వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సెప్టెంబర్ 2026 తర్వాత కూడా ఆక్వాకల్చర్ ఉత్పత్తులు, తేనె, గుడ్లు,
యానిమల్ కేసింగ్స్ ఎగుమతులకు యూరోపియన్ యూనియన్ మార్కెట్ లభ్యత కొనసాగింపు
प्रविष्टि तिथि:
08 JUN 2026 5:54PM by PIB Hyderabad
భారత వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సవరించిన యూరోపియన్ యూనియన్ నియంత్రణ విధానాల ప్రకారం 2026 సెప్టెంబర్ తర్వాత కూడా యూరోపియన్ యూనియన్కు ఆక్వాకల్చర్ ఉత్పత్తులు, గుడ్లు, తేనె జంతువుల పేగుల పైపొర (యానిమల్ కేసింగ్స్) ఎగుమతి చేయడానికి అనుమతి ఉన్న దేశాల జాబితాలో భారత్ కు చోటు లభించింది.
సూక్ష్మజీవుల్లో యాంటీబయాటిక్స్ ఔషధ నిరోధకత పెరగడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో, యూరోపియన్ యూనియన్ కమిషన్ ఇంప్లిమెంటింగ్ రెగ్యులేషన్ ద్వారా తమ మునుపటి నిబంధన (ఈయూ) 2021/405 ను సవరిస్తూ (ఈయూ) 2026/1189 ను జారీ చేసింది. 2026 సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్న సవరించిన నిబంధనల ప్రకారం యూరోపియన్ యూనియన్కు నిర్దిష్ట జంతు సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు అదనపు ఆంక్షలను, నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.
అనుమతి పొందిన దేశాల జాబితాలో భారత్ కు చోటు దక్కడం వల్ల, 2026 సెప్టెంబర్ తర్వాత కూడా ఈ ఉత్పత్తుల ఎగుమతులు యూరోపియన్ యూనియన్ మార్కెట్కు నిరంతరం సాగే అవకాశం లభించింది. ముఖ్యంగా మత్స్య రంగానికి ఇది ఎంతో ప్రయోజనకరం. ప్రస్తుతం భారత్ నుంచి యూరోపియన్ యూనియన్కు ఎగుమతి అవుతున్న చేపలు, ఇతర మత్స్య ఉత్పత్తుల విలువ సుమారు 1.59 బిలియన్ అమెరికన్ డాలర్లు పైగా ఉంది.
ఎగుమతి తనిఖీ మండలి (ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్ -ఈఐసీ) తోనూ, ఇతర భాగస్వామ్య పక్షాలతోనూ కలిసి భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య విభాగం చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ సానుకూల పరిణామం సాధ్యపడింది. నియంత్రణ పరమైన నిబంధనలు, మార్కెట్ ప్రవేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి వాణిజ్య విభాగం యూరోపియన్ కమిషన్తో చురుగ్గా సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ఎగుమతి తనిఖీ మండలి యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు, పరీక్షలు ధ్రువీకరణ విధానాలను మరింత మెరుగుపరచడం ద్వారా భారత అధికారిక నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలను, ఆహార భద్రతను అత్యున్నత స్థాయిలో కొనసాగించడానికీ, కొత్త నిబంధనలను సజావుగా అమలు చేయడానికీ వీలుగా వాణిజ్య విభాగం, ఎగుమతుల తనిఖీ మండలి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ - ఎంపెడా) సహా ఇతర భాగస్వామ్య పక్షాలు యూరోపియన్ యూనియన్ గుర్తింపు పొందిన సంస్థలతోనూ, నియంత్రణ సంస్థలతోనూ కలిసి పని చేస్తున్నాయి.
సవరించిన యూరోపియన్ యూనియన్ నిబంధనల పరిధిలో భారత్కు చోటు దక్కడం వల్ల భారతీయ ఎగుమతిదారులకు ఈయూ మార్కెట్లలో నిరంతర ప్రవేశం లభించనుంది. ఇది వాణిజ్య వృద్ధికి తోడ్పడటమే కాకుండా, సంబంధిత రంగాల్లో కొత్త అవకాశాల సృష్టికి కూడా దోహదపడనుంది.
యూరోపియన్ యూనియన్తో సహా ప్రధాన భాగస్వామ్య దేశాలతో ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి, సంస్థాగత సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2270592)
आगंतुक पटल : 21