ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
07 JUL 2026 5:14PM by PIB Hyderabad
జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇండోనేషియా పార్లమెంటులో ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రిగా శ్రీ మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధి ప్రయాణాన్ని వివరిస్తూ.. వికసిత్ భారత్ 2047 దార్శికత, ఇండోనేషియాకు చెందిన గోల్డెన్ ఇండోనేషియా 2045 (ఇండోనేషియా ఎమాస్ 2045) ఆకాంక్షలు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, ఆహార, ఇంధన భద్రత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బలోపేతం చేయడానికి.. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, సమగ్రమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఇండోనేషియాతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలకు అనుగుణంగా ద్వైపాక్షిక బంధాల కోసం గంగా-మహాకం దార్శనికత ఆధారంగా భారత్, ఇండోనేషియా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ప్రధాని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఈ విధానంలో భాగంగా ఇరు దేశాలు తమ సాంస్కృతిక బంధాన్ని పెంచుకోవాలని సూచించారు. ఒకరి అభివృద్ధి మార్గాలను మరొకరు పంచుకోవాలన్నారు. రక్షణ రంగం, వ్యూహాత్మక నమ్మకాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు నౌకా వాణిజ్య సంపద వృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకను ప్రపంచ వేదికలపై బలంగా వినిపించాలన్నారు.
ప్రధానమంత్రి శ్రీ మోదీ చేసిన ఈ ప్రసంగం భారత్, ఇండోనేషియా దేశాల మధ్య ఉన్న శాశ్వత సాంస్కృతిక బంధాలను, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను చాటిచెప్పింది. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న నిబద్ధతను ప్రధాని పర్యటన మరోసారి స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2282219)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam