ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ)కు పదేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా
పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రూ. 75 స్మారక నాణెం, రూ. 5 పోస్టల్ స్టాంపును విడుదల చేసిన శ్రీ జె.పి.నడ్డా
ప్రపంచ సగటును అధిగమిస్తూ మాతృత్వ మరణాల రేటులో 86% తగ్గుదలను సాధించిన భారత్: శ్రీ జె.పి.నడ్డా
90.6%కి పెరిగిన ఆసుపత్రి ప్రసవాలు; ప్రసవానికి ముందు సంరక్షణ కవరేజ్ 95.9%కి చేరిక: కేంద్ర ఆరోగ్య మంత్రి
प्रविष्टि तिथि:
09 JUN 2026 6:23PM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం - ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) - దేశవ్యాప్తంగా సురక్షిత మాతృత్వాన్ని నిర్ధారించే దిశగా అంకితభావంతో సేవలందిస్తూ ఈ రోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
సురక్షిత గర్భధారణ, ఆరోగ్యకరమైన మాతృత్వాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) దశాబ్దం పూర్తిచేసుకున్న ఈ ముఖ్యమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ జె.పి. నడ్డా నేడు “పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు - ఒక దశాబ్దపు సంరక్షణ” అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ జె.పి. నడ్డా ప్రసంగిస్తూ, ఈ ఘనత దేశం మొత్తానికి ఎంతో గర్వకారణమని, సంతృప్తినిచ్చే విషయమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎమ్ఏ విజయవంతంగా అమలు కావడం దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వాన్ని, ఆరోగ్యకరమైన శిశువులను అందించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన కట్టుబాటును ప్రతిబింబిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాల కాలంలో పీఎంఎస్ఎమ్ఏ దేశవ్యాప్తంగా మాతాశిశు సంరక్షణ సేవలను బలోపేతం చేయడమే కాకుండా, మరింత ఆరోగ్యకరమైన, దృఢమైన భారతదేశ నిర్మాణానికి గట్టి పునాది వేసిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడటం ఒక ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడానికి, స్వాస్త్య భారత్ సంకల్పాన్ని సాధించడానికి అత్యంత ప్రాథమికమైనదని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం ఆవిర్భావాన్ని గుర్తు చేస్తూ, ప్రతి నెలా 9వ తేదీన గర్భవతులకు నిపుణులైన వైద్యుల ద్వారా ఉచిత, సమగ్ర, నాణ్యమైన ప్రసవ ముందస్తు సంరక్షణ సేవలను అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 జూన్ 9న పీఎంఎస్ఎమ్ఏను ప్రారంభించారని శ్రీ నడ్డా పేర్కొన్నారు. పీఎంఎస్ఎమ్ఏ కింద ప్రభుత్వంతో స్వచ్ఛందంగా చేతులు కలిపిన ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య నిపుణుల అమూల్యమైన సహకారాన్ని ఆయన కొనియాడారు. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాలలో గర్భవతులకు నిపుణులైన వైద్యుల సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో వీరి భాగస్వామ్యం ఎంతో దోహదపడిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సురక్షితమైన ప్రసవ ఫలితాలను సాధించడంలో ముందస్తు సంరక్షణ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ వ్యవస్థ కింద, గర్భవతులు క్రమం తప్పకుండా ప్రసవ పూర్వ పరీక్షలు పొందుతున్నారని, ఇందులో భాగంగానే పీఎంఎస్ఎమ్ఏ కింద నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంతవరకు గర్భవతులను గుర్తించడంలోనూ, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలోనూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలోనూ ఆశా కార్యకర్తలు పోషిస్తున్న కీలక పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.
