వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, ఎస్టోనియా పర్యటనను విజయవంతంగా పూర్తిచేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఐరోపాతో భారత ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం
దశాబ్ద కాలంలో భారత్ - స్పెయిన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి, పర్యాటక రంగాలను పది రెట్లు విస్తరించడం లక్ష్యంగా ‘10×10×10’ లక్ష్యాన్ని ప్రకటించిన శ్రీ పీయూష్ గోయల్
బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా నైపుణ్యాలు, పారిశ్రామిక సహకారం, రక్షణ రంగ సహకారంపై సరికొత్త కార్యక్రమాలను ప్రతిపాదించిన భారత్
భారత్లో తయారీ, పరిశోధన - అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల విస్తరణకు ఫిన్లాండ్ కంపెనీలను ఆహ్వానించిన శ్రీ పీయూష్ గోయల్
ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎస్టోనియాలో ఉన్నత స్థాయి సమావేశాలు…
ఐరోపా పర్యటనను ముగించిన శ్రీ పీయూష్ గోయల్
శ్రీ పీయూష్ గోయల్ పర్యటనతో.. పెట్టుబడి, మార్కెట్ లభ్యత, నియంత్రణ సహకారాలపై భారత్ - ఈయూ ఎఫ్టీఏ చర్చల్లో పురోగతి
प्रविष्टि तिथि:
19 JUL 2026 7:51PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, ఎస్టోనియాల్లో అయిదు రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. 2026 జూలై 13 నుండి 18 వరకు సాగిన ఈ పర్యటనలో ఒక ఉన్నత స్థాయి భారత వాణిజ్య ప్రతినిధి బృందం కూడా ఆయన వెంట ఉంది. ఈ పర్యటనలో భాగంగా నాలుగు దేశాల మంత్రులు, ప్రభుత్వ సీనియర్ నాయకులు, వ్యాపార ప్రముఖులు, పారిశ్రామిక రంగ భాగస్వాములతో పలు ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ఖరారైన భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల ఉత్సాహాన్ని కొనసాగిస్తూ.. ఐరోపాతో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం, పెట్టుబడి సంబంధాలను విస్తరించడం, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
స్పెయిన్ పర్యటనలో భాగంగా.. గౌరవ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఆ దేశ ఆర్థిక - వాణిజ్య - వ్యాపార శాఖ మంత్రి కార్లోస్ క్యూర్పో కాబల్లెరోతోపాటు గౌరడ పరిశ్రమలు - పర్యాటక శాఖ మంత్రి జోర్డి హెర్యూ బోహెర్తో శ్రీ గోయల్ ఫలప్రదమైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యాపార వర్గాల భాగస్వామ్యంతో ఒక వార్షిక భారత్-స్పెయిన్ సంయుక్త కమిషన్ సమావేశాన్ని నిర్వహించాలని శ్రీ గోయల్ ప్రతిపాదించారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలను మరింత సానుకూలం చేసే దిశగా ‘భారత్ కోసం ప్రత్యేక బృందా’న్ని ఏర్పాటు చేస్తామని స్పెయిన్ ప్రతిపాదించింది.
భారత ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ), స్పెయిన్ బిజుమ్ డిజిటల్ చెల్లింపుల వేదిక మధ్య పరస్పర అనుసంధానతను పెంపొందించేలా సాంకేతిక చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, జౌళి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, మౌలిక సదుపాయాల్లో పరస్పర సహకారానికి గల విస్తృత అవకాశాలను ఇరుదేశాలు గుర్తించాయి. ఐరోపా, లాటిన్ అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించడానికి భారత్కు స్పెయిన్ ఒక వ్యూహాత్మక ప్రవేశ ద్వారంగా ఉన్న నేపథ్యంలో.. పెట్టుబడుల సరళీకరణ, వృత్తినిపుణుల రాకపోకలు, లాటిన్ అమెరికాలో ఉమ్మడి పెట్టుబడుల వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించారు. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ కింద ప్రతిష్ఠాత్మక సి-295 విమానాల తయారీ కార్యక్రమాన్నీ, వలసలు - రాకపోకల్లో భాగస్వామ్యం, సామాజిక భద్రతా ఒప్పందాల్లో పురోగతినీ శ్రీ గోయల్ ఈ సందర్భంగా స్వాగతించారు.
