లోక్సభ సచివాలయం
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన లోక్సభ స్పీకర్
పుష్పాంజలి ఘటించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు
प्रविष्टि तिथि:
06 JUL 2026 5:56PM by PIB Hyderabad
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా నేతృత్వంలో పార్లమెంట్ సభ్యులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు.. కేంద్ర న్యాయశాఖ (స్వతంత్ర బాధ్యత), పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్.. కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సెక్రటరీ జనరల్ శ్రీ ఉత్పల్ కుమార్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీ.సీ. మోదీ, ఇతర ఉన్నతాధికారులు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక ప్రముఖ పార్లమెంటేరియన్, విశిష్ట విద్యావేత్త, ప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు, జాతీయ ఐక్యత- సమగ్రతలకు బలమైన మద్దతుదారు. 1901 జూలై 6న జన్మించిన ఆయన.. ప్రజా జీవితం, విద్యా రంగం, దేశ నిర్మాణంలో విశేష కృషి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్-ఛాన్సలర్గా సేవలు అందించిన ఆయన.. ఆ తర్వాత భారతదేశ రాజకీయ, పార్లమెంటరీ జీవితంలో కీలక పాత్ర పోషించారు.
మొదటి లోక్సభ సభ్యుడైన డాక్టర్ ముఖర్జీ.. తన మాటల చాతుర్యం, మేధో సంపత్తి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతకు విస్తృతంగా ప్రశంసలు పొందారు. పార్లమెంటరీ చర్చలు, జాతీయ సమస్యలపై ఆయన చేసిన ప్రసంగాలు.. ఆ కాలంలోని అత్యంత విశిష్ట పార్లమెంటేరియన్లలో ఒకరిగా ఆయనను నిలిపాయి. జాతీయ ఐక్యత, ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన అంకితభావానికి ఆయనను నేటికీ గుర్తుపెట్టుకుంటారు.
సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రాన్ని శ్రీ ఎన్.ఎస్. సుబ్బకృష్ణ వేశారు. ఈ చిత్రాన్ని 1991 మే 31న అప్పటి భారత రాష్ట్రపతి ఆవిష్కరించారు.
***
(रिलीज़ आईडी: 2281850)
आगंतुक पटल : 6