ప్రధాన మంత్రి కార్యాలయం
డామన్లో సుమారు రూ. 2,970 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులు... ప్రారంభం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఆరోగ్య సంరక్షణ, విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాల రంగాల ప్రాజెక్టుల ప్రారంభంతో డామన్ అభివృద్ధికి కొత్త ఊపు
కేంద్రపాలిత ప్రాంత ప్రజల జీవితాలను మార్చేయనున్న ప్రాజెక్టులు
భారత ఆర్థిక వ్యవస్థ పునాది ఎంత పటిష్టంగా ఉందో ఈ రోజు విడుదలైన గణాంకాలతో సుస్పష్టం
2025-26 సంవత్సరంలో 7.7 శాతం వృద్ధి రేటును సాధించిన భారత్... మార్చి 31తో ముగిసిన గత త్రైమాసికంలోనూ 7.8 శాతం వృద్ధి నమోదు
ఈ తీవ్రమైన ప్రపంచ సంక్షోభంలోనూ 140 కోట్ల మంది పౌరుల సమష్టి కృషితో భారత్ నిలదొక్కుకోవడమే కాదు... అగ్రగామిగా నిలిచేలా విజయవంతంగా పురోగమిస్తోంది
మన ప్రభుత్వం ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని స్పష్టం చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు
గతంలో దేశంలో చాలా వరకు ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగేవి కావు... ప్రస్తుతం జరిగే ప్రసవాల్లో 90 శాతానికి పైగా ఆసుపత్రుల్లోనే
మిషన్ ఇంద్రధనుష్ కారణంగా దేశంలో పిల్లల రోగనిరోధకతలో బలమైన పురోగతి
2014కి ముందు కేవలం 60 శాతం మంది పిల్లలకు మాత్రమే పూర్తిస్థాయి టీకాలు... ప్రస్తుతం దాదాపు 90 శాతానికి చేరినట్లు సూచిస్తున్న గణాంకాలు
प्रविष्टि तिथि:
05 JUN 2026 10:28PM by PIB Hyderabad
డామన్లో సుమారు రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన గత పర్యటనను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చేసిన పరిశీలన ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన మన దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. "ఇక్కడ నివసించే వివిధ ప్రాంతాల ప్రజలతో యావత్ దేశపు అందమైన దృశ్యాన్ని అందిస్తూ, మినీ ఇండియాకు సజీవ ఉదాహరణగా డామన్ నిలుస్తోంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ... డామన్, డయ్యూ, దాద్రా-నగర్ హవేలీలలో చురుగ్గా అమలవుతున్న అత్యంత సమర్థ పాలన నమూనాను ప్రధానమంత్రి ప్రశంసించారు. 'నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ, నా గత పర్యటనతో పోలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ఎన్నో మైళ్లు ముందుకు దూసుకెళ్లిందని నాకు అనిపిస్తుంది' అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ ప్రాంతానికి ఒక చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తూ... కనెక్టివిటీ, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాల రంగాల్లో అనేక పరివర్తనాత్మక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల వెనక ఉన్న అవిశ్రాంత పరిపాలనా కృషిని గుర్తించిన ఆయన... యువతకు ఆధునిక సౌకర్యాలు, నూతన అవకాశాలను కల్పించిన నాయకత్వాన్ని ప్రశంసించారు. "ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను గణనీయంగా సులభతరం చేస్తాయి. యువత కోసం విజయవంతంగా నూతన ఉపాధి మార్గాలనూ సృష్టిస్తాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ... పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ ఆధారిత సంస్కరణల అజెండానే చివరి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8 శాతం అద్భుతమైన వృద్ధికి కారణమని ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. తాజాగా వెల్లడైన ప్రోత్సాహకర జీడీపీ గణాంకాలనూ పంచుకున్నారు. "ప్రపంచ సంక్షోభం నెలకొన్న ఈ క్లిష్ట దశలోనూ, 140 కోట్ల మంది దేశవాసుల సమష్టి కృషితో భారత్ నిలదొక్కుకుంటూనే, అగ్రగామిగా నిలవడానికీ ప్రయత్నిస్తోంది" అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
