సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ కోసం భవిష్యత్తుకు సిద్ధమైన శ్రామిక శక్తి అభివృద్ధి’ అంశంపై ప్రసార మాధ్యమాల ఒక రోజు సదస్సు 'వార్త'ను నిర్వహించిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ)
సుసంపన్నమైన కథా సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం భారత్ లక్ష్యం : డాక్టర్ ఆశిష్ కులకర్ణి, ఐఐసీటీ బోర్డు డైరెక్టర్, ముంబై
प्रविष्टि तिथि:
14 JUL 2026 5:44PM by PIB Hyderabad
“చలనచిత్ర నిర్మాతలు, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు, ఇతర సృజనాత్మక రంగాల నిపుణులు అత్యాధునిక కంటెంట్ను రూపొందిస్తూ, ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ (ఆరెంజ్ ఎకానమీ) లో భారత్కు ప్రత్యేక స్థానం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరెంజ్ ఎకానమీలో భారత్ సుమారు మూడు శాతం వాటాను కలిగి ఉండగా, రాబోయే దశాబ్దంలో దీనిని 12-15 శాతానికి పెంచాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ) కృషి చేస్తోంది" అని ఐఐసీటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ కుల్కర్ణి ఈరోజు నాగ్పూర్లో తెలిపారు.
(రైటప్) సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తున్న శ్రీమతి స్మితా వత్స్ శర్మ
భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ కోసం భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శ్రామికశక్తి అభివృద్ధి అంశంపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పత్రికా సమాచార కార్యాలయం (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబి) నాగ్పూర్లోని చిట్నావిస్ సెంటర్లో నిర్వహించిన ఒకరోజు మీడియా వర్క్షాప్ ‘ వార్త‘ లో డాక్టర్ ఆశిష్ కులకర్ణి ప్రసంగించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పశ్చిమ ప్రాంత డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వివిధ ప్రసార మాధ్యమ సంస్థల సీనియర్ ఎడిటర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్సీఈఆర్టీ సహకారంతో విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే సృజనాత్మకతను పెంపొందించి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ‘కౌశల్ బోధ్’ పాఠ్య ప్రణాళికను ప్రవేశపెట్టనున్నట్లు డాక్టర్ కులకర్ణి తెలిపారు. దేశవ్యాప్తంగా 500 కళాశాలలు, 15 వేల పాఠశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ముంబైలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ) ప్రాంగణం నుంచి 2025 జూలైలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగానికి జాతీయ అత్యుత్తమత కేంద్రంగా ఐఐసీటీ కార్యకలాపాలు నిర్వహిస్తోందని డాక్టర్ కులకర్ణి తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, విస్తరించిన రియాలిటీ రంగాల్లో నైపుణ్యాధారిత కోర్సులను హబ్-అండ్-స్పోక్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కోర్సులు కేవలం ముంబై ప్రధాన కేంద్రానికే పరిమితం కాకుండా, ప్రాంతీయ కేంద్రాలు, చిన్న పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల ద్వారా కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని వివరించారు.
భారత్ కు ఉన్న గొప్ప కథా సంప్రదాయం, స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలను ప్రస్తావిస్తూ, ఈ విజ్ఞాన సంపద ప్రస్తుతం వివిధ డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం పొందుతోందని శ్రీ కులకర్ణి అన్నారు. సృజనాత్మక రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, చలనచిత్ర, సృజనాత్మక సంస్థలు ప్రత్యేక నైపుణ్యాధారిత కోర్సులను రూపొందిస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపునకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని పేర్కొన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ముంబై ఉప సంచాలకురాలు జయదేవి పూజారి స్వామి స్వాగతోపన్యాసం చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి సౌరభ్ ఖేకడే కార్యక్రమాన్ని నిర్వహించగా, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి ధనంజయ్ వాంకడే కృతజ్ఞతలు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2284665)
आगंतुक पटल : 13