రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు... వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
प्रविष्टि तिथि:
28 JUL 2026 10:07PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము బాధ్యతలు స్వీకరించి 2026, జులై 25తో నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు (2026, జులై 28) రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి ఎస్టేట్స్లో చేపట్టిన వివిధ ముఖ్యమైన పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల వివరాలు:
• రాష్ట్రపతి భవన్కు వచ్చే సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఈ–ఆడియో గైడ్ను ప్రారంభించారు. అప్లికేషన్ ఆధారితమైన ఈ ఆడియో గైడ్ హిందీ, ఆంగ్లంతోపాటు 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. సందర్శకుల కోసం సంకేత భాష మాడ్యూల్ను కూడా అందుబాటులో ఉంచారు.
• రాష్ట్రపతికి వచ్చిన బహుమతుల్లో ఎంపిక చేసిన 300 వస్తువులను వేలం వేసే ఈ–ఉపహార్ మూడో సంచికను ప్రారంభించారు. ఈ వేలం 2026 ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతుంది (మరిన్ని వివరాల కోసం upahaar.rashtrapatibhavan.gov.in సందర్శించవచ్చు).
• బాలల కోసం రాష్ట్రపతి భవన్లో ‘బాల పరిసార్’ ప్రారంభించారు. దీనిలో చిన్నారుల కోసం ‘కిల్కారీ’ ఆటస్థలం, వారి ఎదుగుదలకు, సమగ్రాభివృద్ధికి సురక్షితమైన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్నిచ్చే ‘సమర్థ్ అంగన్వాడీ–కమ్–పల్నా’ ఉన్నాయి.
• హరిత, సమ్మిళిత రవాణాను ప్రోత్సహించేలా ఉచిత విద్యుత్ బస్సు ‘రాహి’ (రాష్ట్రపతి భవన్ యాక్సిస్ అండ్ హెరిటేజ్ ఇంటర్కనెక్టర్)ను ప్రారంభించారు. రాష్ట్రపతి ఎస్టేట్స్ సిబ్బందికి, అక్కడ నివసించే వారి కోసం ప్రారంభించిన ఈ బస్సులో మహిళా డ్రైవర్లు, కండక్టర్లు ఉంటారు. తద్వారా రాష్ట్రపతి ఎస్టేట్ నుంచి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వరకు ప్రధానంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు లభిస్తాయి.
• సున్నా ఉద్గారాల ఇంధన వ్యూహంలో భాగంగా సర్వీస్ బ్లాకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
• డెహ్రాడూన్లోని రాష్ట్రపతి నికేతన్లో, సికింద్రాబాదులోని రాష్ట్రపతి నిలయంలో వసతి సౌకర్యాలను ప్రారంభించారు. అలాగే రాష్ట్రపతి ఎస్టేట్లో సిబ్బంది క్వార్టర్స్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. భారతీయ సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ఆదర్శాలకు శక్తిమంతమైన చిహ్నంగా రాష్ట్రపతి భవన్ను నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. గడచిన ఏడాదిలో, భారత నాగరికతా స్ఫూర్తిని పెంపొందించేలా చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరమ వీర దీర్ఘ, గ్రంథ్ కుటీర్ను ప్రారంభించారు. స్టేట్ రూమ్లకు భారతీయతను జోడించారు. అధికారిక విందుల్లో భారతీయ కళలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చారు.
అనంతరం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన మరో ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపదీ ముర్ము పదవీ కాలానికి సంబంధించిన ప్రచురణలను ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. మొదటి ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ఇతర విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
ఈ రోజు విడుదల చేసిన ప్రచురణలు – రాష్ట్రపతి భవన్: రాష్ట్ర కా భవన్ (ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముస్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రెసిడెన్సీ), సేవా ఔర్ సంవేదన (ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముస్ సెకెండ్ ఇయర్ ఆఫ్ ప్రెసిడెన్సీ), సమవేషి సహభాగిత (ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముస్ థర్డ్ ఇయర్ ఆఫ్ ప్రెసిడెన్సీ), భారతీయత కా ఉత్సవ్ (ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ముస్ ఫోర్త్ ఇయర్ ఆఫ్ ప్రెసిడెన్సీ), ప్రముఖ వ్యక్తులు ఒడియాలో రచించిన వ్యాసాల సంకలనం అమా రాష్ట్రపతి – అమా గౌరవ్.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ఈ పుస్తకాల శీర్షికలు సమ్మిళిత ప్రజాస్వామ్యంపై మనకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. చిత్రాలతో కూడిన ఈ సంకలనాలు... రాష్ట్రపతి భవన్ సంప్రదాయాలు, పనితీరు, బహుముఖాలను పాఠకులకు పరిచయం చేస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వారసత్వం పట్ల గర్వపడుతూనే, తోటి పౌరులను ప్రగతి పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తి నింపే సామర్థ్యంలోనే వాటి అసలు గొప్పదనం ఉందని ఆమె చెప్పారు.
