హోం మంత్రిత్వ శాఖ
యమునా నీటి ప్రాజెక్టు నిర్మాణం, అమలుకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో సంతకాలు
మూడు దశాబ్దాలుగా హర్యానా, రాజస్థాన్ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు ఈ ఒప్పందంతో లభించిన పరిష్కారం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘చర్చల ద్వారా పరిష్కారం’ అనే మంత్రానికి ఈ ఒప్పందమే ఉత్తమ ఉదాహరణ
‘సహకారాత్మక సమాఖ్య విధానం’ అనే ప్రధానమంత్రి సందేశాన్ని, జలశక్తి మంత్రిత్వ శాఖ స్ఫూర్తిని సాకారం చేసిన హర్యానా, రాజస్థాన్
ఈ ఒప్పందం తర్వాత రాజస్థాన్లోని సికార్, చురు, జున్జును ప్రాంతాలు, హర్యానాలోని భివానీ, ఫతేహాబాద్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా
గతంలో వృథా అయిన, ఉపయోగించని వర్షపు నీటిని.. ఈ ఒప్పందం అనంతరం ప్రజల దాహార్తిని తీర్చేందుకు, భూగర్భ నీటి స్థాయులను పెంచేందుకు చెరువుల్లో నిల్వ చేస్తారు
హర్యానా, రాజస్థాన్లకు ఉభయతారకంగా మారిన ఒప్పందం
కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ నాయకత్వంలో ఈ సమస్యకు కొద్ది రోజుల్లోనే లభించిన పరిష్కారం
భవిష్యత్తులోనూ వివాద రహిత ఒప్పందంగా నిలిచేలా అవసరమైన నియమావళి రూపకల్పన
प्रविष्टि तिथि:
29 JUN 2026 3:04PM by PIB Hyderabad
యమునా నీటి ప్రాజెక్టు నిర్మాణం, అమలుకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందంపై రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా సమక్షంలో సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ, కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ.. హర్యానా, రాజస్థాన్ ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఈ ఒప్పందం ఈ రోజు పరిష్కరించిందని చెప్పారు. ‘చర్చల ద్వారా పరిష్కారం’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదానికి ఈ ఒప్పందం అత్యుత్తమ ఉదాహరణ. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు ముందుకు వెళితే.. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని ఈ ఒప్పందం నిరూపించింది.
ఈ రోజు కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మూడు భూగర్భ పైపులైన్ల ద్వారా జులై నుంచి అక్టోబర్ వరకు సుమారుగా 580 మిలియన్ క్యూబిక్ మీటర్లు (ఎంసీఎం) నీటిని యమునా కాల్వ నుంచి రాజస్థాన్కు సరఫరా అవుతుందని శ్రీ అమిత్ షా వెల్లడించారు. 3.6 మీటర్ల వ్యాసం ఉన్న ఈ మూడు పైపులైన్లు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రజలకు తాగు నీరు అందిస్తాయి. రెండు రాష్ట్రాలకూ ఉభయతారకంగా నిలిచే ఒప్పందాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని శ్రీ షా అన్నారు. ఆర్థిక బాధ్యతలు, వ్యయాన్ని పంచుకోవడం, నీటి విడుదల ప్రణాళికలు, నిర్వహణా ఏర్పాట్లు లాంటి సమస్యలను ఈ ఒప్పందం జాగ్రత్తగా పరిష్కరిస్తుంది. మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణ, పర్యవేక్షణ వ్యవస్థలు, పారదర్శక చర్యలు, పటిష్టమైన వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఈ సమగ్ర ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
భవిష్యత్తులో వివాద రహిత ఒప్పందంగా నిలిచేలా దీనికి సంబంధించిన సమగ్ర విధానాన్ని హర్యానా, రాజస్థాన్ ముఖ్యంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్ధం చేశాయని కేంద్ర హోం మంత్రి చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ సారథ్యంలో అతి తక్కువ రోజుల్లోనే ఈ పరిష్కారం సాధ్యమైందని హోం మంత్రి అన్నారు. ఈ ఒప్పందం తర్వాత రాజస్థాన్లోని సికార్, చురు, జున్జును ప్రాంతాలకు, హర్యానాలోని భివానీ, ఫతేహాబాద్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా రాజస్థాన్లో తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ఈ ఒప్పందం గణనీయమైన రీతిలో సహకరిస్తుందని శ్రీ అమిత్ షా చెప్పారు. గతంలో వృథాగా పోయిన నీరు ఇప్పుడు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తోడ్పడుతుంది. భూగర్భ జల స్థాయులను పెంచేందుకు పెద్ద చెరువుల్లో ఈ నీటిని నిల్వ చేస్తారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సహకార సమాఖ్య స్ఫూర్తిని హర్యానా, రాజస్థాన్, జలశక్తి మంత్రిత్వ శాఖ వాస్తవ రూపంలోకి తీసుకువచ్చాయని శ్రీ షా చెప్పారు.
రాజస్థాన్కు కేటాయించిన యమునా జలాలను పశ్చిమ యమునా కాల్వ నుంచి భూగర్భ పైప్లైన్ వ్యవస్థ ద్వారా సరఫరా చేయడాన్ని ఈ ప్రాజెక్టు సులభతరం చేస్తుంది. తద్వారా, ఎగువ యమునా బేసిన్లోని జలాల పంపిణీపై 1994లో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం కేటాయించిన నీటిని ఆ రాష్ట్రం సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది.
ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్లోని నీటి ఎద్దడి ఉన్న, పాక్షిక నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో విశ్వసనీయంగా తాగునీటిని సరఫరా చేయడం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం ద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం, భాగస్వామ్య రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రాజెక్టును సకాలంలో అమలు చేయడానికి ఈ ఒప్పందం పునాది వేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2279061)
आगंतुक पटल : 10