ఎంఐఎఫ్ఎఫ్-2026లో ఆశ, స్వీయ ఆమోదం, మానసిక ఆరోగ్య సందేశాన్ని అందించిన లఘుచిత్రం ‘గుడ్గుడి’
ముంబయిలో జరుగుతున్న 19వ ‘ఎంఐఎఫ్ఎఫ్- 2026’లో భాగంగా శుక్రవారం (2026, జూన్ 19) హిందీ లఘు చిత్రం ‘గుడ్గుడి’ ఆసియా ప్రీమియర్ జరిగింది. 21 నిమిషాల నిడివి ఉన్న ఈ హిందీ షార్ట్ ఫిక్షన్ చిత్రం ద్వారా మనీషా మఖ్వానా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా దర్శకురాలితో పాటు నిర్మాత హర్వర్ధన్ పటేల్, ప్రధాన తారాగణం అహాస్ చన్నా, హృదాంశ్ పరేఖ్, ఇతర చిత్ర బృందాన్ని ఎన్ఎఫ్డీసీ సత్కరించింది.
దర్శకురాలు మనీషా మఖ్వానా, నిర్మాత హర్ష్ పటేల్ ఈ చిత్ర ప్రదర్శనకు ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు సినిమా నిర్మాణం, ఇతివృత్తం, చలనచిత్రోత్సవంలో దాని ప్రదర్శనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చలనచిత్రం శీర్షిక గుడ్గుడికి ఉన్న ప్రాధాన్యం గురించి దర్శకురాలు మనీషా మఖ్వానా వివరించారు. ఇది ఆనందం, ఆశాభావానికి ప్రతీక అని చెప్పారు. “ఈ సినిమా ముగింపు సన్నివేశంలో తన గుండెల్లో ‘గుడ్గుడి’ కలుగుతోందని బాలుడు ఆరవ్ చెప్తాడు. ఆ భావోద్వేగమే ఈ కథా సారాంశం” అని ఆమె అన్నారు. రెడ్ కార్పెట్ వేడుక అనంతరం జరిగిన చిత్ర ప్రదర్శనలో దర్శకురాలు మనీషా మఖ్వానా మాట్లాడుతూ, “ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఆ గుడ్గుడి అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాను” అని చెప్పారు.

ఒక అమ్యూజ్మెంట్ పార్కులో మస్కట్గా పనిచేసే రీతూ అనే యువతి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చేస్తున్న వృత్తిపై ఉన్న చులకన భావం, వ్యక్తిగత బాధ్యతల భారం వల్ల ఆత్మన్యూనతా భావంతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే, ఆరవ్ అనే బాలుడితో ఏర్పడిన పరిచయం ద్వారా ఆమె తన జీవితాన్ని, వృత్తిని సరికొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తుంది. తన నిజమైన భావోద్వేగాలను, అంతర్గత సంఘర్షణలను బయటి ప్రపంచానికి కనపడకుండా దాచుకోవడానికి ఆ మస్కట్ దుస్తులు రీతూకు ఒక ముసుగులాగా పనిచేస్తాయని దర్శకురాలు వివరించారు.
గుడ్గుడిలో ప్రధాన పాత్ర అయిన రీతూ కథ కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది మధ్యతరగతికి చెందిన ప్రతి బిడ్డ కథ. మస్కట్ దుస్తుల వెనుక ఉన్న ఆమె అసలు రూపాన్ని గుర్తించే ఆరవ్ అనే చిన్నారితో ఏర్పడే నిశ్శబ్ద బంధం ఈ సినిమాకు ప్రాణాధారంగా నిలుస్తుంది. ఇది ఆమెలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా తిరిగి తీసుకువస్తుంది. రీతూలో తగ్గుతున్న ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించడానికి హై-యాంగిల్ షాట్స్, ఆమె అంతర్గత సంఘర్షణను చూపించడానికి గందరగోళంగా ఉండే సన్నివేశాలను ఉపయోగించడంలో దర్శకురాలి ప్రతిభ కనిపిస్తుంది. సాధారణంగా మౌనంగా ఉండే మస్కట్ పాత్ర కేవలం వాయిస్ ఓవర్ ద్వారానే మాట్లాడటం.. ఆమె బాహ్య రూపానికి, అంతర్గత బలహీనతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హృద్యంగా చూపిస్తుంది. చివరిగా తనను గుర్తించిన ఆరవ్ ముందే రీతూ తన మస్కట్ను తొలగిస్తుంది. ఆనందం, ఆశకు ప్రతీకగా నిలిచే తమదైన 'గుడ్గుడి'ని వెతుక్కునేలా చేస్తూ.. ఈ సినిమాను ముగించారు. సినిమా చివర్లో నిజ జీవితంలో మస్కట్లుగా పనిచేస్తున్నవారి శ్రమను అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఒక విలక్షణమైన కథాంశంగా గుడ్గుడిని దర్శకురాలు వర్ణించారు. తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల ఆధారంగా ఈ కథను రూపొందించినట్లు తెలిపారు. “సమయం వచ్చినప్పుడు మనసులోని భావోద్వేగాల భారాన్ని పక్కన పెట్టడం తప్పుకాదని రీతూ, ఆరవ్ల ప్రయాణం తెలియజేస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక కొత్త ఆశను నింపడమే కాకుండా, నచ్చిన వారితో మనసులోని భావాలను పంచుకునేలా ప్రోత్సహిస్తుంది” అని ఆమె అన్నారు. దర్శకురాలి వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టిన ఈ చిత్రంలోని సంభాషణల్లో గుజరాతీ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సినిమాకు మరింత సహజత్వాన్ని జోడించింది.
