వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సాంకేతిక మార్గంలో ద్విభాషా మేనేజ్మెంట్ విద్య దీంతో గ్రామీణ-పట్టణ వ్యత్యాసాల తొలగింపు సాధ్యం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఈ విధానంతో నాణ్యమైన ఉన్నత విద్యను అందరికీ సులభంగా అందుబాటులోకి తీసుకురావొచ్చని స్పష్టీకరణ
నాలుగు సూచనలు చేసిన కేంద్రమంత్రి... నిరంతరం ప్రత్యక్ష చర్చలు, సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి, అనుభవ పూర్వక అభ్యాసం, ప్రపంచ అత్యుత్తమ పద్ధతుల అవలంబన
విద్యార్థులకు మేనేజ్మెంట్లో ప్రాక్టికల్ అనుభవాన్ని కల్పించేందుకు కర్మాగారాలు, ఓడరేవులు, పారిశ్రామిక ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పిలుపు
కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తయారీ రంగానికి కొత్త ఊపునిస్తూ, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ, దేశ యువతకు ప్రపంచవ్యాప్త అవకాశాలను కల్పిస్తున్నాయన్న కేంద్రమంత్రి
प्रविष्टि तिथि:
06 JUL 2026 4:40PM by PIB Hyderabad
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అందిస్తున్న ద్విభాషా మేనేజ్మెంట్ విద్యతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వారి పరిస్థితులతో సంబంధం లేకుండా నాణ్యమైన ఉన్నత విద్య సులభంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఉదయ్పూర్లోనా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం) కొత్తగా ప్రారంభించిన ఒక కోర్సు ప్రారంభోత్సవానికి ఆయన న్యూఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆన్లైన్ ద్విభాషా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కార్యక్రమం ఒక ప్రత్యేక ముందడుగుగా అభివర్ణించారు. మేనేజ్మెంట్ విద్యను సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలో అందించడం ద్వారా ఇది సమాజంలో విస్తృతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు.
ఈ ద్విభాషా కోర్సు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉండటం వల్ల ఐఐఎం విద్యా ప్రమాణాలు, దాని విశ్వసనీయతను దేశంలోని మెజారిటీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుందని శ్రీ గోయల్ అన్నారు. ఈ డిగ్రీ కోర్సు భారతీయ పరిశ్రమల అవసరాలను తీరుస్తూ, దేశ ప్రగతికి తోడ్పడే ఒక విజయవంతమైన కార్యక్రమంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుతం దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారని మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తావించారు. కొత్త విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా భారీ సాంకేతిక సామర్థ్యాన్ని వాడుకుంటూ నాణ్యమైన విద్యను దేశంలోని నలుమూలలకూ విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత, ఆన్లైన్ విద్యా విధానం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్న మంత్రి.. ఈ ఆన్లైన్ అభ్యాస ప్రక్రియను దేశవ్యాప్తంగా మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
‘‘ఇకపై ఐఐఎం తరగతి గదులు నేరుగా విద్యార్థుల స్క్రీన్లపైనే కనిపిస్తాయి’’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాజస్థాన్లోని భిల్వారాలోని ఒక చిన్న దుకాణదారుడి నుంచి ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో నివసించే వారి వరకు ఈ విద్యా కార్యక్రమం అందరికీ చేరువవుతుందని ఆయన తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్, లాప్టాప్ లేదా కేవలం ఒక స్మార్ట్ఫోన్ ద్వారా కూడా ఈ కోర్సును నేర్చుకోవచ్చని, అందుకే దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కోర్సు పూర్తిగా ఆన్లైన్ ద్వారా బోధించినప్పటికీ, పరీక్షలను మాత్రం ఆఫ్లైన్ (ప్రత్యక్షంగా) పద్ధతిలోనే నిర్వహిస్తారని, దీనివల్ల విద్యా