జౌళి మంత్రిత్వ శాఖ
ఇండియన్ బ్రాండ్లు, డిజైనర్లు, నేత కళాకారులు ఇక అంతర్జాతీయం ఇదే మంచి తరుణమన్న మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
प्रविष्टि तिथि:
16 JUL 2026 8:08PM by PIB Hyderabad
భారతదేశంలో నేడు ఫ్యాషన్, దుస్తుల పరిశ్రమ ముఖచిత్రం పూర్తిగా మారిపోతున్నది. సంప్రదాయ తయారీ సామర్థ్యానికి మించి ముందుకు వెళ్తూ, కొత్త డిజైన్ల ఆవిష్కరలూ, నాణ్యత, సాంస్కృతిక విశిష్టత పరంగా అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తోంది.
2025-26లో భారత జౌళి, దుస్తుల ఎగుమతులు సుమారు రూ.3.16 లక్షల కోట్లకు చేరుకోగా, ఈ ఎగుమతుల్ని 2030 కల్లా రూ.9 లక్షల కోట్ల స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏల) పరిధిని విస్తరిస్తూ ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లాలనీ, భారతీయ వాణిజ్య సంస్థలు పటిష్ఠ ఉత్పత్తుల్ని బ్రాండు రూపంలో ఆవిష్కరిస్తూ ఎప్పటికప్పుడు మారే వినియోగదారుల అభిరుచులకూ, నియంత్రణలకు అనుగుణంగా పోటీ పడే స్వభావాన్ని పెంచుకోవాలనీ, నాణ్యతను అందించడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలన్న అంశాల్ని ఈ కార్యక్రమంలో చర్చించారు.
ఈ నేపథ్యంలో, ‘‘భారతీయ బ్రాండ్లు, అంతర్జాతీయ ఆకాంక్షలు: సరిహద్దులకు ఆవల రిటైల్ అభివృద్ధికి సరికొత్త రూపును ఇవ్వడం’’ అన్న అంశంపై ఒక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026, జూలై16న నిర్వహించారు. డిజైనర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు ఎలక్ట్రానిక్ వాణిజ్య సంస్థలు, తయారీదారు సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతీయ జౌళి, లైఫ్స్టైల్ బ్రాండ్లు, సాంప్రదాయిక కళల్నీ, వారసత్వాన్నీ నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్లలో ఏ విధంగా విస్తరించవచ్చో చర్చించారు. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రముఖ ప్యానలిస్టులు పాలుపంచుకున్నారు. భారతీయ బ్రాండ్లకు చెందిన వారు, లగ్జరీ డిజైనర్లు, ఈ-కామర్స్ సంస్థలు, పీడీఎస్, వెల్స్పన్ వరల్డ్, నెయట్ హోమ్స్, పశ్మీనాడాట్కామ్, ఎక్స్పోబజార్, ట్రైడెంట్ లకు చెందిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. భారతీయ బ్రాండ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయేందుకూ, రిటైల్ రంగంలో పోటీపడే తత్వాన్ని అలవరచుకునేందుకూ, నూతన ఆవిష్కరణల సాయంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు... ప్యానలిస్టులు అనేక సూచనలు చేశారు.
భారతీయ జౌళి, దుస్తుల బ్రాండ్ల ప్రతినిధులు, డిజైనర్లు, ఈ-కామర్స్ సంస్థలు, రిటైల్ వ్యాపారులు, ఎగుమతిదారులు, నూతన ఆవిష్కరణల రంగ నిపుణుల్ని ఉద్దేశించి కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ప్రసంగించారు. భారత జౌళి రంగ భవిష్యత్తుతో ముడిపడిన స్ఫూర్తిదాయక అభిప్రాయాలను ఈ సందర్భంగా మంత్రి వ్యక్తం చేశారు. దేశ విశిష్ట వస్త్ర సంప్రదాయాల్నీ, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ బ్రాండ్లను ఆవిష్కరించడానికి భారతీయ చేతివృత్తి కళాకారులకీ, డిజైనర్లకీ, సూక్ష్మ చిన్న మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఈ)కీ అపార అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లలో విజయాన్ని చేజిక్కించుకోవడానికి భారతీయ బ్రాండ్లు రాశితో పాటు వాసి, స్థిరత్వం, విస్తరణపై దృష్టిని కేంద్రీకరించాలని మంత్రి సూచించారు. ‘‘చేతివృత్తి కళాకారులు భారత్కు పెన్నిధి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ జౌళి రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థకు కీలకం చేతివృత్తి కళాకారులూ, చేనేత కార్మికులేనని ఆయన పునరుద్ఘాటించారు. చేతివృత్తి కళాకారుల పనితనాన్ని లోకానికి చాటడం, వారిని అంతర్జాతీయ కొనుగోలు సంస్థలతో అనుసంధానించడం, భారత ఘన జౌళి వారసత్వాన్ని పరిరక్షించడంలో ‘భారత్ టెక్స్ 2026’ వంటి కార్యక్రమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.
