ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
16 JUN 2026 10:36PM by PIB Hyderabad
ఫ్రాన్స్లోని ఎవియాన్లో జూన్ 16, 2026న జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
భారత్- కెనడా సంబంధాల్లోని సానుకూల పురోగతిని ఇరుదేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. మార్చి 2026లో కెనడా ప్రధానమంత్రి కార్నీ భారత్లో పర్యటించినప్పటి నుంచి సాధించిన పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
భారత్, కెనడా ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పరం తోడ్పడే అంశాలపై అగ్రనేతలు చర్చించారు. భవిష్యత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు నిబద్ధతను తెలియజేశారు. అంతర్జాతీయంగా ఇంధన, ఆహార భద్రత బలోపేతానికి స్థిరమైన, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
ఎల్ఎన్జీ, ఎల్పీజీ, మెటలర్జికల్ కోల్కు సంబంధించి వాణిజ్య ఒప్పందాల పురోగతితో సహా ద్వైపాక్షిక ఆర్థిక సహకారంలో సాధించిన ప్రగతిని నేతలు సమీక్షించారు.
ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి పర్యటనల నేపథ్యంలో కొనసాగుతున్న సానుకూల వేగాన్ని ప్రధానమంత్రులు స్వాగతించారు. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇటీవల కెనడాలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావించారు. 2026 చివర్లో అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి నేతృత్వంలో కెనడా వాణిజ్య బృందం భారత్లో పర్యటించనుండటంపై ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.
సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై జరుగుతున్న చర్చల పురోగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన ఇరుపక్షాలు.. 2026 నాటికి ఈ చర్చలను ముగించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని స్పష్టం చేశాయి.
ఇటీవల జరిగిన ఉమ్మడి శాస్త్ర, సాంకేతిక కమిటీ సమావేశం, దౌత్యపరమైన చర్చలతో సహా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సంస్థాగత భాగస్వామ్యం బలోపేతం కావటం పట్ల ప్రధానమంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. రక్షణ, ఆర్థిక, వలసల రంగాల్లో జరగనున్న చర్చల కోసం ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు.
రక్షణ, భద్రతా రంగాల్లో సహకార బలోపేతానికి, జనరల్ సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ (జీఎస్ఓఐఏ)పై చర్చలు ప్రారంభించటానికి ప్రధానమంత్రులు అంగీకరించారు. భారతదేశ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ బృందం కెనడాలో పర్యటించటంతో పాటు రక్షణ సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని స్వాగతించారు.
కెనడా-భారత్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ ద్వారా ఇరుదేశాల మధ్య నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల్లో భాగస్వామ్యం, విద్యాపరమైన సహకారాన్ని బలోపేతం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలపై నేతలు చర్చించారు.
హిందూ మహాసముద్ర తీర దేశాల కూటమి (ఐఓఆర్ఏ)లో చర్చల భాగస్వామిగా కెనడాను చేర్చుకునేందుకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
చర్చలు, ఆదానప్రదానాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయటానికి వేదికగా రైసినా అమెరికాస్ ను ఏర్పాటు చేయనున్నట్లు నేతలు ప్రకటించారు.
2026లో కెనడా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి కార్నీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనకు ఇరుపక్షాలకూ వీలైన తేదీని ఖరారు చేసేందుకు దౌత్యపరంగా నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని ఇరుపక్షాలూ అంగీకరించాయి.
***
(रिलीज़ आईडी: 2273941)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Kannada
,
Malayalam