పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అమృత్సర్ నుంచి హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ వైమానిక కార్యకలాపాలను ప్రారంభించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశ అంతర్జాతీయ విమానయాన కేంద్ర వ్యూహం కింద రెండో స్పోక్ విమానాశ్రయంగా అమృత్సర్
प्रविष्टि तिथि:
28 JUL 2026 11:00AM by PIB Hyderabad
అమృత్సర్ నుంచి హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ వైమానిక కార్యకలాపాలను పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల కోసం భారత్ ప్రవేశపెట్టిన ఈ వినూత్నమైన హబ్ అండ్ స్పోక్ విధానంతో అనుసంధానమైన దేశంలోని రెండో విమానాశ్రయం అమృత్సర్. భారతీయ హబ్ విమానాశ్రయాల ద్వారా దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులకు అవాంతరాల్లేని అంతర్జాతీయ అనుసంధానాన్ని కల్పించి.. ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్ను నిలిపేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహంలో మరో ముందడుగు ఇది.
2026 జూన్ 25న వారణాసి నుంచి భారత మొదటి ‘హబ్ అండ్ స్పోక్’ కార్యకలాపాలు విజయవంతంగా ప్రారంభమైన నేపథ్యంలో.. తాజా ప్రారంభోత్సవం జరిగింది. గత నెల రోజులుగా ఈ వ్యవస్థ సజావుగా పనిచేయడంతో ఈ నమూనా కార్యాచరణ సానుకూలత స్పష్టమైంది. ప్రయాణికుల నుంచి కూడా ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. ఈ సమయంలో వారణాసి నుంచి బయల్దేరిన ప్రయాణికులను.. ఎలాంటి అంతరాయమూ లేకుండా ఢిల్లీ మీదుగా పద్దెనిమిది అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేరవేశారు. అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రభావవంతంగా నిలిచిందనేందుకు ఇది నిదర్శనం.
అమృత్సర్ విమానాశ్రయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన భాగస్వాములందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. ‘‘హబ్ అండ్ స్పోక్ కేవలం ఒక విమానయాన నమూనా మాత్రమే కాదు.. అవకాశాలకు చిహ్నం. హబ్గా సేవల్ని ఢిల్లీ అందిస్తుండగా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్లకు ప్రధాన అంతర్జాతీయ ప్రవేశద్వారంగా అమృత్సర్ నిలుస్తుంది. విదేశాల్లో బలమైన ప్రవాస భారతీయ సంబంధాలు, ప్రాంతీయంగా విస్తృతమైన పరిధి అమృత్సర్కు ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనుసంధానంలో వస్తున్న ఈ మార్పు ద్వారా అత్యధిక ప్రయోజనం పొందే భారతీయ నగరాల్లో అమృత్సర్ ఒకటిగా నిలవబోతోంది’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
పంజాబ్, పరిసర ప్రాంతాల యాత్రికులకూ, ప్రవాస భారతీయులకూ, వ్యాపార రీత్యా ప్రయాణికులకూ, పర్యాటకులకూ సేవలందిస్తూ.. దేశంలోని ప్రధాన అంతర్జాతీయ ప్రవేశద్వారాల్లో ఒకటిగా అమృత్సర్ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. దీనిని హబ్ అండ్ స్పోక్ పరిధిలోకి తేవడం వల్ల.. భారతీయ హబ్ల ద్వారా అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగుపడటంతోపాటు ప్రయాణికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణ అనుభవాన్ని అందించబోతోంది.
విస్తృతమైన జాతీయ లక్ష్యాన్ని వివరిస్తూ... “గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో ప్రపంచ స్థాయిలో పోటీపడేలా సొంత వైమానిక కేంద్రాలను నిర్మించుకునే దిశగా భారత్ కృషి చేస్తోంది. ఇది కేవలం ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం మాత్రమే కాదు.. దేశ విమానయాన సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయడం, భారతీయ హబ్లు దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించడం….’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
ప్రయాణికుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయాభివృద్ధిని బలోపేతం చేయడం ద్వారా విస్తృత ఆర్థిక ప్రయోజనాలు ఈ కార్యక్రమం ద్వారా సమకూరుతాయని భావిస్తున్నారు. విమానయాన కేంద్ర కార్యకలాపాల అభివృద్ధి ద్వారా 2030 నాటికి దాదాపు 4 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 30 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ చేపట్టిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. 2047 నాటికి ఇది మొత్తంగా దాదాపు 16 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలకు తోడ్పడడంతోపాటు.. దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర దోహదపడుతుందని అంచనా.
అమృత్సర్లో కార్యకలాపాలు మొదలవడంతో.. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై బయల్దేరే ముందే అమృత్సర్లోనే చెకిన్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు. వారి సామాన్లను నేరుగా తుది అంతర్జాతీయ గమ్యస్థానానికి చేరుతుంది. దీంతో వారు మళ్ళీ మళ్లీ ఇమ్మిగ్రేషన్ లేదా కస్టమ్స్ ప్రక్రియలను పూర్తిచేయాల్సిన అవసరం లేకుండా.. నిర్దేశిత హబ్ విమానాశ్రయంలో సులభంగా తమ తదుపరి అంతర్జాతీయ విమానానికి మారగలుగుతారు.
