
షీ-లీప్స్ మొబైల్ అప్లికేషన్ ను డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అభివృద్ధి చేయగా.. లోక్ఓఎస్ వేదిక ద్వారా అమలవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ ఆధారిత సంస్థల (సీబీఓలు) కార్యకలాపాలను నమోదు చేసేందుకు రూపొందించిన డిజిటల్ వ్యవస్థే లోక్ఓఎస్. ఈ సంస్థల్లో ఎస్హెచ్జీలు, గ్రామ సంఘాలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలు ఉన్నాయి. సభ్యుల రికార్డుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, జీవనోపాధి రికార్డులు, వివిధ ప్రభుత్వ పథకాల అనుసంధాన కార్యక్రమాలను పర్యవేక్షించటం వంటి కమ్యూనిటీ ఆధారిత సంస్థల (సీబీఓ) కార్యకలాపాలను డిజిటలైజ్ చేయటానికి లోక్ఓఎస్ సహాయపడుతుంది.
న్యూఢిల్లీలో జూన్ 29, 2026న జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో షీ-లీప్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి' ఇతివృత్తంతో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రధాన గ్రామీణ అభివృద్ధి పథకాల అమలు, పురోగతిని సమీక్షించారు. 'వికసిత్ గ్రామం - వికసిత్ భారత్' ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు వ్యూహాలను రూపొందించటంపై ఈ సదస్సు దృష్టి సారించింది.
దేశవ్యాప్తంగా షీ-లీప్స్ అమలు
ఈ లక్ష్యాల సాధనపై షీ-లీప్స్ దృష్టి:
-
దేశవ్యాప్తంగా గ్రామీణ ఎస్హెచ్జీ మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించటం.
-
గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నేతృత్వంలో సంస్థలను ఏర్పాటు చేసి, బలోపేతం చేయటం.
-
గ్రామీణ ఉత్పత్తిదారులను అధికారిక సరఫరా వ్యవస్థలతో అనుసంధానించటం.
-
ఎస్హెచ్జీ కుటుంబాల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించటం.
-
డేటా ఆధారిత గ్రామీణ వ్యవస్థాపకతను ప్రోత్సహించటం.
షీ-లీప్స్ కార్యక్రమాన్ని 34 రాష్ట్రాలు, యూటీల్లో అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన రాష్ట్రాలు, యూటీల్లోని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి కార్యక్రమాలకు ఇది సహాయం అందిస్తుంది. గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సంస్థాగత సమాచారాన్ని ఈ వేదిక ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక ప్రగతిపై స్పష్టమైన అవగాహనను పెంపొందిస్తుంది. దీంతో వివిధ స్థాయుల్లో పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఫలితంగా క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడుతుంది.
సంస్థాగత అభివృద్ధికి డిజిటల్ సేవలు
వివిధ రంగాల్లోని నిర్వహణ డేటాను షీ-లీప్స్ ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. పూర్తి జీవనోపాధి ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది. సంస్థ ప్రొఫైల్ ను రూపొందించటం నుంచి సంస్థాగత పనితీరుని పరిశీలించటం వరకు ప్రతి దశలోనూ ఈ వేదిక మద్దతిస్తుంది. ఇది డిజిటల్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తుంది. పరిపాలనను మెరుగుపరుస్తుంది. మెరుగైన ప్రణాళికలు, అవసరమైన చర్యలు, సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. షీ-లీప్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అందించే సేవలు:

లఖ్పతి దీదీ కార్యక్రమానికి మరింత ఊతం
ఆదాయ వృద్ధి, ఉపాధి సంస్థల పనితీరును సమగ్రంగా పర్యవేక్షించటం ద్వారా లఖ్పతి దీదీ మిషన్ను షీ-లీప్స్ వేదిక మరింత బలోపేతం చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం లఖ్పతి దీదీ పథక లబ్ధిదారుల లక్ష్యాన్ని 3 కోట్ల నుంచి 6 కోట్ల మందికి పెంచింది.
లఖ్పతి దీదీలకు లబ్ధి చేకూర్చేందుకు రానున్న అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళా సాధికారత పట్ల ప్రభుత్వానికున్న బలమైన నిబద్ధతను ఇది తెలియజేస్తుంది. వ్యాపార విస్తరణను పెద్దఎత్తున ప్రోత్సహించే ప్రణాళికలో షీ-లీప్స్ మొబైల్ అప్లికేషన్ కీలక భాగం.
మహిళల నేతృత్వంలో బలమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం
డిజిటల్ మౌలిక సదుపాయాలు, వ్యవస్థాపకత, మహిళా సాధికారతను ఏకం చేయటం ద్వారా డిజిటల్ గ్రామీణ పరివర్తనలో షీ-లీప్స్ ముందడుగును సూచిస్తుంది. సంస్థాగత వృద్ధికి మద్దతివ్వటం, ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయటం ద్వారా లఖ్పతి దీదీ మిషన్ను దేశవ్యాప్తంగా విస్తరించటానికి ఈ వేదిక సహాయపడుతుంది. సమగ్ర, సుస్థిర గ్రామీణ పరివర్తనకు కీలక శక్తిగా ఇది నిలుస్తుంది.
ఆధారాలు
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
https://lokos.dord.gov.in/home
https://x.com/MoRD_GoI/status/2071507758046916762
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2279029®=6&lang=1
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
https://play.google.com/store/apps/details?id=com.nrlm.gramudyamita&hl=en_IN
పీడీఎఫ్ ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***