దేశ మౌలిక సదుపాయాల లక్ష్యాలను ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో అనుసంధానిస్తూ... ప్రభుత్వ భవనాలన్నింటికీ పూర్తిగా సౌరశక్తితో విద్యుత్ అందించడంలో డయ్యూ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గర్వంగా ప్రస్తావించారు. వికేంద్రీకృత హరిత విద్యుత్ ఉత్పత్తి భవిష్యత్తును వివరిస్తూ... ప్రస్తుతం భారీ స్థాయిలో కొనసాగుతున్న మొక్కల పెంపకం కార్యక్రమాలు, రూఫ్టాప్ సోలార్ కార్యక్రమాలనూ ఆయన సమర్థించారు. "ఇళ్లకూ సౌరశక్తి ద్వారా విద్యుత్ అందేలా, మిగులు విద్యుత్ ద్వారా కుటుంబాలు ఆదాయం సంపాదించేలా మనం దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
స్థానిక ప్రజలు ప్రదర్శించిన అద్భుతమైన చైతన్యాన్ని ప్రశంసిస్తూ... ఈ ప్రాంతంలో జరుగుతున్న సామూహిక పరిశుభ్రత ప్రచారాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. "ప్రజల్లో పరిశుభ్రత నిజమైన స్ఫూర్తిగా ఎలా మారిందో ప్రజల చురుకైన భాగస్వామ్యం స్పష్టం చేస్తుంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి, సింగపూర్ చరిత్రాత్మక ఆర్థిక పరిణామానికి మధ్య దూరదృష్టితో కూడిన పోలికను చూపుతూ... నమో విమానాశ్రయం, ప్రతిష్ఠాత్మక డామన్గంగా వంతెన వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం స్థానిక అభివృద్ధి మాత్రమే కాదని, ప్రపంచ స్థాయిలో ప్రాముఖ్యత సాధించడానికి ఇవి సోపానాలని ఆయన స్పష్టం చేశారు. "ఇలాంటి మౌలిక సదుపాయాలన్నింటి ద్వారా, గొప్ప భావి సంకల్పాల కోసం మనం ఒక పటిష్ఠ పునాది వేస్తున్నాం" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
స్థానిక అభివృద్ధి అజెండా అందించే రవాణా సంబంధిత ప్రయోజనాలను వివరిస్తూ... విస్తరిస్తున్న వాణిజ్యం, ఆతిథ్య రంగాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు నేరుగా ఎలా దోహదపడతాయో ప్రధానమంత్రి వివరించారు. 'ట్రాన్స్పోర్ట్ నగర్ వంటి సౌకర్యాలు మన వాణిజ్యం, రవాణా రంగాలకు నిస్సందేహంగా ఒక కొత్త, శక్తిమంతమైన ఊపునిస్తాయి' అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత విస్తృత సముద్రయాన వ్యూహాన్ని వివరిస్తూ... లక్షద్వీప్లో ఏకకాలంలో జరుగుతున్న ఓడరేవుల అభివృద్ధిని ఉటంకించారు. ఈ ప్రాంత స్థానిక పురోగతి... దేశపు సమగ్ర నీలి ఆర్థిక వ్యవస్థ దార్శనికతతో విడదీయరాని బంధం కలిగి ఉందన్నారు. "అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలతో లక్ష్యం దిశగా ముందుకు సాగే ఈ ప్రయత్నాలన్నీ నీలి ఆర్థిక వ్యవస్థలో దేశ బలాన్ని గణనీయంగా పెంచుతాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన అభివృద్ధి తత్వాన్ని నిర్వచిస్తూ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, డిజిటల్ హెల్త్ మిషన్ వంటి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా అణగారిన వర్గాలు, పేదలు, గిరిజనులు, మధ్యతరగతి వారికి సంపూర్ణ ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "ఈ రోజు, అత్యంత పేదవారికీ ఆయుష్మాన్ కార్డు సౌకర్యం, 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్సకు పక్కా హామీ అందుబాటులో ఉంది" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
