శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రాబోయే దశాబ్దంలో 45 బిలియన్ డాలర్లకు చేరనున్న భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ
వృద్ధి తదుపరి దశను నడిపిస్తున్న 400లకు పైగా అంతరిక్ష రంగ అంకురసంస్థలు
విజ్ఞానశాస్త్రానికి, సమాజానికి మధ్య పెరుగుతున్న అనుబంధం... ఇటీవలి సంవత్సరాల్లో సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఒకటి
భారత శాస్త్రీయ ప్రగతిలో పెరుగుతున్న పౌరుల భాగస్వామ్యం
పరిపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కోసం అంతరిక్ష సాంకేతికతను వినియోగించుకుంటున్న భారత్
దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష దేశాల్లో ఒకటిగా నిలబెట్టిన చంద్రయాన్-3 వంటి మిషన్లు
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో అంతరిక్ష సాంకేతికతను భారత్ ఉపయోగిస్తున్న తీరును స్పష్టం చేస్తున్న పీఎం గతి శక్తి, అమృత్ పట్టణాభివృద్ధి కార్యక్రమాలు
వికసిత్ భారత్-2047 దిశగా దేశ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్న భారత ఆవిష్కరణల వ్యవస్థ
భారత భవిష్యత్ వృద్ధికి మూలస్తంభాలుగా ఆవిర్భవిస్తున్న సైన్స్, అంకురసంస్థలు, అంతరిక్ష సాంకేతికత: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
14 JUN 2026 4:29PM by PIB Hyderabad
విధాన సంస్కరణలు, పెరుగుతున్న ప్రైవేట్ భాగస్వామ్యం, వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థ కారణంగా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న 8-9 బిలియన్ డాలర్ల నుంచి రాబోయే దశాబ్దంలో దాదాపు 40-45 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, అణుశక్తి, అంతరిక్ష, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పెద్ద మార్పును ప్రతిబింబిస్తోందనీ, ఈ మార్పుతో శాస్త్ర-సాంకేతికతలు ప్రయోగశాలల పరిధిని దాటి జాతీయ చైతన్యంలో భాగమయ్యాయని అన్నారు. సైన్స్, సమాజం మధ్య పెరుగుతున్న అనుబంధం ఇటీవలి సంవత్సరాల్లో సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. భారత శాస్త్రీయ పురోగతిలో పౌరుల భాగస్వామ్యం పెరుగుతోందనీ డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
"సామాన్య పౌరులూ ప్రస్తుతం భారత శాస్త్రీయ పురోగతితో మమేకవడం... దానిలో తమకూ భాగస్వామ్యం ఉందని భావించడం అతిపెద్ద విజయం" అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్త్రసాంకేతిక రంగానికి ప్రజల్లో ప్రాచుర్యం పెరుగుతోందని, ప్రధానమంత్రి దార్శనికతకు ఇది నిదర్శనమనీ, స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాల ద్వారా ఈ రంగంలో తీసుకున్న కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించడం అందుకు కారణమని ఆయన అన్నారు.
స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, డిజిటల్ హెల్త్, డీప్ ఓషన్ మిషన్, గగన్యాన్ వంటి కార్యక్రమాలు భారత అభివృద్ధి ప్రయాణంలో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలను కేంద్ర స్థానంలో నిలపడంలో ఎంతగానో సహాయపడ్డాయని ఆయన తెలిపారు. శాస్త్ర-సాంకేతిక కార్యక్రమాల్లో ప్రధాన మీడియా ఉనికి పెరగడం... శాస్త్రీయ పరిణామాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందనడానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చంద్రయాన్-3 వంటి మిషన్లు అంతరిక్ష శాస్త్రాన్ని విస్తృత ప్రజా ప్రయోజన అంశంగా మార్చాయనీ... దేశవ్యాప్తంగా పౌరుల్లో అపూర్వమైన అవగాహననూ, భాగస్వామ్యాన్నీ సృష్టించాయని ఆయన అన్నారు.
అంతరిక్షం, అణుశక్తి, అధునాతన సాంకేతికతల వంటి కీలక రంగాల్లో పెరుగుతున్న భారత్ సామర్థ్యాలు దేశ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేశాయని కేంద్ర మంత్రి అన్నారు. ఈ విజయాల ద్వారా ఏర్పడిన విశ్వాసం స్వదేశీ సాంకేతికతల విశ్వసనీయతను పెంచిందనీ, విశ్వసనీయ సాంకేతిక భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసిందని ఆయన అన్నారు.
అధునాతన సాంకేతికతలు వ్యూహాత్మక, ఆర్థిక ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అభివృద్ధి చెందుతున్న రంగాల్లోనూ రాణించగల భారత్ సామర్థ్యాన్ని ఇటీవలి సాంకేతిక విజయాలే నిరూపించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ సాంకేతికతలు, ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దేశ శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాల బలాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన జోడించారు.
