ప్రధాన మంత్రి కార్యాలయం
వర్షాకాల సమావేశాలు- 2026 ప్రారంభం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన
దేశ అభివృద్ధి ప్రస్థానాన్ని బలోపేతం చేసేలా ఫలప్రదమైన చర్చలకు వేదికగా సమావేశం
రుతుపవనాలైనా, వర్షాకాల సమావేశాలైనా.. క్రియాశీలంగా ఉంటేనే ఉపయోగకరం, దేశ క్షేమం
అందుకే రుతుపవనాలు సానుకూలంగా ఉండాలని, వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రార్థిద్దాం
ప్రతి భారతీయుడూ గర్వంతో ఉప్పొంగేలా గత నెల రోజుల్లో అద్భుత విజయాలను సాధించిన భారత్ - జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లోనే కాదు.. అంతరిక్ష రంగంలోనూ ఖ్యాతి గడించిన దేశం
ఇంధనం కోసం దిగుమతిపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు పశ్చిమాసియాలో యుద్ధంతో పెద్ద సవాలు... సవాళ్లను అధిగమించి వృద్ధిలో దూసుకుపోతున్న భారత్
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్.. భారత్ బలానికి, అంకితభావానికి ఇది నిదర్శనం
పార్లమెంటు సజావుగా సాగాలి, అర్థవంతమైన చర్చలు జరగాలి, దేశం పురోగమనం దిశగా సమష్టి తీర్మానాలు చేయాలి... ఇది నేడు అత్యావశ్యకం
ఆశయాలతో ఉరకలేస్తూ, దేశ నిరంతర పురోగమనాన్ని కాంక్షించే భారత యువత ఆశయమూ ఇదే
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
प्रविष्टि तिथि:
20 JUL 2026 12:25PM by PIB Hyderabad
వర్షాకాల సమావేశాలు - 2026 ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు ప్రాంగణంలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి విచ్చేసిన పాత్రికేయులకు స్వాగతం పలికారు. ప్రకృతి వాతావరణ సరళికి, శాసనపరమైన సత్ఫలితాలకూ మధ్య ఒక ఆలోచనాత్మకమైన పోలికను చెప్పారు. క్రియాశీలక, ముందుచూపుతో కూడిన చర్యలు దేశ సమగ్ర శ్రేయస్సుపై ఎంతగానో ప్రభావం చూపుతాయన్నారు. అంతిమంగా ప్రతి జీవరాశికి ప్రయోజనం చేకూర్చే అత్యంత నిర్మాణాత్మక ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రుతుపవనాలు క్రియాశీలంగా కొనసాగాలని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా ఫలప్రదంగా సాగాలని మేం ప్రార్థిస్తున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
గత నెల రోజులుగా దేశం సాధించిన వరుస అసాధారణ జాతీయ, అంతర్జాతీయ విజయాలను ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ అమితంగా పెరుగుతుండడం మనకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. సరిగ్గా గతేడాది సమావేశాలకు ముందే ఒక భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్ ఇటీవలి చరిత్రాత్మక విజయాన్ని కొనియాడారు. కేవలం 28 ఏళ్ల సగటు వయస్సున్న బృందం ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల్లో దేశాన్ని ఒక సరికొత్త యుగంలోకి విజయవంతంగా నడిపించిన తీరు అద్భుతమంటూ ప్రశంసించారు. ఈ విజయాలు దేశ ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతాయన్నారు. ‘‘మన యువత నడుపుతున్న ఈ అంకుర సంస్థలు అంతరిక్షంలో భారత పతాక రెపరెపలాడేలా చేశాయి. ఇది మన దేశ ముఖచిత్రాన్ని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందేలా చేసింది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఇటీవలి ఈ సాంకేతిక విజయాలను దేశ అపరిమిత సామర్థ్యానికి స్పష్టమైన నిదర్శనాలుగా అభివర్ణిస్తూ.. నేటి తరం శక్తిసామర్థ్యాలకు ఎలాంటి హద్దులూ లేవని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ చరిత్రాత్మక విజయాలు భవిష్యత్తులో దేశం మరింత వేగంగా ముందుకు