ప్రమాణాల్లో ఎక్కడా పారదర్శకత, జవాబుదారీతనం లోపించదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి మంత్రి నాలుగు ముఖ్యమైన సూచనలను ప్రతిపాదించారు. అందులో మొదటి సూచనగా.. సాధ్యమైనంతవరకు ఈ హైబ్రిడ్ నమూనాలో అధ్యాపకులు నెలకు ఒకసారి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, అలాగే విద్యార్థులంతా వేర్వేరు ప్రాంతాల్లో ఒకచోట కలుసుకునేలా అవకాశాలు కల్పించాలని సూచించారు. మేనేజ్మెంట్ విద్య అనేది కేవలం పాఠశాల, కళాశాల, తరగతి గది చదువులకే పరిమితం కాదని.. విద్యార్థుల మధ్య పరస్పర సంబంధాలు, చర్చల ద్వారానే అది సంపూర్ణమవుతుందని తెలిపారు. ఈ విధమైన ప్రత్యక్ష సమావేశాలను హైబ్రిడ్ నమాూనాలో చేర్చడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తన రెండో సూచనగా.. విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై లోతైన అవగాహనతో పాటు చక్కటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమష్టిగా పనిచేయడం, సాంస్కృతిక, మానవ సంబంధాల అవగాహన వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధిస్తారని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
మంత్రి తన మూడో సూచనగా.. విద్యార్థులకు అనుభవపూర్వక అభ్యాసాన్ని అందించాలని కోరారు. ఇందులో భాగంగా విద్యార్థులను కర్మాగారాలు, ఓడరేవులు, పారిశ్రామిక ప్రాంతాల క్షేత్రస్థాయి పరిశీలనకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇలాంటి అవకాశాలను కల్పించడం వల్ల విద్యార్థులకు వ్యాపార నిర్వహణపై ఆచరణాత్మక అవగాహన వస్తుందని తెలిపారు.
నాలుగో సూచనగా.. అంతర్జాతీయంగా విద్యా రంగంలో ఉన్న అత్యుత్తమ విధానాలను అవలంబించాలని సంస్థను కోరారు. ఇందులో భాగంగా ఆధునిక ఆడియో-విజువల్, డిజిటల్ సాధనాలను ఉపయోగించడంతో పాటు నూతన విద్యా విధానం ప్రకారం రుణ బదిలీల సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ప్రపంచస్థాయి అత్యుత్తమ విద్యాసంస్థలతో చేతులు కలిపి.. ప్రత్యక్ష, వర్చువల్ పద్ధతుల్లో ఉమ్మడి విద్యా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు తమ నాల్గో సంవత్సరంలో పరిశోధనలు చేసేలా ప్రోత్సహించి, వారికి పరిశోధన ఇంటర్న్షిప్లు కల్పిస్తే, అది వారి భవిష్యత్తు వృత్తి జీవితానికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
మనం నిర్మించుకుంటున్న వికసిత్ భారత్ కోసం ప్రపంచ దేశాల తలుపులు మన విద్యార్థుల కొరకు తెరిచే ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు. దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపునిస్తూ, నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్న సరికొత్త ఉచిత వాణిజ్య ఒప్పందాల ద్వారా లభిస్తున్న అవకాశాలను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ చదువుల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా చదువును ప్రాక్టికల్ అనుభవంతో ముడిపెట్టి, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని వారిని శ్రీ పీయూష్ గోయల్ ఉత్సాహపరిచారు.
విద్యా రంగాన్ని మార్చడంలో సాంకేతికత పోషిస్తున్న పాత్రను మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తావించారు. కరోనా వైరస్ వల్ల ఎన్నో నష్టాలు జరిగినప్పటికీ.. అది విద్యావ్యవస్థను సాంకేతికతతో బలంగా ముడిపెట్టిందని, ఎడ్టెక్ రంగానికి కీలక పాత్రను ఇచ్చిందని ఆయన అన్నారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడినప్పుడు.. అనేక విద్యా కార్యక్రమాలు ఆన్లైన్కు మారాయని పేర్కొన్నారు. దీనివల్ల ఎడ్టెక్ సంస్థలు కేవలం అనుబంధ సాధనాలుగా కాకుండా, తప్పనిసరిగా అవతరించాయని చెప్పారు. ఈ డిజిటల్ ప్రపంచంలో గ్రామాలకు, నగరాలకు మధ్య ఉన్న విద్యా వ్యత్యాసాలను తొలగించి వారధిగా నిలవడానికి ఎడ్టెక్ భారత్కు ఎంతో సహాయపడిందని వివరించారు.
