భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో భారత తొలి 'స్కైకాస్ట్' వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
పొగమంచు రహిత, వాతావరణ అనుకూల విమానయానం... నవశకంలోకి భారత్
పైలట్లకు 'స్కైకాస్ట్' ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తూ... పొగమంచు, కుదుపుల కారణంగా జరిగే జాప్యం, దారి మళ్లింపు, విమాన రద్దును తగ్గిస్తుంది
అధునాతన సమీకృత విమానయాన వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టిన 19వ దేశంగా భారత్
జేవార్ విమానాశ్రయంలో ఏర్పాటు కానున్న తదుపరి స్కైకాస్ట్ సదుపాయం
త్వరలోనే దేశంలోని ఇతర విమానాశ్రయాలకూ విస్తరణ
'మిషన్ మౌసమ్' కింద అభివృద్ధి చేసిన స్కైకాస్ట్... సురక్షిత టేకాఫ్లు, ల్యాండింగ్ల కోసం అధునాతన వాతావరణ సాంకేతికతలను అనుసంధానిస్తుంది
3 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణ పర్యవేక్షణ కోసం రాడార్ విండ్ ప్రొఫైలర్, గ్రౌండ్-బేస్డ్ ఫాగ్ ఏరోసోల్ స్పెక్ట్రోమీటర్, లిడార్ సీలోమీటర్, ఇతర అధునాతన సెన్సార్లను ఈ వ్యవస్థ మిళితం చేస్తుంది
నాడు పోస్టు చేయడమైనది:
29 MAY 2026 4:56PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్రసాంకేతికం, భూవిజ్ఞానం (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్... ఈ రోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత తొలి "స్కైకాస్ట్ వ్యవస్థ"ను ప్రారంభించారు. భారత విమానయాన రంగంలో ఇది ఒక నూతన శకానికి నాంది అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి అధునాతన వ్యవస్థలు 18 మాత్రమే ఉన్నాయనీ, విమానయాన వాతావరణ పర్యవేక్షణ కోసం ఈ సమీకృత వాతావరణ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రపంచంలోని 19వ దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం తర్వాత, రెండో విమానాశ్రయంగా జేవార్ విమానాశ్రయంలో ఇలాంటి సదుపాయం ఏర్పాటు కానుందని తెలిపారు. త్వరలోనే దేశంలోని ఇతర విమానాశ్రయాలకూ దీనిని విస్తరిస్తామని ఆయన అన్నారు.
భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్... భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ, జీఎమ్ఆర్ సంస్థల సీనియర్ అధికారులు, విమానయాన రంగ ప్రతినిధుల సమక్షంలో న్యూఢిల్లీలోని ఐజీఐ విమానశ్రయంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. గ్లైడ్ పాత్ 10 వద్ద స్కైకాస్ట్ సిస్టమ్, ఫాగ్ అబ్జర్వేటరీ కేంద్రాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అనంతరం ఐఐటీఎమ్ శాస్త్రవేత్తలు సాంకేతిక వివరణ, ప్రదర్శనను ఇచ్చారు.
ఇలాంటి అత్యాధునిక వాతావరణ మౌలిక సదుపాయాలను సుసాధ్యం చేసే 'మిషన్ మౌసమ్' ప్రణాళిక రూపకల్పనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతే కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పైలట్లకు, విమానయాన ఆపరేటర్లకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడం ద్వారా స్కైకాస్ట్... విమానయాన భద్రతలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుందని ఆయన అన్నారు.
పొగమంచు, కుదుపుల వల్ల విమాన ప్రయాణాలకు కలిగే అంతరాయాలు గణనీయంగా తగ్గే భవిష్యత్తును ప్రయాణికులు ఆశించవచ్చని కేంద్ర మంత్రి అన్నారు. ఈ వ్యవస్థ విమాన సిబ్బందికి, పైలట్లకు సుమారు మూడు గంటల స్వల్ప వ్యవధిలోనే ముందస్తు హెచ్చరికలు అందిస్తుందనీ, తద్వారా వారు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి సమయాన్ని నిర్ణయించుకోవడంతో పాటు అనవసరమైన దారి మళ్లింపులు, రద్దులు, ఆలస్యాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.
