సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉద్యోగాల్లో పునర్నియామకం ద్వారా దాదాపు 65,000 మంది ఆయుధ కర్మాగార పూర్వ ఉద్యోగులకు భద్రత కల్పించిన ప్రభుత్వం
ఉద్యోగుల సంక్షేమం దిశగా సంస్కరణలను తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధి బృందం
ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సామర్థ్య బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వ సంస్కరణలు: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
05 JUL 2026 3:41PM by PIB Hyderabad
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనాపరమైన సంస్కరణలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు గానూ భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 19 మంది సభ్యుల దేశవ్యాప్త ప్రతినిధుల బృందం ఈ రోజు... కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలిసింది.
ప్రభుత్వ ఉద్యోగుల-కేంద్రిత కార్యక్రమాలను సులభతరం చేసినందుకు, ముఖ్యంగా ఆయుధ కర్మాగార బోర్డు పునర్వ్యవస్థీకరణ తరువాత దాదాపు 65,000 మంది పూర్వ ఉద్యోగులను సాధారణ ప్రభుత్వ సేవల్లో తిరిగి నియమించాలన్న నిర్ణయం ద్వారా వేలాది మంది ఉద్యోగుల భవితను కాపాడినందుకు ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒక చరిత్రాత్మకమని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సేవలకు చెందిన ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్, ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య, ప్రభుత్వ రంగ ఉద్యోగుల జాతీయ సమాఖ్య, షార్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్, అంతరిక్ష రంగ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ... సంస్థాగత చర్చల ద్వారా సేవా సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగ సంఘాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. సంబంధిత వర్గాలతో నిరంతర సంప్రదింపులు పాలనను బలోపేతం చేస్తాయనీ... ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యల సకాల పరిష్కారానికీ దోహదపడతాయని ఆయన అన్నారు.
ఆయుధ కర్మాగార పూర్వ ఉద్యోగుల డీమ్డ్ డిప్యుటేషన్ను పదవీ విరమణ తేదీ వరకు పొడిగించడానికి మద్దతునిచ్చిన ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యునిగా డాక్టర్ జితేంద్ర సింగ్కు ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఉద్యోగులను తిరిగి సాధారణ ప్రభుత్వ సేవల్లో నియమించాలనే నిర్ణయం దాదాపు 65,000 మంది ఉద్యోగులకు దీర్ఘకాలిక సేవా భద్రతను అందించిందన్నారు. ఆయుధ కర్మాగార బోర్డు కార్పొరేటీకరణ ద్వారా తలెత్తే ముఖ్యమైన ఆందోళనల్లో ఒకదాన్ని ఈ నిర్ణయం విజయవంతంగా పరిష్కరించిందని ప్రతినిధులు తెలిపారు.
మరింత పరిశీలన అవసరమైన పలు సేవా సంబంధిత అంశాలపైనా ప్రతినిధులు చర్చించారు. కారుణ్య నియామకాల కేసులకు పాత పింఛను పథకం ప్రయోజనాన్ని విస్తరించడం, ఉద్యోగపరమైన పురోగతి, కేడర్ సంబంధిత విషయాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై సంబంధిత వ్యక్తులతో విస్తృత సంప్రదింపులు వీటిలో భాగంగా ఉన్నాయి.
సిబ్బంది నిర్వహణ, భవిష్యత్ విధాన సంస్కరణలకు సంబంధించిన విషయాలపై చర్చల సందర్భంగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో తరచూ సంప్రదించడాన్ని ప్రతినిధి బృందం అభినందించింది. అనవసరమైన వ్యాజ్యాలను తగ్గించడానికి, ఉద్యోగులను ప్రభావితం చేసే సేవా సంబంధిత విషయాల సకాల పరిష్కారాన్ని నిర్ధారించడానికి పరిపాలనా ప్రక్రియల సరళీకృతాన్ని కొనసాగించాలని ప్రతినిధి బృందం సూచించింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సంప్రదింపులతో కూడిన, స్పందించే విధానానికి కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సమస్యలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా తగినవిధంగా పరిశీలిస్తాయని ఆయన పేర్కొన్నారు. పరిపాలనను మెరుగుపరచడం, విధానాలను సరళీకరించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలతో కూడిన సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్రగతిశీల పరిపాలనా సంస్కరణల ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, సమర్థంగా, పౌర కేంద్రితంగా మార్చడానికి ప్రధానమంత్రి శ్రీ మోదీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆచరణాత్మక సమస్యలను గుర్తించి, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తగిన విధానపరమైన ప్రతిస్పందనలను రూపొందించడంలో ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
సేవా నిబంధనలు, పింఛను, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన విషయాలపై ప్రతినిధి సంస్థలతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూనే, ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన సంస్కరణలనూ కొనసాగిస్తుందని ప్రతినిధి బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.
తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం కల్పించినందుకు బృంద సభ్యులు డాక్టర్ జితేంద్ర సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న సంప్రదింపుల విధానాన్ని వారు ప్రశంసించారు.
***
(रिलीज़ आईडी: 2281440)
आगंतुक पटल : 7