నాణ్యత, స్థిరత్వం, ఘన వారసత్వాలు, కళాకౌశలం సాయంతో భారతీయ బ్రాండ్లు తమ అంతర్జాతీయ ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటూ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని జోడించడానికి ఇది అనువైన తరుణమని మంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణకు నోచుకొనేట్టు భారత విశిష్ట హస్తకళల వారసత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. తయారీ సంస్థలు, చేతివృత్తి కళాకారులు, చేనేతదారులు భారత్కున్న అత్యంత గొప్ప బలమని ఆయన చెబుతూ, జౌళి రంగంలో సమ్మిళిత అభివృద్ధితో పాటు ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగిన అభివృద్ధిని సాధించాలంటే అందుకు చేతివృత్తి కళాకారులకీ, చేనేతదారులకీ సాధికారతను కల్పించడం ఎంతో అవసరమని శ్రీ గిరిరాజ్ సింగ్ అన్నారు.

భారతీయ బ్రాండ్లకు, హస్తకళలకూ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతోందని ప్రసిద్ధ భారతీయ డిజైనర్లు వైశాలీ షడంగులే, శ్రీ రాహుల్ మిశ్రా అన్నారు. కేవలం నాలుగు చేనేత కుటుంబాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు, ఈ ప్రస్థానం ప్రస్తుతం ఒక పెద్ద సమాజంగా మారినట్లు, చేనేత సిబ్బందిలో 90 శాతానికి పైగా యువతులే ఉన్నట్లు వైశాలీ షడంగులే చెప్పారు. తాము సాంప్రదాయిక కళలను సంరక్షిస్తూనే సుస్థిర జీవనోపాధిని పొందుతున్నట్లు ఆమె తెలిపారు. భారత్కు చెందిన, అంతరించిపోయిన 100 నేత సంప్రదాయాల్ని పునరుద్ధరించాలన్నదే తన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘మీరు అంతర్జాతీయ మార్కెట్టులో మీదైన గుర్తింపును పొందాలనుకుంటుంటే, భారతీయ చేనేతల విశిష్టతలతో పాటు వాటికి ఉన్న శక్తిని ప్రపంచం ఎదుట ఆవిష్కరించాలి’’ అని వైశాలీ షడంగులే అన్నారు. ఏదైనా ఒక బ్రాండుకు ఉండే అతి పెద్ద బలం ఆ బ్రాండుకు ఉన్న ప్రామాణిక సమాచారాన్ని తెలియజేయడమేనని జైపూర్ రగ్స్ వ్యవస్థాపకుడు శ్రీ నంద్ కిశోర్ చౌదరీ అన్నారు. ఒక బ్రాండు తన మూలాలూ, సంప్రదాయాలూ, వారసత్వంతో బలంగా పెనవేసుకొన్నప్పుడు దానిని అనుకరించడం పోటీ సంస్థలకు కష్టం అవుతుందని ఆయన వివరించారు.