ఈ చిత్ర షూటింగ్ అహ్మదాబాద్లోని బాల వాటిక పార్కులో జరిగింది. చిత్రీకరణ సమయంలో అనుకోకుండా రికార్డు చేసిన, అప్పటికప్పుడు మెరుగుపరిచిన సన్నివేశాలను కూడా దీనిలో చేర్చారు. చివరిలో రీతూ తన జీవితాన్ని అంగీకరించి స్వేచ్ఛానుభూతిని పొందే సన్నివేశమే సినిమాలో అత్యంత శక్తిమంతమైనదని దర్శకురాలు వివరించారు.
సినిమా అందించే ప్రధాన సందేశాన్ని నిర్మాత హర్ష్ పటేల్ వివరించారు. ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. “ప్రజలు తాము నమ్మే స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తమ మనసులోని విషయాలను పంచుకోవాలి. నిజాయితీతో కూడిన సంభాషణలతోనే మానసిక ప్రశాంతత మొదలవుతుంది” అని ఆయన అన్నారు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రకు నటి అహాస్ చన్నాను ఎంపిక చేయడం గురించి దర్శకురాలు మనీషా మఖ్వానా వివరించారు. ఆమెను దృష్టిలో ఉంచుకునే ఈ కథను రాసినట్లు తెలిపారు. “సెలబ్రిటీ హోదాను చూపించే నటి కాదు ఎహ్సాస్. సాధారణంగా నటీనటులు తెరపై తమ ముఖాన్ని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడతారు. కానీ ఈ సినిమాలో చాలా సమయం ఆమె ముఖం మస్కట్ వెనుకే దాగి ఉంటుంది. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తుంది. ఆమెకు తన నటనపై ఉన్న నమ్మకమే ఈ విలక్షణమైన పాత్రను ఎంచుకునేలా చేసింది” అని ఆమె అన్నారు.
బాల నటుడు హృదాంశ్ ఎంపిక గురించి కూడా దర్శకురాలు మాట్లాడారు. హృదాంశ్ గతంలో చేసిన ప్రాజెక్టులో అతడి నటన నచ్చడంతో కాస్టింగ్ డైరెక్టర్ ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ జీవితాలను సమతౌల్యం చేయడంలో ఎదురవుతున్న ఒత్తిళ్ల కారణంగానే ప్రస్తుతం మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని దర్శకురాలు మనీషా మఖ్వానా అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరిలో ఆత్మపరిశీలననూ, ఆత్మవిశ్వాసాన్నీ, మనసులోని భావాలను స్వేచ్ఛగా పంచుకునే తత్వాన్నీ పెంపొందించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
గతంలో స్త్రీ, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పనిచేసినట్లు దర్శకురాలు తెలియజేశారు. ప్రముఖ దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే (రాజ్ అండ్ డీకే) ఈ పరిశ్రమలో తనకు మార్గదర్శకులని తెలియజేశారు.

గుడ్గుడి లఘుచిత్రం పోస్టర్
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సైతం గుడ్గుడి చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఎమ్ఐఎఫ్ఎఫ్-2026తో పాటు ప్రతిష్ఠాత్మక కేన్స్ చలనచిత్రోత్సవంలో షార్ట్ ఫిల్మ్ కార్నర్లో కూడా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. కథనంలో ప్రామాణికతకున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ‘‘నిజాయితీతో కూడిన కథలకు వాటి స్థానం వాటికే లభిస్తుంది’’ అని మఖ్వానా పేర్కొన్నారు.
థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని నిర్మాత హర్ష్ పటేల్ తెలిపారు. దీనికోసం మూడు నుంచి నాలుగు లఘు చిత్రాలను కలిపి ఒక ప్యాకేజీలా థియేటర్లలో ప్రదర్శించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని మరిన్ని చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తామని నిర్మాత, దర్శకురాలు వెల్లడించారు.
***
रिलीज़ आईडी:
2275780
| Visitor Counter:
4