రైల్వే మంత్రిత్వ శాఖ
గుజరాత్లో రూ. 493 కోట్లతో ఆదిపూర్-భుజ్ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం
కచ్ ప్రాంతంలో రైల్వే సామర్థ్యం పెంపు, అనుసంధానం మరింత బలోపేతం
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ రెండు వైపులా అదనంగా రెండు ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు అవకాశం
డబుల్ లైన్ ద్వారా అదనంగా 12 ఎంటీపీఏ సరుకు రవాణాకు మార్గం సుగుమం
రవాణా రంగం, పారిశ్రామిక అనుసంధానానికి భారీ ఊతం..
प्रविष्टि तिथि:
17 JUN 2026 2:30PM by PIB Hyderabad
గుజరాత్లో రైల్వే మౌలిక సదుపాయాల వృద్ధికి, రవాణా సామర్థ్య పెంపునకు భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ రైల్వే పరిధిలోని 49 కిలోమీటర్ల పొడవైన ఆదిపూర్-భుజ్ రైల్వే సెక్షన్ను రూ. 493 కోట్ల వ్యయంతో డబ్లింగ్ (రెండు లైన్లుగా మార్చడం) చేయడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
రైల్వే లైన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, నెట్వర్క్ విస్తరణ ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే నిరంతరం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన ఈ రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తి కావడం ద్వారా కచ్ ప్రాంతంలో రైలు రవాణా మరింత బలోపేతం కానుంది. భవిష్యత్తులో ఈ మార్గంలో పెరగనున్న ప్రయాణికుల, సరుకు రవాణా రద్దీకి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్ కారిడార్లో సామర్థ్య పెంపు
గాంధీధామ్- నలియా కారిడార్లో ప్రస్తుతం ఒకే ఒక ట్రాక్ మార్గంగా ఉన్న ఈ ఆదిపూర్-భుజ్ సెక్షన్లో ఇప్పటికే పలు రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. వీటిలో భుజ్-నలియా గేజ్ మార్పిడి పనులు, నలియా-వాయోర్ లైన్ పొడిగింపు, నలియా-జఖౌ, వాయోర్-లఖ్పత్, దేశాల్పర్- లూనా ప్రాంతాలను కలుపుతూ నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్లు ఉన్నాయి. వీటి కారణంగా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి కానుండటంతో ఆ మార్గం ద్వారా అదనపు ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీకి తగిన సామర్థ్యాన్ని కల్పించడానికి, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి, భవిష్యత్తు రవాణా డిమాండును తట్టుకోవడానికి వీలుగా ఈ డబ్లింగ్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతతో ఆమోదం లభించింది.
మెరుగైన ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల నిర్వహణ:
ఈ డబ్లింగ్ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ప్రయాణికులకు, సరుకు రవాణా రంగానికి ఎంతో మేలు జరగనుంది. ఈ మార్గంలో ప్రతిరోజూ రెండు వైపులా కలిపి అదనంగా 4 ప్రయాణికుల రైళ్లను నడపడానికి వీలవుతుంది. ఇది ఈ ప్రాంతంలోని ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని, రవాణాను మరింత మెరుగుపరుస్తుంది.
ఈ డబుల్ లైన్ ద్వారా ప్రతి సంవత్సరం అదనంగా 12 మిలియన్ టన్నులకు రవాణా సాధ్యమవుతుంది. ఇది పశ్చిమ గుజరాత్లో రవాణా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పారిశ్రామిక అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
భవిష్యత్తు వృద్ధి, నిర్వహణకు ఊతం
ఈ రైల్వే సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం రాబోయే 2029-30 నాటికి ఏకంగా 123 శాతానికి పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. ఇది సకాలంలో సామర్థ్యాన్ని పెంచడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. ప్రస్తుతం చేపట్టబోయే డబ్లింగ్ పనులు ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే రైళ్ల నిర్వహణలో ఉన్న అడ్డంకులను తొలగించి, రైళ్లు మరింత ఖచ్చితత్వంతో, నమ్మకంగా నడవడానికి దోహదపడతాయి. ప్రయాణికులు, సరుకు రవాణా పెరగడం ద్వారా భారతీయ రైల్వేకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, కచ్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులను సృష్టించడం, రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడం కోసం భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోందని మరోసారి నిరూపితమైంది.
***
(रिलीज़ आईडी: 2274084)
आगंतुक पटल : 8