగా పెరగడం వారి అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ఈ హరిత కార్యక్రమాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ‘మిషన్ లైఫ్’, ‘పంచామృత్’ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో నిజం చేస్తున్నాయని పేర్కొన్నారు. వీటితోపాటు జమ్మూ కశ్మీర్లో విధుల్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ బలగాలు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, త్రివిధ దళాల అధిపతి జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి, భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, రక్షణ ఉత్పత్తుల శాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్, రక్షణ ఆర్థిక శాఖ కార్యదర్శి విశ్వజిత్ సహాయ్లతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2295535)
आगंतुक पटल : 6