PIB Backgrounder
ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాల సృష్టికర్తలుగా.. ఇదీ 'ఆస్పైర్' విజయగాథ
ఆస్పైర్: గ్రామీణ ఆశయాలను వ్యాపారాలుగా మారుస్తున్న పథకం
प्रविष्टि तिथि:
26 JUN 2026 2:41PM by PIB Hyderabad
మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామంలో ఒక వర్షం పడుతున్న ఉదయం శ్రీ బాన్షైలాంగ్ మర్బానియాంగ్ కొండలపై కమ్ముకుంటున్న నల్లటి మేఘాలను చూస్తూ నిలబడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆ ప్రాంతంలో సాధారణంగానే వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అయితే, ఆయన ఆలోచనలు వాతావరణం గురించి కావు. గత కొన్నేళ్లుగా ఆయనను వెంటాడుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. దేశంలోని అత్యంత మారుమైల ప్రాంతాల్లో ఒకటైన గ్రామానికి చెందిన ఒక యువకుడు, సమృద్ధిగా కురుస్తున్న వర్షంలా కాకుండా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు తన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి?
ఉపాధి వెతుక్కుంటూ తన స్నేహితులు, పొరుగువారు మాసిన్రామ్ను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లడం శ్రీ మర్బానియాంగ్ కొన్నేళ్లుగా చూస్తున్నారు. వనరులు పరిమితంగా ఉండటంతో స్వంతంగా వ్యాపారం ప్రారంభించడం అనేది అసాధ్యంగా అనిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఆ కలను మరింత దూరం చేశాయి. అయినా ఆ ఆలోచన ఆయన మనసు నుంచి పోలేదు. ఆ ప్రాంతంలోని విరివిగా దొరికే వ్యవసాయ ఉత్పత్తులను చూస్తూ, ఈ స్థానిక వనరులే ఒక వ్యాపార స్థాపనకు పునాది కాలేవా అని ఆయన ఆలోచించారు.
గువాహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్(ఐఐఈ) అందిస్తున్న వ్యవస్థాపకత శిక్షణ, నైపుణ్యాభివృద్ధి మద్దతు గురించి తెలిసినప్పుడు ఆయన జీవితంలో ఒక మలుపు వచ్చింది. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ) పరిధిలోని 'ఆస్పైర్' (గ్రామీణ పరిశ్రమలు, వ్యవస్థాపకత, ఆవిష్కరణల ప్రోత్సాహక పథకం) కింద ఐఐఈ ఒక మార్గదర్శక సంస్థగా పనిచేస్తోంది. ఇది వ్యాపార ఆలోచనలను సంస్థలుగా మార్చడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో కాబోయే వ్యవస్థాపకులకు సహాయపడుతుంది.
ఈ శిక్షణ శ్రీ మర్బానియాంగ్కు సరికొత్త అవకాశాలను పరిచయం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నైపుణ్యాలతో ఆయన ఒక ఫుడ్ ప్రాసెసింగ్(ఆహార శుద్ధి) కేంద్రాన్ని స్థాపించారు. ఇది స్థానికంగా లభించే వనరులను ఆర్థిక అవకాశాలుగా మార్చింది. సరైన మార్గదర్శకత్వం, నైపుణ్యాలు ఉంటే ఎక్కడైనా అవకాశాలను సృష్టించవచ్చని ఆయన నిరూపించారు.
సొంత ఊరిలోనే అవకాశాల సృష్టి
శ్రీ మర్బానియాంగ్ కథ గ్రామీణ భారతదేశంలో వస్తున్న ఒక పెద్ద మార్పునకు అద్దం పడుతోంది.
వ్యాపార అభివృద్ధి సేవలు, సాంకేతిక మద్దతు, పరిశ్రమల ప్రోత్సాహం వంటివి చాలావరకు కొన్ని పట్టణ కేంద్రాలకే పరిమితమయ్యాయి. గ్రామీణ భారతదేశంలో ప్రతిభ, నైపుణ్యాలు, వనరులు ఉన్నప్పటికీ, ఆలోచనలను స్థిరమైన వ్యాపారాలుగా మార్చడానికి కావలసిన శిక్షణ, మార్గదర్శకత్వం, సంస్థాగత మద్దతు గ్రామీణ యువతకు అందేది కాదు.
ఈ లోటును గుర్తించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ ఆధారిత రంగాలలో ఉపాధి కల్పనను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి 2015లో 'ఆస్పైర్' పథకాన్ని ప్రారంభించింది.
మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ పథకం కొన్నేళ్లుగా రూపాంతరం చెందుతూ వస్తోంది. 2018లో విడుదల చేసిన కార్యాచరణ మార్గదర్శకాలు ఇంక్యుబేషన్ వ్యవస్థను బలోపేతం చేశాయి. 2023 సవరించిన మార్గదర్శకాలు జీవనోపాధి సృష్టి, వ్యాపార అభివృద్ధి, స్పష్టమైన ఫలితాలపై మరింత దృష్టి పెట్టాయి. ఈ రోజు, ఆస్పైర్ పథకం 'లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్స్' (ఎల్బీఐ) నెట్వర్క్ ఆధారంగా నడుస్తోంది. ఇవి వ్యక్తులు కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా, సొంతంగా వ్యాపారాలు స్థాపించేలా సహాయపడుతున్నాయి.
వ్యవసాయ-గ్రామీణ రంగాలలో కాబోయే వ్యవస్థాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్ మద్దతు ఇవ్వడం ద్వారా ఆస్పైర్ వారిని శక్తివంతులను చేస్తోంది. అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.
వ్యాపారాలు రూపుదిద్దుకునే వేదికలు
ఆస్పైర్ విజయానికి ప్రధాన కారణం దాని పరిధిలోని ఎల్బీఐలు. కేవలం నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మాత్రమే దీని లక్ష్యం కాదు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే అధికారిక, విస్తరించదగిన మైక్రో-ఎంటర్ప్రైజెస్(సూక్ష్మ పరిశ్రమలు) స్థాపించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ ఇంక్యుబేటర్లు ఆధునిక పరికరాలు, వ్యాపార మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతును అందిస్తాయి. ఉత్పత్తి అభివృద్ధి, బ్రాండింగ్, గుర్తింపు పొందేలా చేయడం, నిబంధనల పాటింపు, మార్కెట్ అనుసంధానం, ఆర్థిక సహాయం పొందడంలో కూడా వ్యవస్థాపకులకు తోడ్పాటునందిస్తాయి. తద్వారా ఒక ఆలోచన వ్యాపారంగా మారే ప్రయాణంలో వారికి సహాయం చేస్తాయి.
శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వ్యవస్థాపకులకు నిరంతర మద్దతు లభించేలా ఆస్పైర్ సంస్థాగత నిర్మాణం చూసుకుంటుంది. ఈ పథకం స్కీమ్ స్టీరింగ్ కమిటీ, నిర్దేశిత మెంటార్ ఇన్స్టిట్యూట్లు, ఎల్బీఐలను నడిపించే హోస్ట్ ఇన్స్టిట్యూట్లతో కూడిన మూడంచెల వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. ఇంక్యుబేటర్లను గుర్తించడం, ప్రాజెక్ట్ ప్లాన్లు తయారు చేయడం, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లను రూపొందించడం, అమలును బలోపేతం చేయడం, ఫలితాలను పర్యవేక్షించడంలో మెంటార్ ఇన్స్టిట్యూట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ ఇంక్యుబేషన్ వ్యవస్థలో గువాహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్(ఐఐఈ), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, ఐఐటీ జోధ్పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వ్యవసాయ పరిశ్రమ రంగంలో వ్యవస్థాపకతను పెంచడానికి, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి కూడా ఈ కేంద్రాలను రూపొందించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎల్బీఐలు ఫుడ్ ప్రాసెసింగ్, తేనె ఉత్పత్తి, వెదురు ఉత్పత్తులు, పుట్టగొడుగుల పెంపకం, మసాలా దినుసుల ప్రాసెసింగ్, హస్తకళలు, కొబ్బరి పీచు ఉత్పత్తుల వంటి రంగాలలో వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ విధానం ప్రాధాన్యత భారత ఆర్థిక వ్యవస్థకు లభిస్తున్న గ్రామీణ పరిశ్రమల అదనపు విలువ ఆధారిత సహకారం ద్వారా స్పష్టమవుతోంది. అనేక గ్రామీణ వర్గాలకు, వ్యాపార స్థాపన అనేది కేవలం ఆదాయాన్ని సంపాదించే అవకాశం మాత్రమే కాదు, పెద్ద విలువ గొలుసులలో భాగస్వాములు కావడానికి ఒక మార్గం. వ్యవసాయం, స్థానిక వనరులతో ముడిపడి ఉన్న రంగాలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా, ప్రాథమిక ఉత్పత్తి స్థాయి నుంచి ప్రాసెసింగ్, తయారీ, అదనపు విలువను జోడించే దిశగా ప్రజలు అడుగులు వేసేలా ఆస్పైర్ ప్రోత్సహిస్తోంది.
ఈ వ్యవస్థ కొన్నేళ్లుగా స్థిరంగా విస్తరించింది. 2026 జూన్ నాటికి 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 109 ఎల్బీఐలు ఆమోదం పొందాయి. ఈ ఇంక్యుబేటర్లన్నీ కలిసి 1.23 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి క్రమబద్ధమైన పర్యవేక్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్పైర్ మద్దతు ఉన్న ఇంక్యుబేటర్లు దేశవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు సహాయపడ్డాయి.
భారతదేశ కాబోయే వ్యవస్థాపకులకు సాధికారత
ఆస్పైర్ విజయం అనేది అది మద్దతు ఇచ్చే ఇంక్యుబేటర్ల సంఖ్యను బట్టి కాకుండా, అది మార్చిన ప్రజల జీవితాల ఆధారంగా కొలుస్తారు.
2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా 28,500 మందికి పైగా మహిళలకు వ్యవస్థాపక అవకాశాలను కల్పించింది. వ్యాపార స్థాపనలో మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించడంలో దీని పెరుగుతున్న పాత్రకు ఇది నిదర్శనం. అదే సమయంలో ఆస్పైర్ 8,700 మందికి పైగా ఎస్సీ లబ్ధిదారులకు, 9,600 మందికి పైగా ఎస్టీ లబ్ధిదారులకు, 17,600 మందికి పైగా ఓబీసీ లబ్ధిదారులకు చేరువైంది. ఇది వ్యవస్థాపకతను అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కావు. విభిన్న సామాజిక, ఆర్థిక వర్గాలకు వ్యవస్థాపక మద్దతును అందించడం ద్వారా వ్యాపార స్థాపన కేవలం మెట్రోపాలిటన్ కేంద్రాలకే పరిమితం కాకుండా ఆస్పైర్ చూస్తోంది. బదులుగా ఇది భారతదేశంలోని గ్రామాలు, చిన్న పట్టణాలు, వెనుకబడిన వర్గాలలో వృద్ధికి, స్వావలంబనకు, జీవనోపాధి సృష్టికి ఒక మార్గంగా మారుతోంది.
మాసిన్రామ్ నుంచి కర్తవ్య పథ్ వరకు..
కొన్నేళ్ల తర్వాత శ్రీ మర్బానియాంగ్ ప్రయాణానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం పొందిన ఈశాన్య ప్రాంతానికి చెందిన పది మంది వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు భారతదేశ గ్రామాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాల నుంచి ఎదుగుతున్న కొత్త తరం వ్యవస్థాపకులకు ప్రతీకలుగా నిలిచారు. దేశంలోని అత్యంత ముఖ్యమైన జాతీయ వేడుకలలో వారు పాల్గొనడం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు. ఉద్యోగాలు వెతుక్కునే వారిని ఉద్యోగాలు సృష్టించేవారిగా, స్థానిక ఆశయాలను అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలుగా మార్చడంలో సహాయపడుతున్న కార్యక్రమాల విజయానికి ఇది నిదర్శనం.
మాసిన్రామ్ వర్షపు కొండల నుంచి కర్తవ్య పథ్ మధ్య ఉన్న దూరాన్ని కిలోమీటర్లలో కొలిస్తే అనిశ్చితి నుంచి వ్యవస్థాపకత వైపు సాగిన ప్రయాణాన్ని లభించిన అవకాశాల ద్వారా కొలవవచ్చు. ఆస్పైర్ ద్వారా వేలాది మంది భారతీయులు తమ ఆశయాలను వ్యాపారాలుగా మార్చుకోవడానికి అవసరమైన మద్దతు, నైపుణ్యాలు, వనరులను పొందుతున్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతను పెంపొందించడం ద్వారా ఆలోచనలు వ్యాపారాలుగా, నైపుణ్యాలు జీవనోపాధిగా, ఆశయాలు ఆర్థిక అవకాశాలుగా మారుతున్నాయి.
ఈ ప్రక్రియలో ఆస్పైర్ కేవలం వ్యాపారాలను సృష్టించడమే కాకుండా సమాజాలకు సాధికారత కల్పిస్తోంది. ఉపాధిని సృష్టిస్తోంది. మరింత సమగ్రమైన, స్వయంసమృద్ధ భారతదేశ నిర్మాణానికి తోడ్పడుతోంది.
***
(रिलीज़ आईडी: 2278952)
आगंतुक पटल : 22