ఉక్కు మంత్రిత్వ శాఖ
డిజిటల్ పరివర్తనతో మారిన ఉక్కు రంగం ద్వారా పీఎం మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి ఊతం: హెచ్.డీ. కుమారస్వామి
డిజిటలైజేషన్ ఒక ఎంపిక కాదు.. ఉక్కు రంగం మనుగడకు అత్యవసర వ్యూహం: హెచ్.డీ. కుమారస్వామి
సామర్థ్య విస్తరణకే పరిమితం కాకుండా అత్యాధునిక ఉత్పత్తి విధానం దిశగా ఉక్కు రంగం: హెచ్.డీ. కుమారస్వామి
"భారత ఉక్కు రంగ భవిష్యత్తును నిర్ణయించనున్న డేటా, ఏఐ, అత్యాధునిక పరిశ్రమలు”: హెచ్.డీ. కుమారస్వామి
భారత ఉక్కు పరిశ్రమలో డిజిటల్ మార్పునకు దిశానిర్దేశం చేసిన చింతన్ శివిర్-2026
प्रविष्टि तिथि:
24 JUN 2026 1:32PM by PIB Hyderabad
ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని భారత ఉక్కు పరిశ్రమ నిలవాలంటే అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవటం అత్యవసరమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ. కుమార స్వామి స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదని, పరిశ్రమ దీర్ఘకాలిక మనుగడకు కీలక అంశమని అన్నారు.
ఉక్కు రంగంలో డిజిటలైజేషన్ అంశంపై న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన చింతన్ శివిర్-2026ను ఉద్దేశించి కేంద్రమంత్రి హెచ్.డీ. కుమార స్వామి మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు కేవలం ఉత్పత్తి సామర్థ్యాలపైనే కాక, అత్యాధునిక, అనుసంధానమైన, డేటా ఆధారిత ఉత్పాదక వ్యవస్థలను నిర్మించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని గుర్తుచేస్తూ.. మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం, పునరుత్పాదక ఇంధనం, పట్టణీకరణ, రవాణా, రక్షణ రంగాల ఉత్పత్తికి బలాన్నిచ్చే భారతదేశ ఆర్థిక పరివర్తనలో ఉక్కు రంగం వ్యూహాత్మక ఆధారమని హెచ్.డీ. కుమార స్వామి తెలిపారు.

"దేశ నిర్మాణానికి వెన్నెముక ఉక్కు" అని పేర్కొంటూ.. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉక్కుకు డిమాండ్ తగ్గినప్పటికీ, 2018 నుంచి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోందని వెల్లడించారు. ఈ రంగం సాధిస్తున్న బలమైన వృద్ధి పథాన్ని ప్రస్తావిస్తూ.. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ముడి ఉక్కు ఉత్పత్తి సగటున ఏడాదికి దాదాపు 8 శాతం మేర పెరిగిందన్నారు. తయారీకి సిద్ధంగా ఉన్న ఉక్కు వినియోగం ఏటా సుమారు 13 శాతం వృద్ధి చెందిందని.. ఇది దేశీయంగా బలమైన డిమాండ్ను, వేగవంతమైన పారిశ్రామికీకరణను ప్రతిబింబిస్తోందని స్పష్టం చేశారు.

భారతదేశ ఉక్కు ఉత్పాదక సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు, 2035 నాటికి 400 మిలియన్ టన్నులకు పెంచాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక సంకల్పాన్ని కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ముడిసరకు భద్రత, కార్యాచరణ సామర్థ్యం, కర్బన ఉద్గారాల తగ్గింపు, ఆధునికీకరణ, ఎగుమతి పోటీతత్వానికి సంబంధించిన సవాళ్లను పరిశ్రమ అధిగమించాల్సి ఉంటుందన్నారు. సాంకేతికతకున్న విప్లవాత్మక శక్తిని తెలియజేస్తూ.. కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ ట్విన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్ వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పాదక రంగాన్ని సరికొత్తగా మారుస్తున్నాయని, వీటిని భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
డిజిటలైజేషన్, ఆటోమేషన్ వల్ల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చని, ఇంధన వినియోగాన్ని క్రమబద్ధీకరించవచ్చని, నిర్వహణ ఖర్చులను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వీటిద్వారా యంత్రాల్లోని లోపాలను ముందుగానే గుర్తించేలా 'ముందస్తు అంచనా నిర్వహణ' వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇటువంటి సాంకేతిక మార్పుల వల్ల పనులు మధ్యలో ఆగిపోకుండా చూసుకోవచ్చని, మానవ తప్పిదాలను నివారించవచ్చని, పని ప్రదేశాల్లో భద్రతను మెరుగుపరచవచ్చని తెలిపారు.

ఈ చింతన్ శివిర్లో ఏఐ ఆధారిత మైనింగ్ సొల్యూషన్స్, స్టీల్ ప్లాంట్ల డిజిటల్ పరివర్తన, పీఎం గతి శక్తి, ఇండస్ట్రీ 4.0 అప్లికేషన్లు, వ్యాపారాలపై స్పష్టమైన సానుకూల ప్రభావాలను చూపించే కేస్ స్టడీస్పై ప్రత్యేక సెషన్లు జరిగాయి. ఉక్కు రంగంలో సాంకేతిక మార్పును వేగవంతం చేయటమే లక్ష్యంగా జరిగిన ఈ చర్చల్లో ప్రముఖ అంకుర సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు కూడా పాల్గొన్నారు. ఈ చర్చలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ వేదికపై వ్యక్తమైన ఆలోచనలు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్-2047 విజన్కు అనుగుణంగా మరింత తెలివైన, పర్యావరణహితమైన, సమర్థవంతమైన, ప్రపంచస్థాయిలో పోటీపడ గల ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయటంలో తోడ్పడతాయని కుమారస్వామి అన్నారు.

కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు సెయిల్, ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, పరిశ్రమల ప్రముఖులు, అంకుర సంస్థలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2277423)
आगंतुक पटल : 22