అమృత్సర్ నుంచి అంతర్జాతీయ అనుసంధానంలో ఈ హబ్ అండ్ స్పోక్ విధానం విప్లవాత్మక మార్పులను తెస్తుందని చెబుతూ.. మంత్రి ఇలా అన్నారు: “ఇంతవరకు అమృత్సర్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఏడు గమ్యస్థానాలకు మాత్రమే ప్రత్యక్షంగా అంతర్జాతీయ అనుసంధానం ఉండేది. హబ్ అండ్ స్పోక్ నమూనాను ప్రవేశపెట్టడంతో.. ఢిల్లీ విమానాశ్రయానికి ఉండే ప్రపంచ స్థాయి అనుసంధాన సదుపాయం ఇకపై అమృత్సర్ నుంచే ప్రయాణికులకు సమర్థంగా అందుబాటులోకి వస్తుంది. ఒకే చెకిన్, ఒకే లగేజ్ ట్యాగ్తో 20కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులు చేరుకోగలరు. ఇది మొత్తం ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలను ఎక్కడం కోసం ఏటా దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికులు అమృత్సర్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా.. మరో 1.5 లక్షల మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా అమృత్సర్కు చేరుకుంటున్నారు. ఈ సమగ్ర విధానం ద్వారా ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. ప్రయాణికుల రద్దీ వేగంగా పెరుగుతుందని భావిస్తున్నాం.’’
విమానయాన సంస్థల అంచనా ప్రకారం.. ఢిల్లీ మీదుగా ఒక్క అమృత్సర్ నుంచే రోజుకు దాదాపు 250 మంది ప్రయాణికులు హబ్ అండ్ స్పోక్ విధానం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో మరిన్ని స్పోక్ విమానాశ్రయాలను ఈ విధానం కింద చేరుస్తున్నందున.. తదుపరి దశలో రోజూ దాదాపు 1,200 మంది ప్రయాణికులకు, అంటే సంవత్సరానికి దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులకు ఇది సౌకర్యాన్ని కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అంతరాయాలేవీ లేకుండా అంతర్జాతీయ ప్రయాణ సదుపాయం గణనీయంగా విస్తరిస్తుంది.
భద్రత, సౌకర్యం, నియంత్రణ పరంగా నిబంధనల అమలులో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ.. ప్రయాణికుల సౌకర్యాన్ని ఈ కార్యక్రమం గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ప్రభుత్వ అంతర్జాతీయ వైమానిక హబ్ వ్యూహంలో హబ్ అండ్ స్పోక్ విధానం కీలకమైన ప్రాతిపదికగా ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలకు భారతీయ విమానాశ్రయాలను ప్రధానమైన ప్రవేశద్వారాలుగా తీర్చిదిద్దడం, భారతీయ విమానయాన సంస్థల నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విదేశీ ప్రయాణ కేంద్రాలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఈ వ్యూహం ముఖ్యమైన ఉద్దేశం. దేశ వ్యూహాత్మక భౌగోళిక స్థానాన్ని సద్వినియోగం చేసుకోవడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాలను విస్తరించడం ద్వారా.. దేశంలో అంతర్జాతీయ ప్రయాణాల పరంగా అధిక వాటాను నిలబెట్టుకోవాలనీ, దేశ విమానయాన రంగ పోటీతత్వాన్ని పెంపొందించాలనీ ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
అమృత్సర్ నుంచి హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాలను ప్రారంభించడం.. దేశ అంతర్జాతీయ విమానయాన హబ్ వ్యూహపు దశలవారీ అమలులో మరో కీలక మైలురాయి. మరిన్ని స్పోక్ విమానాశ్రయాలు అతి త్వరలో కార్యకలాపాల ప్రారంభం దిశగా సంసిద్ధంగా ఉన్నాయి. వాటిని దశలవారీగా ఈ నెట్వర్క్లో సమీకృతం చేయనున్నారు. దాంతో దేశంలోని హబ్ విమానాశ్రయాల ద్వారా అంతరాయాల్లేని అంతర్జాతీయ ప్రయాణ వ్యవస్థ ఏర్పాటవుతుంది. మరింత అనుసంధానమైన, సమర్థమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల విమానయాన వ్యవస్థను నిర్మించడం ద్వారా.. వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగు.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ కన్సల్, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) చైర్మన్ శ్రీ విపిన్ కుమార్, ఏఏఐ ప్రధాన సలహాదారు శ్రీ శరద్ కుమార్, ఎయిరిండియా గవర్నెన్స్ గ్రూప్ అధిపతి శ్రీ పి. బాలాజీ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో, కస్టమ్స్, సీఐఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల సంఘాలు, హోటళ్లూ ఆతిథ్య రంగ భాగస్వాములు, ప్రయాణ సంస్థలు, పర్యాటక సంస్థల ప్రతినిధులు, ఇతర కీలక విమానయాన, వాణిజ్య రంగ భాగస్వాములు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమృత్సర్ నుంచి అంతర్జాతీయ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి లభిస్తున్న బలమైన సహకారానికి ఇది నిదర్శనం.
***
(रिलीज़ आईडी: 2290455)
आगंतुक पटल : 12