స్వదేశీ హస్తకళలను పెంచి పోషించుకోవాలని శ్రీ రాహుల్ మిశ్రా అన్నారు. ‘‘ప్రతి దేశానికీ సరిపడేట్టు డిజైన్లలో మార్పుచేర్పులు చేసే బదులు, భారతీయత ఉట్టిపడే కళాత్మకతకే కట్టుబడి ఉండటంపై దృష్టి పెట్టాలి. మౌలికత్వాన్నీ, ప్రామాణికతనీ కాపాడుకోవడానికి శ్రద్ధ తీసుకోవాలి.. ఈ ప్రామాణికత్వమే భారతీయ బ్రాండుల గొప్పతనం’’ అని ఆయన అన్నారు. ‘‘చేతులతో తయారు చేసిన వస్తువులూ, చేనేతలే భారత్ ఆత్మకు ప్రతీక. ప్రత్యేకించి ఈ కృత్రిమ మేధ కాలంలో వీటి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోతుంది’’ అని కూడా ఆయన వివరించారు.
అంతర్జాతీయ స్థాయి వాణిజ్య కార్యకలాపాలకు మార్కెట్లూ, బహుళ విధ అమ్మకాలకు తోడ్పడే వ్యూహాలూ కీలకంగా మారాయని ఈ-కామర్స్ రంగ ప్రముఖులు అన్నారు. వాణిజ్య కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడానికి చాలా కాలం పడుతుందనీ, కానీ ఒక సారి ఈ లక్ష్యాన్ని చేరుకొంటే దీనికి దీర్ఘకాలిక స్థిరత్వంతో పాటు నిరంతర అభివృద్ధి కూడా నిర్ధారితం అవుతుందనీ వారు చెప్పారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కంట్రీ హెడ్ శ్రీనిధి కల్వపూడి మాట్లాడుతూ తమ సంస్థ 2 లక్షల కన్నా ఎక్కువ మంది అమ్మకందారులకు తోడ్పాటును అందిస్తోందన్నారు. వారిలో రెండో అంచె, మూడో అంచె నగరాలకు చెందిన చేతివృత్తుల వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. బ్రాండును తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆమె చెబుతూ, ‘‘భారత్ మరిన్ని ఎగుమతులు చేయడానికి తోడు, అంతర్జాతీయ స్థాయిలో దీర్ఘకాలం పాటు గుర్తుపెట్టుకొనే విధంగా ఖ్యాతిని కూడా సంపాదించుకోవాలి’’ అని అన్నారు. ‘‘బ్రాండ్లను రూపొందించడం ఇప్పుడు కేవలం ఒక ఐచ్ఛికం కాదు.. మనుగడలో ఉండాలంటే తప్పక చేయవలసిన పనిగా మారిపోయింది’’ అని శ్రీనిధి కల్వపూడి స్పష్టం చేశారు. సాంకేతికత పోషించే పాత్ర, డేటా, ఏఐ, ప్రాంతీయ భాషల్లోనూ ఏఐ ఆధారిత సేవల్ని వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాల్ని గురించి వక్తలు ప్రస్తావించారు. విశ్వసనీయతా ప్రమాణచిహ్నం, నమూనా లాజిస్టిక్స్ సహకారం, బిజినెస్-టు-కన్స్యూమర్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలతో భారతీయ బ్రాండులను అంతర్జాతీయ స్థాయికి విస్తరించవచ్చని వారు అన్నారు.