ఈ లక్షిత సంక్షేమ పథకాల ద్వారా కలిగిన భారీ ఆర్థిక ఉపశమనాన్ని వివరిస్తూ... సామాన్యుల కుటుంబాలకు అందిన స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలను ప్రధానమంత్రి ఉదహరించారు. 'కేవలం ఆయుష్మాన్ కార్డు, జన్ ఔషధి కేంద్రాల ద్వారానే... పేద, మధ్యతరగతి ప్రజలకు సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు విజయవంతంగా ఆదా అయ్యాయి' అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాలను గత కొరతలతో పోలుస్తూ... సిల్వస్సాలోని నమో ఆసుపత్రి కార్యాచరణ విజయాన్ని, డామన్లో దాని అనుబంధ ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని, అలాగే స్థానిక పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రారంభాన్నీ ఆయన అభినందించారు. 'ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు మరింత మెరుగైన, అత్యంత ఆధునిక ఆరోగ్య సంరక్షణల అపార ప్రయోజనాన్ని పొందుతారు' అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి లభించిన సమగ్ర సమాచారాన్ని ఉటంకిస్తూ... ఆసుపత్రిలో ప్రసవాలు, పిల్లల రోగనిరోధక టీకాల్లో వచ్చిన అద్భుత పురోగతిని ప్రధానమంత్రి గుర్తించారు. ఇది మిషన్ ఇంద్రధనుష్ వంటి కార్యక్రమాల వ్యవస్థాగత విజయాన్ని నిరూపిస్తోందని ఆయన అన్నారు. "ఈ రోజు ఆయుష్మాన్ భారత్ ఆ గణాంకాలను మౌలికంగా మార్చేసింది, ఇప్పుడు 60 శాతానికి పైగా కుటుంబాలు ఈ కీలక భద్రతను పొందుతున్నాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రభుత్వ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్కరణల వల్ల అత్యధిక లబ్ధి పొందిన వర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ... దేశంలోని మహిళల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. "ఆరోగ్య రంగంలో చిత్తశుద్ధితో కూడిన ప్రభుత్వ ప్రయత్నాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారు నిస్సందేహంగా దేశ మహిళలే" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
కేంద్రపాలిత ప్రాంతంలో విద్యా పునరుజ్జీవనం గురించి ప్రసంగిస్తూ... ఉన్నత విద్య కోసం యువత బలవంతపు వలసలు ఆగిపోవడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. స్మార్ట్ తరగతి గదులు, స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ హబ్ వేగంగా ఏర్పాటు కావడాన్నీ ఆయన అభినందించారు. "అత్యంత కీలకమైన విద్యా రంగంలో ఈ కేంద్రపాలిత ప్రాంతం క్రమంగా, బలంగా సాధిస్తున్న పురోగతిని చూడడం నాకు సంతోషంగా ఉంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న విద్యా విప్లవంలో లింగ సమానత్వం పట్ల ప్రభుత్వ అచంచల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... యువతుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్థానిక కార్యక్రమాలనూ ఆయన ప్రశంసించారు. 'సరస్వతి సైకిల్ పథకం, సరస్వతి విద్యా యోజన వంటి పథకాలు ఇక్కడి ఆడపిల్లలకు ఎంతగానో సహాయపడుతున్నాయి' అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
