అణుశక్తి విభాగం
లిథువేనియాలోని విల్నియస్లో జరిగిన 37వ అంతర్జాతీయ
బయాలజీ ఒలింపియాడ్- 2026లో 1 స్వర్ణం, 3 రజత పతకాలను కైవసం చేసుకున్న భారత జట్టు
प्रविष्टि तिथि:
19 JUL 2026 1:42PM by PIB Hyderabad
2026 జూలై 12 నుంచి జూలై 19 వరకు లిథువేనియాలోని విల్నియస్లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో (ఐబీఓ) భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇందులో దేశం తరఫున పాల్గొన్న నలుగురు విద్యార్థులూ పతకాలు సాధించారు. మొత్తం 1 స్వర్ణ, 3 రజత పతకాలను దేశం గెలుచుకుంది.
పతకాలు సాధించిన విజేతల వివరాలు:
-
భవ్య గున్వాల్ (స్వర్ణ పతకం) – మహేంద్రగఢ్, హర్యానా
-
సౌమిల్ మైతీ (రజత పతకం) – హౌరా, పశ్చిమ బెంగాల్
-
నిశిత్ కలానీ (రజత పతకం) – పాలి, రాజస్థాన్
-
అన్మోల్ కుమార్ (రజత పతకం) – మాన్సా, పంజాబ్
భారత జట్టుకు ప్రొఫెసర్ రేఖ వర్తక్ (రిటైర్డ్, హెచ్బీసీఎస్ఈ-టీఐఎఫ్ఆర్, ముంబయి), డాక్టర్ అనుపమ రోనాడ్లు (హెచ్బీసీఎస్ఈ-టీఐఎఫ్ఆర్) నాయకత్వం వహించగా.. డాక్టర్ రంజిత్సిన్హ్ దేవ్కర్ (ఎమ్. ఎస్. యూనివర్సిటీ, బరోడా), డాక్టర్ సిద్దేష్ ఘాగ్లు (యూఎమ్-డీఏఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్, ముంబయి) శాస్త్రీయ పరిశీలకులుగా వ్యవహరించారు.
ఈ సంవత్సరం జరిగిన ఐబీఓలో 78 దేశాల నుంచి మొత్తం 307 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొత్తంగా 31 స్వర్ణ, 61 రజత, 91 కాంస్య పతకాలను విజేతలకు బహుకరించారు.
విల్నియస్ యూనివర్సిటీ లైఫ్ సైన్సెస్ సెంటర్ ఎంతో నిపుణతతో రూపొందించిన ఈ ఐబీఓ 2026 పరీక్షలు.. మాధ్యమిక పాఠశాల స్థాయి జీవశాస్త్ర పరిమితులను దాటి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించాయి. మొత్తం ఆరు గంటల పాటు సాగిన ఈ ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులు నాలుగు అత్యంత ప్రత్యేకమైన రంగాల్లో క్లిష్టమైన, ప్రయోగపూర్వక పనులను చేయాల్సి వచ్చింది. 'మాలిక్యులర్ బయోలజీ, బయోకెమిస్ట్రీ' ల్యాబ్లో విద్యార్థులు ప్లాస్మిడ్ల రెస్ట్రిక్షన్ డైజెషన్, అగారోస్ జెల్ అనాలిసిస్తో పాటు బయోకెమికల్ ఎంజైమ్ పరీక్షను నిర్వహించారు. 'యానిమల్ ఫిజియాలజీ' ల్యాబ్లో వారు ఆస్పిరిన్ ఫార్మకోకైనెటిక్స్ను (శరీరంలో మందుల ప్రభావం) అంచనా వేశారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక యాప్, లైట్ బాక్స్ కలరీమీటర్ సహాయంతో కృత్రిమ రక్త నమూనాలలో ఆస్పిరిన్ విచ్ఛిన్నత రేటును గణించారు. 'యానిమల్ మార్ఫాలజీ, సిస్టమాటిక్స్' ల్యాబ్లో వర్గీకరణ కోసం కీటకాల నమూనాల వర్గీకరణను విశ్లేషించారు. ఇందులో వాటి నోటి భాగాలను చాలా కచ్చితత్వంతో ఛేదించటం కూడా ఒక భాగం. చివరగా 'ప్లాంట్ కంప్యూటేషనల్ బయోలజీ' ల్యాబ్ విద్యార్థులకు సరికొత్త డిజిటల్ విశ్లేషణను పరిచయం చేసింది. ఇందులో వారు 'ఇమేజ్జే' సాఫ్ట్వేర్ను ఉపయోగించి మొక్కల వేర్ల పొడవును అంచనా వేయడం, విభిన్న ప్లాంట్ ఎకోటైప్ల హై-డైమెన్షనాలిటీ మాక్రోఫెనోటైప్ విశ్లేషణను నిర్వహించడంతో పాటు సంక్లిష్టమైన ట్రాన్స్క్రిప్టోమ్ విశ్లేషణను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రాక్టికల్ పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా కఠినంగా సాగిన ఆరు గంటల సైద్ధాంతిక పరీక్షను రెండు ప్రత్యేకమైన మూడేసి గంటల సెషన్లుగా విభజించారు. ఈ సైద్ధాంతిక విభాగంలో నిజ జీవిత పరిశోధనా దత్తాంశాలు, క్షేత్రస్థాయి అధ్యయన విశ్లేషణలపై ఆధారపడిన 100 అత్యంత సవాలుతో కూడిన ప్రశ్నలను ఇచ్చారు. ఇవి కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే సాధారణ ప్రశ్నలు కావు. సెల్- మాలిక్యులర్ బయోలజీ, ప్లాంట్- యానిమల్ సైన్సెస్, జెనెటిక్స్- ఎవల్యూషన్, పర్యావరణ శాస్త్రం, జంతు ప్రవర్తనా శాస్త్రం, బయోసిస్టమాటిక్స్ వంటి కోర్ జీవశాస్త్ర రంగాల్లో విద్యార్థులకు ఉన్న ఉన్నత స్థాయి సమస్యల పరిష్కార నైపుణ్యాలను ఇవి అంచనా వేశాయి.
ఈ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారతీయ విద్యార్థులందరికీ, భారత ప్రతినిధి బృందానికి మేం మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ‘హెచ్బీసీఎస్ఈ’లో నిర్వహించిన ఓరియంటేషన్, ప్రీ-డిపార్చర్ శిక్షణా శిబిరాలలో విద్యార్థులను ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దినందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, హెచ్బీసీఎస్ఈ బయాలజీ ఒలింపియాడ్ సెల్కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఒలింపియాడ్ కార్యక్రమానికి నిరంతరం బలమైన మద్దతును అందిస్తున్నందుకు నేషనల్ స్టీరింగ్ కమిటీకి, అన్ని ఉపాధ్యాయ సంఘాలకు, నిధుల సహాయం చేసిన భారత ప్రభుత్వ సంస్థలకు మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో భారత్ పాల్గొనటం ఇది 26వ సారి. ఇప్పటివరకు ఈ పోటీలలో పాల్గొన్న 104 మంది భారతీయ విద్యార్థుల్లో 17 మంది స్వర్ణ పతకాలు, 69 మంది రజత పతకాలు, 17 మంది కాంస్య పతకాలు, ఒకరు ప్రశంస అందుకున్నారు. గత పదేళ్ల కాలంలో భారత్ సాధించిన స్వర్ణ, రజత పతకాల సక్సెస్ రేటు వరుసగా 25 శాతం, 68 శాతంగా ఉంది.
***
(रिलीज़ आईडी: 2286430)
आगंतुक पटल : 15