భారత ఉత్పాదన రంగ విస్తారిత అనుబంధ వ్యవస్థనీ, సరఫరా వ్యవస్థల్నీ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే తత్వాన్నీ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని భారీ స్థాయి తయారీదారు సంస్థల ప్రతినిధులు ప్రస్తావించారు. క్లస్టర్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటు, కార్పొరేట్, పరిశ్రమ వ్యవహారాల అధిపతి డాక్టర్ అనిల్ రాజ్వంశీ ప్రశంసించారు. ఏకీకృత తయారీ విస్తారిత అనుబంధ వ్యవస్థ భారతీయ బ్రాండ్లకు ఎక్కువగా ఉత్పత్తి చేయగల స్తోమతనీ, దక్షతనీ అందించగలదని ఆయన అన్నారు. ట్రెంట్ మేనేజింగ్ డైరెక్టరు శ్రీ వెంకటేశాలు పళనిస్వామి మాట్లాడుతూ, భారత్ తన విలువని సృష్టించే మార్గంలో ప్రతి ఒక్క అంచెలో అధిక పారదర్శకత్వాన్నీ, వేగాన్నీ నిర్ధారించుకుంటూ జౌళి రంగానికి బలమైన అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకోవాల్సి ఉందన్నారు. అలాంటి గుర్తింపునకు మంచి నాణ్యత, చెప్పిన సమయానికి సరకును అందించేటట్లు చూడడంతో పాటు నిరంతరాయ ప్రాతిపదికన సేవల లభ్యత.. ఇవి పునాదిగా నిలవాలన్నారు. భారత్ కీలక బలాల్లో ఒకటైన పత్తిని శుద్ధిపరిచి, బ్రాండుగా తీర్చిదిద్దే పనులు విదేశాల్లో ఎందుకు జరగాలని కూడా వక్తలు ప్రశ్నించారు. నాస్కామ్లాంటి ఒక కేంద్రీయ సంస్థను ఏర్పాటు చేయాలనీ, అది అంతర్జాతీయ బ్రాండును రూపొందించడానికి పరిశ్రమకు మొదటి దశ నుంచి చివరి దశ వరకూ సంపూర్ణ సహకారాన్ని అందించే స్థితిలో ఉండాలనీ వారు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల వరకూ చేరుకోవాలంటే దీర్ఘకాలిక అభివృద్ధి ఒక ముఖ్య ఆధారంగా మారిందనీ, పెద్ద ఎగుమతిదారు సంస్థలకూ, డిజైనర్లకూ మధ్య సహకారం పుంజుకొనేట్టు చేస్తే ఉత్పాదన స్తోమతకీ, సృజనశీలత్వానికీ మధ్య ప్రభావపూర్వక సమన్వయాన్ని ఏర్పరచవచ్చనీ సూచించారు.
ఈ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారులు సమర్ధించారు. భారత్ ఎక్కువ పరిమాణంలో ఉత్పాదనలను విక్రయించడం ఒక్కటే కాకుండా, శ్రేష్ఠమైన నాణ్యతను కూడా అందిస్తోందని ఐటీపీఓ చైర్మన్ శ్రీ జావేద్ అశ్రఫ్ అన్నారు. ‘భారత్లో తయారీ’ అనే గుర్తింపు.. ఉన్నత ప్రమాణాలు కలిగిన నాణ్యతకు మారుపేరుగా నిలవాలనీ, ప్రదర్శనలు ఎమ్ఎస్ఎమ్ఈలకు నేటికీ కీలక అవకాశాలుగా కొనసాగుతున్నాయనీ ఆయన అన్నారు. జౌళి శాఖ కార్యదర్శి శ్రీమతి నీలమ్ శమీ రావు మాట్లాడుతూ శక్తిమంతమైన డిజైనర్ హౌసులూ, ఉమ్మడి ప్రాతిపదికన వినియోగించుకోదగ్గ మౌలిక సదుపాయాలు, ఈ-కామర్స్ సంస్థల సేవలను వినియోగించుకొనే పరిస్థితీ చాలా ముఖ్యమని సూచించారు. బ్రాండును రూపొందించడం ఒక దీర్ఘకాలిక ప్రక్రియ అని ఆమె అన్నారు.
భారతీయ బ్రాండ్లను విశ్వసనీయమైనవిగానూ, అధిక నాణ్యత కలిగినవిగానూ, అంతర్జాతీయంగా గుర్తించదగిన బ్రాండ్లుగానూ నిలపాలంటే ప్రభుత్వానికీ, పరిశ్రమకీ మధ్య ఇప్పటితో పోలిస్తే మరింత ఎక్కువ సహకారం అవసరమని కార్యక్రమం చివర్లో పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో భారతీయ హస్తకళలకు మరింత వ్యాప్తిని సమకూర్చడానికీ, క్లస్టర్ అభివృద్ధిని బలోపేతం చేయడానికీ, ప్రామాణిక సమాచారాన్ని అందించడానికీ, నాణ్యమైన కంటెంటును రూపొందించడానికీ కృషి చేయాలని సూచించారు.
***
(रिलीज़ आईडी: 2285754)
आगंतुक पटल : 6