ప్రస్తుత ప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని.. కృత్రిమ మేధ, సరికొత్త సాంకేతికతలు మేనేజ్మెంట్ రంగానికి సంబంధించిన అవసరాలను పూర్తిగా మార్చేస్తున్నాయని మంత్రి చెప్పారు. నేడు డైనమిక్ లెర్నింగ్ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగానే నైపుణ్యాభివృద్ధి కేంద్రాల అవసరాలు, కళాశాల క్యాంపస్ నియామకాల శైలి కూడా నిరంతరం మారుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు పరిశ్రమలు కేవలం పాత పద్ధతుల్లో సాగే సంప్రదాయ ఉద్యోగాలను కాకుండా, సరికొత్త నైపుణ్యాలు గల అభ్యర్థులను కోరుకుంటున్నాయని శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
భిన్న కాలమానాలు ఉన్నప్పటికీ, ఆన్లైన్ ద్వారా పరస్పరం అనుసంధానమవడం వల్ల విద్యను వేగంగా, సరళంగా, సమర్థవంతంగా అందించడం సాధ్యమవుతుందని కేంద్రమంత్ శ్రీ పీయూష్ గోయల్ చెప్పారు. దీనికి ఉదాహరణగా ఇటీవల భారత్ వాణిజ్య ఒప్పందాల చర్చలను ఆయన ప్రస్తావించారు. భిన్న కాలమానాల్లో ఉండే దేశాలతో భారత్ ఒప్పందాలకు చెందిన చర్చలు ఆన్లైన్ ద్వారానే సాగుతున్నాయని తెలిపారు. ప్రత్యక్ష సమావేశాలతో పాటు, వివిధ రంగాలకు చెందిన పెద్ద పెద్ద బృందాలు ఆన్లైన్ చర్చల ద్వారా పనుల్లో వేగాన్ని పెంచుతూ, నాణ్యతను మెరుగుపరుస్తున్నాయని వివరించారు. ఇదే తరహాలో ప్రతక్ష, పరోక్ష విధానాలను కలగలిపిన ఐఐఎం ఉదయ్పూర్ హైబ్రిడ్ నమూనా కూడా ఈ విద్యా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ రంగంలో ఐఐఎం బ్రాండ్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపును కేంద్రమంత్రి ప్రస్తావించారు. ముంబయిలోని కార్పొరేట్ బోర్డు రూముల నుంచి మొదలుకొని అమెరికా న్యూయార్క్లోని మన్హట్టన్ బోర్డురూముల వరకు.. మేనేజ్మెంట్లో వచ్చే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా యువతను తీర్చిదిద్దే సంస్థలుగా ఐఐఎం బ్రాండ్కు దేశవిదేశాల్లో పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ విద్యాసంస్థలు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందిస్తాయని.. యువతను భవిష్యత్తు నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
నూతనంగా ప్రారంభమైన ఈ బీబీఏ కోర్సులో చేరిన విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ ద్విభాషా మేనేజ్మెంట్ విద్య అత్యంత సరళమైన భాషలో సమాజంలోని ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఆన్లైన్ కోర్సు కావడం వల్ల దేశవ్యాప్తంగా దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుందని చెప్పారు. ఈ కోర్సులో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టిస్తారని శ్రీ పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఇదొక అద్భుతమైన అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు సవాళ్లకు తమను తాము సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
***
(रिलीज़ आईडी: 2281852)
आगंतुक पटल : 5