గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో గ్రామీణాభివృద్ధిపై జూన్ 28–29 తేదీల్లో తొలి జాతీయ సదస్సు
‘వికసిత్ గ్రామ్, వికసిత్ భారత్’ జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రాధాన్యతా పథకాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణే లక్ష్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు
గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం ఉమ్మడి కార్యాచరణపై ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో ఏకమైన కేంద్రం, రాష్ట్రాలు
ఇళ్ళు, రోడ్లు, జీవనోపాధి, లఖ్పతీ దీదీ, కృత్రిమ మేధ ఆధారంగా జాతీయ గ్రామీణాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన
प्रविष्टि तिथि:
26 JUN 2026 6:55PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని పూసాలో ఉన్న భారతరత్న సి. సుబ్రమణ్యం ఆడిటోరియంలో జూన్ 28, 29 తేదీల్లో 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. వీరంతా కలిసి గ్రామీణ భారతదేశ సమగ్ర అభివృద్ధి గురించి చర్చించడంతో పాటు, కీలకమైన ప్రధాన పథకాలను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా, గ్రామీణ భారతదేశంలో సమగ్రమైన, సుస్థిరమైన, మార్పుదాయక అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక విస్తృతమైన జాతీయ చర్చను చేపట్టనుంది. కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో, ఈ తరహాలో జరుగుతున్న మొట్టమొదటి భారీ జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఇదే కావడం విశేషం. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది. ‘వికసిత్ గ్రామ్, వికసిత్ భారత్’ సంకల్పాన్ని నిజం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌహాన్ తెలిపారు. విబి-గ్రామ్ జి చట్టం - 2025 ను సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికా ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, దీన్దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి కీలక గ్రామీణాభివృద్ధి పథకాల అమలు తీరును, వాటి పురోగతిని ఈ సదస్సు సమగ్రంగా సమీక్షిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.
సదస్సులో పాల్గొననున్న అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు
ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు హాజరు కానుండడం విశేషం. వివిధ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుతో సంబంధం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, విధాన నిర్ణేతలు, విషయ నిపుణులు కూడా చర్చల్లో పాల్గొంటారు. ఈ జాతీయ వేదిక రాష్ట్రాల అనుభవాలు, వినూత్న ఆవిష్కరణలు, క్షేత్రస్థాయి సవాళ్ళపై బహిరంగ చర్చలకు వీలు కల్పించడం ద్వారా మరింత పటిష్టమైన, ఆచరణాత్మకమైన విధానాల రూపకల్పనకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
వివిధ అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు - ఉత్తమ పద్ధతులపై దృష్టి
ఈ సదస్సులో గ్రామీణ గృహనిర్మాణం, రహదారుల అనుసంధానం, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత వంటి అంశాలపై ప్రత్యేక చర్చాగోష్టులు, ప్రత్యేక సెషన్లు ఉంటాయని శ్రీ చౌహాన్ తెలిపారు. వివిధ రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేసిన కార్యక్రమాలనూ, వినూత్న విధానాలనూ ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. ఇందువల్ల వాటిని దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించేందుకు అవకాశం కలుగుతుంది. స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడం, గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం వంటి అంశాలపై చర్చలతో 'లఖ్పతీ దీదీ' కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంచడం, మార్కెట్ అనుసంధానాలను మెరుగుపరచడంపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.
సాంకేతికత, కృత్రిమ మేధపై ప్రత్యేక దృష్టి
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో సాంకేతికత, కృత్రిమ మేధ వినియోగంపై ఈ సదస్సు ప్రత్యేకంగా చర్చిస్తుంది. పథకాల అమలులో వేగాన్నీ, సామర్ధ్యాన్నీ పెంచేందుకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలతో పాటు డిజిటల్ వేదికలు, నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రధానంగా చర్చలు సాగనున్నాయి.
భవిష్యత్ కార్యాచరణ
సదస్సు రెండో రోజైన జూన్ 29న భవిష్యత్ కార్యాచరణకు తుది రూపు ఇచ్చే ముందు అన్ని రాష్ట్రాల సూచనలను స్వీకరించడానికి ప్లీనరీ సమావేశాలు, మంత్రిత్వ శాఖల స్థాయి చర్చలు జరుగుతాయని శ్రీ చౌహాన్ తెలిపారు. ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి కీలక నిర్ణయాలను ప్రకటించడంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ సంకల్పాన్ని సాధించడంలో గ్రామాలు పోషించాల్సిన ప్రధాన పాత్రను వివరిస్తారు.
గ్రామీణ భారతదేశం కోసం సరికొత్త సంకల్పాలు - స్పష్టమైన కార్యాచరణ
ఈ సదస్సు కేవలం ఒక సాధారణ సమీక్షా కార్యక్రమం మాత్రమే కాదని, గ్రామీణ భారతదేశం కోసం సరికొత్త సంకల్పాలను, ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే అద్భుతమైన అవకాశమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వం, నాయకత్వంలోని భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా... దేశ ప్రగతి ప్రయాణంలో ప్రతి గ్రామం అంతర్భాగం అయ్యేలా చూడటమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ
సదస్సులో భాగంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రచురణలను కూడా విడుదల చేయనున్నారు. నీటి భద్రత, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, మహిళా సాధికారత, గ్రామీణ జీవనోపాధి, స్ఫూర్తిదాయకమైన విజయగాథలు వంటి విభిన్న రంగాలపై ఈ పుస్తకాలను రూపొందించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేయడం, అమలు చేయడం, పర్యవేక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకూ, గ్రామ పంచాయతీలకూ ఆచరణాత్మక మార్గదర్శకాలుగా, ఉత్తమ విజ్ఞాన వనరులుగా ఇవి ఉపయోగపడతాయి.
***
(रिलीज़ आईडी: 2278322)
आगंतुक पटल : 24