అంతరిక్ష రంగంలో సంస్కరణల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ... కొన్ని సంవత్సరాల కిందట దేశంలో అంతరిక్ష రంగ అంకురసంస్థలు కొన్ని మాత్రమే ఉండేవనీ, ప్రస్తుతం 400లకు పైగా అంకురసంస్థలు క్రియాశీలంగా, వేగంగా విస్తరిస్తున్న ఈ వ్యవస్థకు తోడ్పాటునందిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. సాపేక్షంగా తక్కువ కాలంలో సాధించిన ఈ వృద్ధి స్థాయి... భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అపార సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.
చంద్రయాన్-3, రాబోయే గగన్యాన్ కార్యక్రమం వంటి మిషన్లలో భారత్ సాధించిన విజయాలు... దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష దేశాల సరసన నిలబెట్టాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. సంక్లిష్టమైన మిషన్లను సమర్థత, ఆవిష్కణలు, తక్కువ ఖర్చుతో అమలు చేయగల తన సామర్థ్యాన్ని భారత్ ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉందని ఆయన తెలిపారు.
పరిపాలన, అభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించడమే భారత్ విశిష్ట బలాల్లో ఒకటని కేంద్ర మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల ప్రణాళిక, ప్రాజెక్టుల పర్యవేక్షణ, ప్రజా సేవల పంపిణీలో అంతరిక్ష ఆధారిత అనువర్తనాలను దేశం విజయవంతంగా అనుసంధానించిందనీ, ఈ స్థాయిలో అనుసంధానం అరుదుగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
పీఎం గతి శక్తి, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి కార్యక్రమాలు... అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను మెరుగుపరచడంలో... పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంపొందించడంలో అంతరిక్ష సాంకేతికత ఎలా సహాయపడుతుందో తెలియజేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రతి ప్రధాన అంతరిక్ష కార్యక్రమం నిరంతర అభ్యసనం, అభివృద్ధి ద్వారానే పరిణామం చెందుతుందని కేంద్ర మంత్రి అన్నారు. మిషన్ల సమయంలో ఎదురయ్యే సవాళ్లు సమర్థమైన వ్యవస్థలకు, మెరుగైన సంసిద్ధతకు, భవిష్యత్తులో మరింత పటిష్ఠమైన మిషన్లకూ దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
అంతరిక్ష యాత్రల్లో ఎదురయ్యే తాత్కాలిక సవాళ్లను శాస్త్రీయ పురోగతి, సాంకేతిక పరిణామాల విస్తృత నేపథ్యంలో చూడాలని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ శాస్త్రీయ, సాంకేతిక సామర్థ్యాలకు ఉదాహరణలుగా... చంద్రయాన్, మార్స్ మిషన్లు తొలి ప్రయత్నంలోనే సాధించిన విజయాలను ఉటంకించారు. అగ్రగామి అంతరిక్ష దేశాలతో పోలిస్తే భారత్ రికార్డు మొత్తంగా మెరుగ్గానే ఉందని ఆయన తెలిపారు.
ఇటీవలి పీఎస్ఎల్వీ మిషన్లో తలెత్తిన లోపంపై విశ్లేషణ పూర్తయిందనీ, దాని మూలకారణాలనూ గుర్తించామని కేంద్ర మంత్రి తెలిపారు. దిద్దుబాటు చర్యలు ఇప్పటికే ప్రారంభించామనీ, ఈ అనుభవాల ఆధారంగా భవిష్యత్ మిషన్లు ప్రయోజనం పొందుతాయన్నారు. తద్వారా భారత అంతరిక్ష కార్యక్రమం మరింత బలోపేతమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భారత శాస్త్రీయ విజయాలు ఆర్థిక వృద్ధికి, సాంకేతిక స్వయం-సమృద్ధికి, ప్రపంచంతో పోటీపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంకురసంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల భాగస్వామ్యం... వికసిత్ భారత్-2047 దార్శనికతను ముందుకు నడిపించగల బలమైన ఆవిష్కరణల వ్యవస్థను సృష్టిస్తోందని ఆయన తెలిపారు.
“వికసిత్ భారత్-2047 కోసం ఆవిష్కరణలు, ఔత్సాహిక పరిశ్రమల ఆధారిత వృద్ధి” అనే ఇతివృత్తంతో నిర్వహించిన రైజ్ కాన్క్లేవ్-2026 సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆవిష్కరణల వ్యవస్థ అంతటా సహకారాన్ని బలోపేతం చేయడం... శాస్త్రీయ పరిశోధనను సామాజిక, ఆర్థిక ఫలితాలుగా మార్చడాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సదస్సు... పరిశోధకులు, అంకురసంస్థలు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చింది. ఈ కార్యక్రమంలో 125కు పైగా అంకురసంస్థలు, సాంకేతిక ఆవిష్కర్తలు పాల్గొని... ఏరోస్పేస్ సాంకేతికతలు, కృత్రిమ మేధ, డీప్-టెక్, వ్యవసాయ సంబంధిత ఆహార ఆవిష్కరణల రంగాల్లో పరిష్కారాలను సూచిస్తూ రూపొందించిన అంశాలను ప్రదర్శించారు. పరిశోధన-పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంపై వారు ప్రధానంగా చర్చించారు.
***
(रिलीज़ आईडी: 2272785)
आगंतुक पटल : 44