విద్యాసంబంధిత డిగ్రీలను ఆచరణాత్మక ప్రపంచ అవకాశాలతో సజావుగా అనుసంధానించే జాతీయ వ్యూహాన్ని వివరిస్తూ.. డ్రోన్లు, ఐటీ, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యేక విద్య ద్వారా శ్రామిక శక్తిని ఆధునికీకరించాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. "వృత్తిపరమైన రంగాల్లో లక్ష్యానికి అనుగుణంగా మన ప్రస్తుత సన్నద్ధత భారత భవిష్యత్ శ్రామిక శక్తిని ప్రాథమిక స్థాయి నుంచీ బలోపేతం చేస్తోంది" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
పద్దెనిమిదో నిఫ్ట్ క్యాంపస్ శంకుస్థాపనను, ఐటీఐ డామన్లో అధునాతన సాంకేతిక కోర్సుల ప్రారంభాన్ని ప్రకటిస్తూ... ఈ సంస్థలను ప్రపంచానికి కీలక ముఖద్వారాలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. “ఈ అగ్రశ్రేణి సంస్థ ఇక్కడి యువతకు అమూల్యమైన ప్రపంచ అనుభవాన్ని శాశ్వతంగా అందిస్తోంది” అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
దేశ క్రీడా సంస్కృతి సమూల ప్రజాస్వామ్యీకరణపై దృష్టి సారిస్తూ... మహానగర స్టేడియాల నుంచి స్థానిక మైదానాలకు విస్తరిస్తున్న ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యంగా, ప్రముఖ బీచ్ స్పోర్ట్స్ గమ్యస్థానంగా డయ్యూ ఎదుగుదలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఖేలో ఇండియా వంటి ప్రయత్నాలు మారుమూల ప్రాంతాల యువత తమ అద్భుత ప్రతిభను ప్రదర్శించడానికి సరికొత్త వేదికను అందించాయి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
భారత సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యాన్ని సద్వినియోగం చేసుకునే వ్యూహాత్మక విధానాన్ని వివరిస్తూ... ‘దేఖో అప్నా దేశ్’ వంటి ప్రచార కార్యక్రమాలు వారసత్వ, పర్యావరణ, సాహస పర్యాటక రంగాలను చురుగ్గా పునరుజ్జీవింపజేస్తున్న తీరును ప్రధానమంత్రి వివరించారు. "చిన్న ప్రదేశాలనూ అపారమైన అవకాశాలతో అనుసంధానిస్తూ పర్యాటక రంగం ద్వారా స్థానిక కళలు, సంస్కృతిని నిరంతరం ప్రోత్సహించడమే మా అంతిమ ప్రయత్నం" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లుగా పర్యాటకుల రాకపోకలు పది రెట్లు పెరిగాయని వెల్లడిస్తూ... స్థానిక బీచ్లను పరిశుభ్రంగా నిర్వహించడం, ఆధునిక సముద్రతీరాలు, వారసత్వ సముదాయాల వేగవంతమైన అభివృద్ధి వల్లే ఈ ఆర్థిక వృద్ధి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. "డామన్ నైట్ మార్కెట్, నమో పథ్ సీ-ఫ్రంట్ వంటి అనేక ప్రదేశాలు ఈ రోజు ఈ మొత్తం ప్రాంతానికి ఒక సరికొత్త గుర్తింపును చురుగ్గా అందిస్తున్నాయి" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతపు పారిశ్రామిక సామర్థ్యాన్ని, ముఖ్యంగా 'జాతీయ కృత్రిమ ఫైబర్ రాజధాని'గా దాద్రా-నగర్ హవేలీ హోదాను గుర్తించిన ప్రధానమంత్రి... పటిష్ఠ తయారీ వ్యవస్థను పెంపొందించడానికి స్థానిక ఎంఎస్ఎంఈలకు అందిస్తున్న నిరంతర ఆర్థిక సహాయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. "రాబోయే కాలంలో ఈ ప్రాంతం కచ్చితంగా తయారీ రంగానికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది" అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
సున్నితమైన పాలనను, వేగవంతమైన క్షేత్రస్థాయి పరివర్తనను ముడిపెడుతూ తన ప్రసంగాన్ని ముగించిన ప్రధానమంత్రి... అభివృద్ధి తదుపరి దశకు నాయకత్వం వహించడంలో స్థానిక యువత, రైతులు, పారిశ్రామికవేత్తలపై తనకు అచంచల విశ్వాసం ఉందన్నారు. 'మీ కలల సాకారం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు భుజం భుజం కలిపి అండగా నిలుస్తుంది' అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
***
(रिलीज़ आईडी: 2269917)
आगंतुक पटल : 5