2022 జూలై 25న తాను భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, దానిని గౌరవం కన్నా బాధ్యతగా భావించానని రాష్ట్రపతి అన్నారు. గత నాలుగేళ్లుగా ఇదే బాధ్యతాయుతమైన భావంతో విధులను నిర్వర్తించానని ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి భవన్లో లేదా వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ప్రజలతో, ముఖ్యంగా యువతతో సమావేశమైన సందర్భాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉంటూనే దేశ, సమాజ ప్రగతికి కృషి చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు ఆమె చెప్పారు. స్వయం సమృద్ధిని సాధించి ఆత్మ విశ్వాసంతో వృద్ధి మార్గంలో ముందుకు సాగాలని మహిళలను కోరినట్లు చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన వారితో మాట్లాడే సందర్భాల్లో తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధిలో భాగం కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలు చేపట్టినప్పుడు ఆయా దేశాల్లోని ప్రవాసులతో సమావేశమై... భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి సహకరించాలని ప్రోత్సహించారు.
గత నాలుగేళ్లుగా గౌరవం, వినయం, విచక్షణ, రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి దేశ అత్యున్నత పదవికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మరింత శోభ చేకూర్చారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. ఆమె జీవిత ప్రయాణం ఎంతో అసాధారణమైనదనీ, స్ఫూర్తిదాయకమైనదనీ తెలిపారు. ఒడిశాలోని ఒక మారుమూల గిరిజన గ్రామం నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు... భారత ప్రజాస్వామ్య బలానికి, సమ్మిళిత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలియజేశారు. తాను జార్ఖండ్ గవర్నర్గా పనిచేసిన కాలంలో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలతో మమేకమైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రజలు ఆమె గవర్నర్గా పనిచేసిన కాలాన్ని ఆప్యాయతతో, ప్రశంసాపూర్వకంగా జ్ఞప్తికి తెచ్చుకొనేవారని ఆయన చెప్పారు.
రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము చేపట్టిన కీలకమైన కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. అమృత్ ఉద్యాన్, రాష్ట్రపతి నికేతన్, రాష్ట్రపతి తపోవన్లను ప్రజల సందర్శనార్థం ఉంచడం, దివ్యాంగులకు మరింత అనుకూలంగా రాష్ట్రపతి భవన్ను తీర్చిదిద్దడం, రాష్ట్రపతి భవన్లో చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తదితర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాలు వలసవాద మనస్తత్వాన్ని వీడి, రాష్ట్రపతి కార్యాలయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే దార్శనికతను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
ఓల్ చికి లిపిలో సంతాలి భాషలో భారత రాజ్యాంగాన్ని విడుదల చేసిన సందర్భాన్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. దీనిని గిరిజన సమాజాల్లో ఆనందాన్ని నింపి, భారతీయ భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనే దేశ నిబద్ధతను పునరుద్ఘాటించిన చరిత్రాత్మక ఘట్టంగా వర్ణించారు. గత నాలుగేళ్లుగా పాలనను నిర్వచించిన రాజ్యాంగబద్ధమైన విధానం, సేవ, కరుణ, సమ్మిళిత్వం, సాంస్కృతిక విశ్వాసం, జాతీయ ఐక్యత అనే విలులను పరిరక్షించడంలో ఈ రోజు విడుదల చేసిన పుస్తకాలు తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి పూర్తి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(रिलीज़ आईडी: 2290968)
आगंतुक पटल : 4