పొగమంచు పర్యవేక్షణ, గాలిలో కుదుపులను గుర్తించడం, అధిక ప్రభావం చూపే వాతావరణ సూచనల కోసం బహుళ వాతావరణ పరిశీలన సాంకేతికతలను మిళితం చేయడం ద్వారా స్కైకాస్ట్ భారత విమానయాన చరిత్రలో ఒక అతిపెద్ద విజయంగా నిలుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సమగ్రమైన తాజా వాతావరణ సమాచారాన్ని అందించడానికి రాడార్ విండ్ ప్రొఫైలర్, సోడార్, మైక్రోవేవ్ రేడియోమీటర్, గ్రౌండ్-బేస్డ్ ఫాగ్ ఏరోసోల్ స్పెక్ట్రోమీటర్ (జీఎఫ్ఏఎస్), సీఎల్61 లిడార్-ఆధారిత సీలోమీటర్ వంటి అత్యాధునిక వాతావరణ రిమోట్ సెన్సింగ్ సాంకేతికతలను ఈ వ్యవస్థ అనుసంధానిస్తుంది. ఈ సదుపాయం రన్వేల వ్యాప్తంగా పర్యవేక్షణను, హెచ్చరిక సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు... టేకాఫ్లు, ల్యాండింగ్లను మరింత సురక్షితం చేస్తుందని ఆయన అన్నారు.
ఒక అధునాతన బౌండరీ లేయర్ రాడార్ విండ్ ప్రొఫైలర్ స్కైకాస్ట్లో ప్రధాన భాగంగా ఉంటుందనీ, ఇది విమానాశ్రయానికి దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలి వేగం, గాలి దిశ, కుదుపులు, నిలువు దిశలో వేగం, బౌండరీ-లేయర్ డైనమిక్స్ను నిరంతరం కొలుస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. విమానాలు కిందికి దిగేటప్పుడు, ల్యాండింగ్ చేసేటప్పుడు ఈ అంశాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి. కచ్చితమైన వాతావరణ సమాచారం భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
స్కైకాస్ట్ సదుపాయంలో గ్రౌండ్-బేస్డ్ ఫాగ్ ఏరోసోల్ స్పెక్ట్రోమీటర్ (జీఎఫ్ఏఎస్) వంటి అధునాతన పొగమంచు పర్యవేక్షణ పరికరాలు ఉన్నాయి. ఇది పొగమంచు బిందువులు, ఏరోసోల్స్, ఏరోసోల్-పొగమంచు పరస్పర చర్యలపై వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఢిల్లీ వంటి నగరాలకు ఇది చాలా ముఖ్యమనీ, అక్కడ కాలుష్య కణాలు పొగమంచుతో చర్య జరిపి దృశ్యమాన పరిస్థితులను ప్రభావితం చేస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఈ వ్యవస్థలో సీఎల్61 లిడార్ ఆధారిత సీలోమీటర్నూ అనుసంధానించారు. ఇది పొగమంచు వర్టికల్ స్ట్రక్చర్ను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇది పొగమంచు ఏర్పడటం, దృశ్యమానత తగ్గుదల, విమానయాన కార్యకలాపాలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
పొగమంచు, ఏరోసోల్స్, కుదుపులు, తేమ, దృశ్యమానత, వాతావరణ పరిస్థితులకు సంబంధించి తాజా వివరాలను స్కైకాస్ట్ కచ్చితమైన సమాచారంతో ఒకే అధునాతన విమానయాన వాతావరణ నిఘా విధానంలో ఏకీకృతం చేస్తుంది. ఈ వ్యవస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు, విమాన ట్రాఫిక్ నిర్వహణ ఏజెన్సీలకు కచ్చితమైన నౌకాస్టింగ్, ముందస్తు హెచ్చరిక సేవలతో మద్దతునిస్తుంది.
2015లో ఐజీఐ విమానాశ్రయంలో భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీఎం, ఐఎండీ సంయుక్తంగా ప్రారంభించిన శీతాకాలపు పొగమంచు ప్రయోగం (వైఫెక్స్) ఈ స్కైకాస్ట్ వ్యవస్థకు శాస్త్రీయ పునాది. వైఫెక్స్ వ్యవస్థ పొగమంచు ఏర్పడటం, ