వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ నుంచి సింగపూర్కు మేలురకం బనగానపల్లె మామిడి తొలి ఎగుమతులను విజయవంతంగా పూర్తి చేసిన ఏపీఈడీఏ
प्रविष्टि तिथि:
25 JUN 2026 12:42PM by PIB Hyderabad
బనగానపల్లె మామిడి పండ్లను సింగపూర్ కు విజయవంతంగా ఎగుమతి చేశారు. లక్నోలోని ‘ఐసీఏఆర్ - కేంద్ర ఉప ఉష్ణమండల ఉద్యాన పంటల సంస్థ (సీఐఎస్హెచ్) సహకారంతో.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) బనగానపల్లె మామిడిపండ్లను భారత్ నుంచి సింగపూర్కు ఎగుమతి చేయడానికి సహకరించాయి. దేశ తాజా ఉత్పత్తుల ఎగుమతి రంగానికి ఎంతగానో ఊతమిచ్చే కీలక ముందడుగు ఇది.
ఈ సరుకులో మొత్తం 5 మెట్రిక్ టన్నుల బనగానపల్లె మామిడి పండ్లను ఎగుమతి చేశారు. ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా 2026 జూన్ 11న సరుకును ఎగుమతి చేయగా.. జూన్ 24న సింగపూర్ చేరుకుంది. దేశ ఉద్యాన ఉత్పత్తులకు తక్కువ ఖర్చుతో, సుస్థిర ఎగుమతి రవాణా సౌకర్యాలను పెంపొందించడంలో ఈ సముద్ర రవాణా కీలక మైలురాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మన మేలు రకం మామిడి పండ్ల విక్రయాల విస్తరణకు కూడా ఇదెంతో దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జీఏపీ) ధ్రువీకరణ పొందిన తోటల నుంచి ఈ మామిడి పండ్లను సేకరించారు. అనంతరం కర్ణాటకలోని ఏపీఈడీఏ గుర్తింపు పొందిన ప్యాక్హౌస్లో వీటిని ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ పూర్తిచేశారు. ఈ మొత్తం సరుకు రవాణాను సింగపూర్ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు, వృక్షాల ఆరోగ్య రక్షణ (ఫైటోశానిటరీ) నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
సరుకు సింగపూర్ చేరిన తర్వాత, అక్కడి దిగుమతిదారు ఈసీ-లింక్స్ సంస్థ పండ్ల నాణ్యత అద్భుతంగా ఉందంటూ ప్రశంసించింది. మామిడిపండ్ల రుచి, సమ పరిమాణాల్లో పండిన తీరు, ఎక్కువ రోజుల నిల్వ సామర్థ్యం, వాటి నాణ్యత బాగున్నాయని అభినందించింది. ఈ సరుకు రవాణాలో దిగుమతి నిబంధనలన్నింటినీ పాటించారు. సముద్ర రవాణా సమయంలో అవలంబించిన కోత అనంతర శాస్త్రీయ పద్ధతులు, శీతల రవాణా వ్యవస్థల సమర్థతకు ఇది నిదర్శనం.
ఈ ఎగుమతి వల్ల రైతులకు కూడా గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరింది. దేశీయ మార్కెట్లో బనగానపల్లె మామిడి ధర కిలోకు రూ. 25 నుంచి రూ. 26 వరకు పలుకుతుండగా.. ఈ ఎగుమతి సరుకు ద్వారా రైతులకు కిలోకు దాదాపు రూ. 50 వరకు ధర లభించింది. దీనివల్ల రైతులకు దక్కే ఆదాయం దాదాపు రెట్టింపైంది. ఈ ఉత్పత్తులపై వారికి అదనపు విలువ లభించింది.
తాజా పండ్ల రవాణాకు తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణ అనుకూల, వాణిజ్యపరంగా విస్తరించదగిన ప్రత్యామ్నాయంగా సముద్ర రవాణా ఎంతగానో ఉపయోగపడుతుందని ఇది స్పష్టం చేస్తోంది. పటిష్టమైన శీతల రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు, సమర్థమైన సరుకు రవాణా నిర్వహణ పద్ధతులతో... అంతర్జాతీయ మార్కెట్లో మరింత విస్తృతంగా పోటీపడేలా భారతీయ ఉద్యాన ఎగుమతులను నిలిపే సమర్థత నౌకా రవాణాకు ఉందని ఈ ఎగుమతితో నిరూపితమైంది.
దేశంలో పేరెన్నికగన్న మామిడి రకాల్లో బనగానపల్లె ఒకటి. బంగరు పసుపు వన్నెలో మెరిసిపోతూ.. ఆహ్లాదకరమైన సువాసన, నార లేని మృదువైన మామిడి గుజ్జునీ మనకిస్తుంది. ఇక మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ మామిడి రకానికి మంచి గిరాకీ ఉంది. దేశ మామిడిపండ్ల ఎగుమతుల విస్తరణలో కీలకంగా నిలవగల విశేష సామర్థ్యం బనగానపల్లె మామిడికి ఉంది.
అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తాజా పండ్లు, కూరగాయల ఎగుమతుల కోసం సముద్ర రవాణా వినియోగాన్ని పెంచడానికి ఏపీఈడీఏ నిరంతరం కృషి చేస్తోంది. మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతిదారుల సామర్థ్యాభివృద్ధి చర్యలను చురుగ్గా చేపడుతోంది. ఇప్పుడు సింగపూర్కు జరిగిన ఈ విజయవంతమైన ఎగుమతి ఉద్యాన పంటల ఎగుమతుల కోసం నౌకా మార్గాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించే దేశంగా భారత్ విశ్వసనీయతను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
వ్యవసాయ ఎగుమతులను పెంచడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, సమర్థమైన, సుస్థిర ఎగుమతి మార్గాలతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ వ్యవసాయోత్పత్తులను మరింతగా విస్తరించడం వంటి భారత ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 2278177)
आगंतुक पटल : 8