జనవరి 2022లో ఈ పథకం విస్తరణ (ఈ-పీఎంఎస్ఎమ్ఏ) వ్యూహాన్ని ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ, గర్భధారణ సమయంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన మహిళలను మరింత నిశితంగా పర్యవేక్షించడానికీ, తదుపరి జాగ్రత్తలు తీసుకోవడానికీ ఈ చొరవను తీసుకొచ్చినట్లు శ్రీ నడ్డా తెలిపారు. ఈ-పీఎంఎస్ఎమ్ఏ కింద, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భవతులను ప్రత్యేకంగా జాబితా చేసి ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా చూసేందుకు ప్రసవం జరిగిన తర్వాత కూడా 45 రోజుల వరకు వీరి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు. ఎస్ఎమ్ఎస్ ద్వారా అలర్ట్లు, ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తల మెరుగైన మద్దతు ఈ సంరక్షణ ప్రక్రియ నిరంతరాయంగా సాగడానికి మరింత బలాన్ని చేకూర్చాయని ఆయన తెలిపారు. కమ్యూనిటీ స్థాయిలో గర్భవతులను చేరుకోవడానికీ, ఫాలో-అప్ సేవలను మెరుగుపరచడానికి ఆశా కార్యకర్తలకు అందిస్తున్న అదనపు ప్రోత్సాహకాలు ఎంతో సహాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
మాతాశిశు సంరక్షణ రంగంలో సాధించిన విజయాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారత్ సాధించిన ప్రగతికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మెటర్నల్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ (యూఎన్- ఎంఎంఈఐజీ) తాజా నివేదికను ఉటంకిస్తూ, 1990 నుంచి భారతదేశంలో ప్రసవ సమయాల్లో తల్లుల మరణాల రేటు గణనీయంగా 86 శాతం మేర తగ్గిందని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన సగటు తగ్గుదల (48 శాతం) కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాల రేటు తగ్గించడంలో కూడా భారత్ 79 శాతం తగ్గుదలను నమోదు చేసిందని, ఇది ప్రపంచ సగటు తగ్గుదల 61 శాతం కంటే ఎంతో మెరుగైనదని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్-ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ (యూ ఎన్- ఐజీఎంఈ) నివేదికను ప్రస్తావిస్తూ, 1990 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలో నవజాత శిశు మరణాల రేటు 70 శాతం మేర తగ్గిందని, ప్రపంచవ్యాప్తంగా నమోదైన 54 శాతం తగ్గుదలతో పోలిస్తే ఇది అత్యుత్తమ ప్రగతి అని ఆయన ప్రముఖంగా వివరించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - ఎన్ఎఫ్హెచ్ఎస్) తాజా ఫలితాల్లో వ్యక్తమైన సానుకూల మార్పులను కూడా శ్రీ నడ్డా ఈ సందర్భంగా ప్రస్తావించారు.. దేశంలో ఆసుపత్రి కాన్పులు 90.6 శాతానికి పెరిగాయని, అలాగే గర్భవతులకు ప్రసవ పూర్వ సంరక్షణ స్థాయి 95.9 శాతానికి చేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాలు దేశంలో బలోపేతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకూ, మెరుగైన సేవల లభ్యతకూ, తల్లుల ఆరోగ్యంపై కుటుంబాలలో పెరిగిన అవగాహనకు నిదర్శనాలని ఆయన కొనియాడారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కావు. సమయానుకూల సంరక్షణ, ముందస్తు జోక్యం, మన ఆరోగ్య కార్యకర్తల సమిష్టి కృషితో తల్లుల, నవజాత శిశువుల సంరక్షణకు ఇవి నిదర్శనాలు" అని ఆయన పేర్కొన్నారు.
పీఎంఎస్ఎమ్ఏ విజయవంతం కావడానికి కృషి చేసిన వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి భాగస్వాములు, ప్రైవేట్ రంగ నిపుణుల అంకితభావాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు. దేశంలోని ప్రతి గర్భవతికి తన గర్భధారణ కాలంలోనూ, ప్రసవానంతరం కూడా సకాలంలో, సులభంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చూసేందుకూ, మాతాశిశు ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత బలోపేతం చేయడానికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, భారతదేశంలో మాతృత్వ రక్షణలోనూ, మాతాశిశు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలోనూ ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక అసాధారణ ఘట్టమని అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో పీఎంఎస్ఎమ్ఏ భారత ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన ప్రజారోగ్య కార్యక్రమాలలో ఒకటిగా అవతరించిందని, దేశవ్యాప్తంగా కోట్ల మంది మహిళలు, కుటుంబాల జీవితాలను ఇది ప్రభావితం చేసిందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం వెనుక ఉన్న సంకల్పాన్ని గుర్తుచేసుకుంటూ, 2016 జూన్ లో పీఎంఎస్ఎమ్ఏ ప్రారంభమైన కొద్దిరోజులకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 జూలైలో తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో ఒక పిలుపునిచ్చారని ఆమె గుర్తుచేశారు. ఈ పథకం కింద గర్భవతులకు ఉచిత ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన వైద్యులు ప్రతి నెలా కనీసం ఒక రోజును కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారని ఆమె పేర్కొన్నారు. వైద్య సమాజం నుంచి లభించిన అపూర్వమైన స్పందన ఈ కార్యక్రమ విజయానికి ఎంతగానో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 9,000 మందికి పైగా ప్రైవేట్ వైద్యులు/ఆసుపత్రులు పీఎంఎస్ఎమ్ఏ కింద నమోదు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, ఆకాంక్షాత్మక జిల్లాలలో గర్భవతులకు నిపుణులైన వైద్యుల నుంచి ప్రసవ పూర్వ సంరక్షణ సేవలు అందుబాటులోకి రావడానికి ఇది ఎంతో సహాయపడిందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమం ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దేశంలో మాతా శిశు ఆరోగ్య సూచికలను మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం గణనీయమైన పాత్ర పోషించిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) గణాంకాల ప్రకారం భారతదేశంలో మాతృ మరణాల నిష్పత్తి 2014-16 కాలంలో ప్రతి లక్ష సజీవ జననాలకు 130 గా ఉండగా, అది 2022-24 నాటికి 87 కి తగ్గిందని, ఇది 43 పాయింట్ల తగ్గుదలను సూచిస్తోందని ఆమె వివరించారు. నవజాత శిశు మరణాల రేటు కూడా ప్రతి 1,000 సజీవ జననాలకు 24 నుంచి 18 కి తగ్గిందని, తల్లులు, నవజాత శిశువుల ప్రాణాలను కాపాడటంలో నిరంతరాయంగా సాగుతున్న ప్రగతికి ఇది అద్దం పడుతోందని ఆమె పేర్కొన్నారు.
తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాల్లో వ్యక్తమైన ప్రోత్సాహకరమైన మార్పులను కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రసవ పూర్వ సంరక్షణ పొందుతున్న తల్లుల సంఖ్య 95.9 శాతానికి పెరగగా, గర్భధారణ సమయంలో కనీసం నాలుగు సార్లు ప్రసవ పూర్వ పరీక్షలు చేయించుకున్న మహిళల శాతం 65.2 శాతానికి చేరింది. గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లో ప్రసవ పూర్వ సంరక్షణ కోసం పేరు నమోదు చేయించుకునే వారి సంఖ్య 76.2 శాతానికి మెరుగపడగా, ఆసుపత్రి కాన్పులు 90.6 శాతానికి పెరిగాయని ఆమె వివరించారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చాయని, సురక్షిత మాతృత్వంపై అవగాహన పెరిగిందని, సేవలందించే వ్యవస్థలు మరింత బలోపేతం అయ్యాయని ఈ విజయాలు స్పష్టం చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు
గత దశాబ్ద కాలంలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ సాధించిన విస్తృతి ముందెన్నడూ లేని విధంగా ఉందని శ్రీమతి శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దీని కింద 7.5 కోట్లకు పైగా ప్రసవ పూర్వ పరీక్షలు నిర్వహించగా, దాదాపు 1.2 కోట్ల మందిని అత్యంత ప్రమాదకర కేసులుగా గుర్తించారు. సకాలంలో గుర్తించడం వల్ల వారికి సరైన రెఫరల్స్, నిపుణులైన వైద్యుల జోక్యం, మెరుగైన పర్యవేక్షణ సాధ్యమయ్యాయని, తద్వారా తల్లులు, నవజాత శిశువులు ఇద్దరికీ మెరుగైన ఆరోగ్య ఫలితాలు చేకూరాయని ఆమె పేర్కొన్నారు.
విస్తృత పిఎమ్ఎస్ఎమ్ఏ వ్యూహాన్ని తీసుకురావడం వల్ల గుర్తించిన అత్యంత ప్రమాద స్థితి గర్భవతులను నిరంతరం పర్యవేక్షించడం, వారికి నిరంతరాయ వైద్య సేవలు అందించడం మరింత బలోపేతమైందని ఆమె తెలిపారు. ఈ ప్రయత్నాలకు తోడు పీఎంఎంఎస్ఏ, ఈ- పీఎంఎంఎస్ఏ కింద నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో లభించే ప్రసవ పూర్వ సంరక్షణ సేవలు, బలోపేతం చేసిన రెఫరల్ వ్యవస్థల వల్ల తల్లులు, నవజాత శిశువుల మనుగడ రేటు పెరిగిందని, ప్రసవ సమయాల్లో తలెత్తే సంక్లిష్టతలను ఎదుర్కొనే సన్నద్ధత మెరుగైందని ఆమె పేర్కొన్నారు. జననీ సురక్షా యోజన (జేఎస్వై), జననీ శిశు సురక్షా కార్యక్రమం (జేఎస్ఎస్కే), ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) వంటి ప్రతిష్ఠాత్మక మాతృ సంక్షేమ పథకాలను ప్రజలు మరింత ఎక్కువగా వినియోగించుకునేలా ఈ చర్యలు దోహదపడ్డాయని ఆమె వివరించారు.
పిఎమ్ఎస్ఎమ్ఏ విజయానికి అంకితభావంతో దోహదపడిన ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యులు, నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు, lప్రైవేట్ రంగ వాలంటీర్ల కృషిని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అభినందించారు. రాబోయే సంవత్సరాల్లో కూడా దేశవ్యాప్తంగా సురక్షితమైన మాతృత్వాన్ని పెంపొందించడంలోనూ, మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా, గర్భిణులు,వారి కుటుంబ సభ్యులు పిఎమ్ఎస్ఎమ్ఏ కింద అందుబాటులో ఉన్న తొమ్మిది రకాల ఉచిత హామీ సేవలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికీ, సకాలంలో నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ పొందవలసిన ప్రాముఖ్యతను వివరించడానికి 2026 జూన్ 9 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను చేపట్టారు.
పిఎమ్ఎస్ఎమ్ఏ పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని, దేశంలో మాతృ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంలో అది అందించిన సహకారానికి గుర్తింపుగా శ్రీ నడ్డా ప్రత్యేక రూ. 75 స్మారక నాణేన్ని రూ. 5 పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, భారతదేశానికి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ ఇవాన్ జె. ఎఫ్. హటిన్, ఎన్ హెచ్ఎమ్ అదనపు కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఆరాధన పట్నాయక్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కల్నల్ అఖిలేష్ కుమార్ పాండే, వివిధ రాష్ట్రాల చీఫ్ మెడికల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2270965)
आगंतुक पटल : 15