భారత్ - స్పెయిన్ బిజినెస్ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భారత్ - ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవడం కోసం వ్యాపార సంస్థలు త్వరితగతిన ముందస్తు భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మకమైన ‘‘10×10×10’’ దార్శనికతను ఆయన వివరించారు. వచ్చే పదేళ్ల కాలంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాలను పది రెట్లు పెంచడమే ఈ వ్యూహం ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
బ్రస్సెల్స్లో నిర్వహించిన మూడో భారత్ - ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి మంత్రుల స్థాయి సమావేశానికి శ్రీ పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించారు. 2026–27 టీటీసీ కార్యాచరణ ప్రణాళిక ఆమోదం పొందడాన్ని ఆయన ఈ సందర్భంగా స్వాగతించారు. ఐరోపా సమాఖ్య అధికారిక గుర్తింపు జాబితాలో మరో 21 భారతీయ మత్స్య పరిశ్రమ సంస్థలను చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఈయూ ఆమోదం పొందిన మొత్తం భారతీయ సంస్థల సంఖ్య 625కు చేరింది. వీటితోపాటు భారతీయ నౌకా పునరుద్ధరణ యార్డులను కూడా జాబితాలో చేర్చాలన్న అంశాన్ని భారత్ ఈ సమావేశంలో ప్రస్తావించింది. అలాగే ఇరుప్రాంతాల మధ్య నైపుణ్యాలు, విద్య, ప్రతిభావంతుల రాకపోకల అంశాలకు సంబంధించి భారత్ - ఈయూ ప్రత్యేక చర్చలను ప్రారంభించాలని శ్రీ గోయల్ ప్రతిపాదించారు.
గౌరవ ఐరోపా కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, గౌరవ ఐరోపా వాణిజ్య కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్, గౌరవ వాతావరణ - ఉద్గార రహిత - పర్యావరణ హిత వృద్ధి కమిషనర్ వోప్కే హోక్స్ట్రా, గౌరవ వ్యవసాయ-ఆహార కమిషనర్ క్రిస్టోఫ్ హాన్సెన్, గౌరవ ఐరోపా పార్లమెంటు అంతర్జాతీయ వాణిజ్య కమిటీ (ఐఎన్టీఏ) చైర్మన్ బెర్న్డ్ లాంగేలతో జరిగిన సమావేశాల్లో.. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరితగతిన ఖరారు కావడానికి, దానిని వేగంగా అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరుపక్షాలూ పునరుద్ఘాటించాయి.
పెట్టుబడుల రక్షణ ఒప్పందం, భౌగోళిక సూచీల ఒప్పందాలపై చర్చలతోపాటు కర్బన పరిమితి సర్దుబాటు యంత్రాంగం (సీబీఏఎం)పై సహకారం, నియంత్రణల సరళీకరణ, వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ లభ్యత, బాస్మతి బియ్యం, ఉక్కు వ్యర్థాలు మొదలైన వాటిపై సుంకాల సడలింపు వంటి పలు కీలక అంశాలపైనా చర్చలు జరిగాయి. పరిశ్రమలు నేరుగా వచ్చి కార్యకలాపాలను ప్రారంభించుకునేలా.. బెల్జియం కంపెనీల కోసం ప్రత్యేకంగా ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటును శ్రీ గోయల్ ప్రతిపాదించారు. దీనితోపాటు డ్రోన్ నిరోధక సాంకేతికతలు, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాల్లో ప్రముఖ సంస్థ థేల్స్తో వ్యూహాత్మక రక్షణ సహకార అవకాశాలను వారి ముందు ఉంచారు. భారత్ - ఈయూ ఆర్థిక సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేలా.. మరింత సుస్థిర, పారదర్శకమైన, వ్యాపార అనుకూల నియంత్రణ వాతావరణం అవసరమని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి.
ఫిన్లాండులో తాత్కాలిక ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి శ్రీమతి రీక్కా పురా, ఆర్థిక వ్యవహారాల మంత్రి శ్రీ సకారి పుయిస్టోతో శ్రీ గోయల్ సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, 6జీ, క్వాంటం సాంకేతికతలు, పర్యావరణ హిత ఇంధనం, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ, అధునాతన తయారీ, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు.
