ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
5 లక్షలకు చేరుకున్న అవయవ దాతలు... భారత్ రికార్డు
దేశంలో అవయవ, కణ దానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ప్రజల్లో
పెరిగిన అవగాహనకూ, సామాజిక నిబద్ధతకు నిదర్శనం
प्रविष्टि तिथि:
22 JUN 2026 7:32PM by PIB Hyderabad
అవయవ దాన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భారత్ 5 లక్షలకు పైగా అవయవ దాన ప్రతిజ్ఞలను నమోదు చేసింది. ఇది ప్రాణాలను రక్షించే అవయవ, కణజాల దానం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, కరుణ, ఉమ్మడి నిబద్ధతకు అద్దం పడుతోంది.
అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్న రోగుల్లో ఆశనూ, వారికి పునర్జన్మను ప్రసాదించే ఒక గొప్ప మానవతా దృక్పథంగానూ అవయవ దానాన్ని గుర్తించడంలో ప్రజలలో పెరుగుతున్న స్పృహను ఇది స్పష్టం చేస్తోంది. స్వచ్ఛంద అవయవ, కణజాల దానాన్ని ప్రోత్సహించడంతో పాటు అవగాహనతో కూడిన భాగస్వామ్యాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో ఇది గొప్ప పురోగతిని కూడా సూచిస్తోంది.
నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, అవయవ దాన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి లభించిన అపారమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలలో అవగాహన కల్పించడంలోనూ, ప్రజల మద్దతును కూడగట్టడంలోనూ కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విద్యా సంస్థలు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాముల విలువైన సహకారాన్ని ఆయన కొనియాడారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల, పరిపాలనా యంత్రాంగాలు అందిస్తున్న నిరంతర నిబద్ధతనూ, సహకారాన్నీ, వారి ప్రయత్నాలనూ కూడా ఆయన అభినందించారు.
స్వచ్ఛంద అవగాహన పెంపొందించడం, సంస్థాగత సామర్థ్యాలను మెరుగుపరచడం అవయవ మార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా అవయవాలు, కణజాల డిమాండ్ - లభ్యత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది. దేశవ్యాప్తంగా అవయవ మార్పిడి ప్రక్రియలు నైతికంగా, సమానత్వంతో, పారదర్శకంగా, రోగి ప్రాధాన్యత ఆధారంగా సాగేలా చూడటంపైనే నిరంతరం దృష్టి సారిస్తూ ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' ప్రసంగాల ద్వారా ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన పిలుపు ఫలితంగా, ఇటీవలి సంవత్సరాలలో దేశంలో అవయవ దాన ఉద్యమానికి సరికొత్త ఉత్తేజం లభించింది. పలు సందర్భాల్లో ప్రధానమంత్రి, అవయవ దానం వల్ల కలిగే విప్లవాత్మక మార్పులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ప్రాణాలను కాపాడటం, జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సాగుతున్న ఈ విస్తృత జాతీయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ఈ గొప్ప కార్యానికి అండగా నిలవాలని ప్రజలను కోరుతూ వచ్చారు.
ఈ ప్రయత్నాన్ని మరింత సులభతరం చేస్తూ, ఆధార్ ఆధారిత అవయవ దాన ప్రతిజ్ఞ నమోదు పోర్టల్ (notto.abdm.gov.in) రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోనూ, సురక్షితంగానూ, పారదర్శకంగానూ మార్చడం ద్వారా సరళీకృతం చేసింది. ఈ వేదిక దేశవ్యాప్తంగా ప్రజలు తమ అంగీకారాన్ని సులువుగా నమోదు చేసుకునేలా వీలు కల్పించింది. ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, అవయవ దాన వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంపొందించింది.
ఈ చారిత్రాత్మక విజయం దేశంలో అవయవాలు, కణజాలాల కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చడంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ప్రభుత్వం చేపట్టిన ఉమ్మడి ప్రయత్నాల విజయానికి కూడా అద్దం పడుతోంది.
****
(रिलीज़ आईडी: 2276892)
आगंतुक पटल : 20