సాగడానికి ఒక అత్యున్నత ప్రేరణాత్మక శక్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ‘‘మన యువత సామర్థ్యం, వారి ఆకాంక్షలు అంతరిక్షమంత అపరిమితమైనవన్న బలమైన సందేశాన్ని ఇది అందిస్తోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ అపూర్వ పారిశ్రామిక విజయాల మూల కారణాలను ప్రస్తావిస్తూ... ప్రభుత్వం తీసుకువచ్చిన వేగవంతమైన, పరివర్తనాత్మక విధాన మార్పులదే ఈ ఘనత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ఈ ప్రగతిశీల వాతావరణం యువ ఆవిష్కర్తలు సాహసాలు చేయడానికి, సరికొత్త విజయాలను అందుకోవడానికి ప్రత్యక్షంగా దోహదపడుతోందన్నారు. ‘‘దేశం నేడు ప్రయాణిస్తున్న సంస్కరణల ఎక్స్ప్రెస్ ఫలితంగానే మన యువత ఇంతటి ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ విజయం సాధించగలుగుతోంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఇటీవల దేశంలో వరుసగా జరిగిన భారీ మౌలిక వసతులు, సాంకేతిక రంగాల ప్రారంభోత్సవాలను ప్రధానమంత్రి సుదీర్ఘంగా ప్రస్తావించారు. రాజస్థాన్లో భారీ చమురు శుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం, దేశంలో మూడో సెమీకండక్టర్ ప్లాంటు ప్రారంభోత్సవం, ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత శక్తిమంతమైన గ్రీన్ హైడ్రోజన్ రైలు ప్రారంభాన్ని ఆయన ఉదాహరించారు. దేశంలోని ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కార్మికుల సమష్టి అంకితభావం, నిరంతర శ్రమ వల్లే అత్యంత అధునాతనమైన ఈ జాతీయ సంపద సృజన సాధ్యపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఒకే ఒక్క ఉమ్మడి లక్ష్యంతో దేశం కోసం జీవిస్తూ, శ్రమిస్తున్న మన ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, కార్మికుల సమష్టి కృషికి ప్రత్యక్ష ఫలితమిది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల తీవ్రమైన అంతర్జాతీయ ఆందోళనలు తలెత్తుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాల సరఫరా వ్యవస్థల్లో ఏర్పడిన భారీ అంతరాయాలు.. ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఎంతటి తీవ్రమైన ముప్పుగా పరిణమించాయో వివరించారు. ఎన్నో తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ.. మన దేశం అసాధారణమైన 7.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం దేశ అద్భుతమైన నిలకడకు, సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్లమెంటరీ ఎజెండాను వివరిస్తూ... దేశం అందుకున్న ఈ వేగవంతమైన ప్రగతి గమనాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులందరినీ ఆయన కోరారు. దేశభక్తికి అత్యంత ప్రాధాన్యాన్నిస్తూ.. సభలో ప్రతి ఒక్కరి గొంతూ వినిపించేలా, ప్రతి ఆలోచనకూ తగిన గౌరవం దక్కేలా అత్యంత నిర్మాణాత్మకమైన, వాస్తవాలే ప్రాతిపదికగా చర్చలు జరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉదయం సోషల్ మీడియా ద్వారా ఎంపీలకు స్పీకర్ స్వాగతం పలికిన విషయాన్ని ప్రస్తావించారు. సభకు అంతరాయం కలిగించే గందరగోళం లేకుండా అర్థవంతమైన చర్చలు జరగాలని పిలుపునిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘వాస్తవాలూ, తర్కమూ బలంగా ఉన్న చోట అంతరాయాలకు ఏమాత్రమూ తావుండదు. ప్రశాంతమైన మనస్సుతో కూడా, దేశాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపేలా శక్తిమంతంగా గళాన్ని వినిపించవచ్చు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2286643)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Odia