భారత్కు ఉన్న విస్తృత పరిధీ, ప్రతిభకు ఫిన్లాండ్ సాంకేతిక సామర్థ్యాలు తోడైతే.. ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి తయారీ రంగాల్లో అద్భుత అవకాశాలు లభిస్తాయన్న విషయమై ఇరుపక్షాలూ ఏకాభిప్రాయానికి వచ్చాయి. విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యాలు, అంకుర సంస్థల మధ్య పరస్పర సహకారం, ప్రతిభావంతుల రాకపోకలు, పరిశోధనలో సహకారం వంటి కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
కోన్, నోకియా యాజమాన్యాలతోనూ శ్రీ గోయల్ సమావేశమయ్యారు. దేశంలో తయారీ, పరిశోధన - అభివృద్ధి, ఎగుమతులు - డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను గణనీయంగా విస్తరించాల్సిందిగా ప్రోత్సహించారు. ప్రపంచ మార్కెట్లకు సేవలందించే దిశగా భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, టెలికాం సాంకేతికతలు, డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, శ్రామిక శక్తి అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఫిన్లాండ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు.
2026 జూలై 18న ఎస్టోనియా పర్యటనను కేంద్ర మంత్రి విజయవంతంగా ముగించారు. 2021లో టాలిన్ నగరంలో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత భారత్ నుంచి ఎస్టోనియాలో మొదటి మంత్రిత్వ స్థాయి పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. గౌరవ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సాహ్క్నాతో సమావేశంలో.. డిజిటల్ పరిపాలన, ఫిన్టెక్, యూపీఐ అనుసంధానం, ఇ-రెసిడెన్సీ, సైబర్ భధ్రత, అధునాతన సాంకేతికతల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవకాశాలపై ఇరుపక్షాలూ చర్చించాయి. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరితగతిన అమలు చేయడానికి ఎస్టోనియా బలమైన మద్దతును ప్రకటించింది. అలాగే ఎస్టోనియా డిజిటల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా భారత్ను ఆహ్వానించింది.
భారత్ - ఎస్టోనియా బిజినెస్ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సైబర్ భద్రత, బ్లాక్చైన్, పర్యావరణ హిత ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుదేశాల వ్యాపార సంస్థలకు శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. నార్డిక్, బాల్టిక్ ప్రాంతాలకు ఎస్టోనియా ఒక కీలక ప్రవేశ ద్వారం లాంటిదని ఆ దేశ ప్రతినిధులు వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో భాగస్వామ్యానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ పర్యటనలో భాగంగా.. భారతీయ ప్రవాసులతో మంత్రి సంభాషించారు. అలాగే టాలిన్ నగరంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించారు.
పర్యటన ఆద్యంతమూ నాలుగు దేశాల వ్యాపార ప్రముఖులు, పారిశ్రామిక సంఘాలు, పెట్టుబడిదారులతో శ్రీ గోయల్ విస్తృతంగా చర్చించారు. పటిష్టమైన సరఫరా వ్యవస్థల నిర్మాణం, పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, తయారీ సహకారాన్ని ప్రోత్సహించడం, భారతీయ ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, విస్తృతమైన దేశీయ మార్కెట్, ప్రపంచ స్థాయి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, స్థిరమైన విధాన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని.. భారత్ను తమ ప్రాధాన్య తయారీ, ఆవిష్కరణ, ఎగుమతి కేంద్రంగా చేసుకోవాలని ఐరోపా వ్యాపార సంస్థలకు శ్రీ గోయల్ పిలుపునిచ్చారు.
ఐరోపాతో విస్తరిస్తున్న భారత ఆర్థిక సంబంధాలకు కొత్త ఈ పర్యటన ఉత్తేజాన్నిచ్చింది. సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడం, పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించడం, భారతీయ ఎగుమతిదారులకు మార్కెట్ లభ్యతను మెరుగుపరచడం, భవిష్యత్తులో ఎదిగే సామర్థ్యమున్న రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడం వంటి అంశాల్లో.. ఈ పర్యటన సందర్భంగా ఓ కొలిక్కి వచ్చిన ఒప్పందాలు దోహదపడతాయని భావిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2286716)
आगंतुक पटल : 11