నీతి ఆయోగ్
స్కూల్ ఇన్నోవేషన్ ల్యాబుల ద్వారా ద్వైపాక్షిక ఆవిష్కరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ
అటల్ ఇన్నోవేషన్ మిషన్, లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ చేపట్టిన ఆవిష్కరణాత్మ కార్యక్రమం...
ఉమ్మడి ఆవిష్కరణల వ్యవస్థ ద్వారా భారత్, ఫ్రాన్స్లోని యువ ఆవిష్కర్తల అనుసంధానంలో కీలకం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ప్రారంభించిన భారత్ ఇన్నోవేట్స్ - 2026 నేపథ్యంలో... ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై పూర్తయిన సంతకాలు
प्रविष्टि तिथि:
14 JUN 2026 8:12PM by PIB Hyderabad
ఫ్రాన్స్/ఢిల్లీ: భారత్, ఫ్రాన్స్ మధ్య ఆవిష్కరణల ఆధారిత సహకారాన్ని బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఉమ్మడి సంకల్పంతో... రెండు దేశాలూ కలసి ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశాయి. రెండు దేశాల్లోని యువ ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేలా నీతి ఆయోగ్లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి.
భారతదేశంలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) విధానం అందించిన స్ఫూర్తితో ఫ్రాన్స్లో మొట్టమొదటి పాఠశాల ఆవిష్కరణ ప్రయోగశాలను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. రెండు దేశాల విద్యార్థుల మధ్య సహకారానికీ, ఆవిష్కరణ వ్యవస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికీ, ద్వైపాక్షిక ఆవిష్కరణ సహకారాన్ని బలోపేతం పెంపొందించడానికీ నిర్మాణాత్మక వేదికను రూపొందిస్తుంది.
ఈ సహకారాన్ని అధికారికం చేసే ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (ఎల్ఓఐ) నీతి ఆయోగ్లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా, లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ పియర్ అలాస్ ఈ రోజు ఫ్రాన్స్లో పరస్పరం మార్చుకున్నారు.
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సరిహద్దులకు అతీతంగా ఆవిష్కరణ కార్యక్రమాలనూ, వ్యాపార ఆలోచనలనూ ఇచ్చిపుచ్చుకోవడాన్ని పెంపొందించే వేదికగా ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ పనిచేస్తుంది. అలాగే రెండు దేశాల ఆవిష్కరణ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. జ్ఞాన వినిమయం, సామర్థ్య నిర్మాణం, ఉమ్మడి ఆవిష్కరణ కార్యకలాపాల ద్వారా వాస్తవ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను సంయుక్తంగా ఆవిష్కరించే వీలును యువ ఆవిష్కర్తలకు ఏటీఎల్ బ్రిడ్జ్ అందిస్తుంది. అలాగే ప్రాథమిక స్థాయిలో ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందిస్తుంది. యువ ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, ఈ రంగానికి చెందిన నిపుణుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా.. శక్తిమంతమైన ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం, భారత్-ఫ్రాన్స్ మధ్య పరస్పరం ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026లో భాగంగా ఈ ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య ఆవిష్కరణల ఆధారిత సహకారాన్ని బలోపేతం చేయడం, భవిష్యత్తు అవసరాలకు సిద్ధమైన ప్రతిభను ప్రోత్సహిండమనే ఉమ్మడి లక్ష్యాలను ఇది ప్రతిబింబిస్తుంది. రెండు దేశాల మధ్య పాఠశాల స్థాయి ఆవిష్కరణల్లో అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించే దిశగా వేసిన ముందడుగును ఈ కార్యక్రమం సూచిస్తుంది. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆవిష్కరణ వ్యవస్థల మధ్య అర్థవంతమైన చర్చలను ప్రోత్సహిస్తుంది.
వసుధైవ కుటుంబం- ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భారతీయ నాగరికతా సూత్రం ఆధారంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. జ్ఞానాన్నీ, ఆవిష్కరణలనూ, ప్రగతినీ పంచుకున్నప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందనే విశ్వాసాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. అటల్ టింకరింగ్ ల్యాబు (ఏటీఎల్) విధానాన్ని, ఆవిష్కరణల శైలిని పంచుకోవడం ద్వారా విజయవంతమైన నమూనాను విస్తరించడం మాత్రమే కాకుండా భాగస్వామ్యం, స్నేహం, సమష్టి వృద్ధి సాధించాలనే స్ఫూర్తిని కూడా భారతదేశం చాటి చెబుతోంది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికున్న ప్రాధాన్యాన్ని నీతి ఆయోగ్లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం), మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా వివరించారు. ‘‘భారతదేశ ఆవిష్కరణల ప్రయాణంపై ప్రపంచానికి ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో.. దేశీయంగా ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే నమూనాలను, పరిష్కారాలను అందించే స్థాయికి భారత్ ఎదిగింది. మనం వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా ముందుకు వెళుతున్నాం. ఈ తరుణంలో.. ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జ్ లాంటి కార్యక్రమాలు ఆవిష్కరణలనూ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాన్నీ, అంతర్జాతీయ సహకారాన్నీ పెంపొందించడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి. భారతదేశంలోని అటల్ టింకరింగ్ ల్యాబు వ్యవస్థతో అనుసంధానిస్తూ ఫ్రాన్స్లో స్కూల్ ఇన్నోవేషన్ ల్యాబును ఏర్పాటు చేయడం అంటే.. నేర్చుకోవడానికి కొత్త ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. ప్రాంతంతో సంబంధం లేకుండా యువతరం అందరికీ ఆవిష్కరించే, సృష్టించే, నాయకత్వం వహించే అవకాశం దక్కాలనే ఒక గొప్ప ఆలోచనను పంచుకోవడం’’ అని తెలియజేశారు.
లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ పియర్ ఆలస్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే శక్తిమంతమైన సాధనమే విద్య. అన్వేషణ, ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా సైన్సు, టెక్నాలజీని నేర్చుకొనేలా, పరిశోధించేలా యువతలో స్ఫూర్తి నింపడం అవసరం. చిన్న వయసు నుంచే సృజనాత్మకత, ప్రయోగాలు, ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించే ప్రత్యేక కార్యక్రమమే అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్. ఆవిష్కరణాత్మక ఆలోచనా ధోరణిని ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి గత ఏడేళ్లుగా భారత్, ఫ్రాన్స్లో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా యువతను, ఉమ్మడి ఆవిష్కరణ భవిష్యత్తును తీర్చిదిద్దేలా రెండు దేశాల మధ్య భాగస్వామ్యంలో వేసిన సరికొత్త ముందడుగు ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని ఆమె అన్నారు.
దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక సంస్కృతిని పెంపొందించడానికి, వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు తోడ్పడాలనే సంకల్పంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)ను ప్రారంభించారు. ఇది ప్రారంభమైన నాటి నుంచి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమల్లో ఆవిష్కరణల వ్యవస్థలను సిద్ధం చేసి, ప్రోత్సహించే ప్రతిష్ఠాత్మక జాతీయ కార్యక్రమంగా ఆవిర్భవించింది. ఏఐఎం కింద ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు.. సృజనాత్మకత, సమస్యల పరిష్కారం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, వ్యాపార నైపుణ్యాల్లో లక్షలాది విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల ఆధారిత ఆవిష్కరణల వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగాయి.
గడచిన దశాబ్దంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణ వ్యవస్థల్లో ఒకదానిని భారత్ నిర్మించింది. ఈ పరివర్తనను సాధ్యం చేసిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం). నీతి ఆయోగ్ చేపట్టిన ఈ కార్యక్రమం.. తరగతి గది నుంచి అంకుర సంస్థలు, పరిశ్రమల వరకు ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది.
2016 నుంచి ఇప్పటి వరకూ భారత దేశంలో 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 11 మిలియన్ల మందికి పైగా విద్యార్థులకు డిజైన్ థింకింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, 3డీ డిజైన్ అండ్ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర నూతన టెక్నాలజీలను నేర్చుకొనే అవకాశం లభించింది. ఆసక్తితోనే ఆవిష్కరణ మొదలవుతుందనీ ఏటీఎల్ కార్యక్రమం తెలియజెప్పింది. అలాగే పరిశోధనకు, సృజనకు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వాతావరణం కల్పించినప్పుడు యువ మేధ వికసిస్తుందని కూడా తెలియజేస్తోంది.
‘‘యువత చేసిన ఆవిష్కరణలు, కృషిపైనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ఈ దార్శనికతకు ఇండియా-ఫ్రాన్స్ ఏటీఎల్ బ్రిడ్జి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే మరింత ఆవిష్కరణాత్మకమైన, సుభిక్షమైన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్నేహానికీ, సహకారానికీ, యువ ఆవిష్కర్తలు, విద్యార్థి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తిపై ఉన్న ఉమ్మడి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.
***
(रिलीज़ आईडी: 2273218)
आगंतुक पटल : 12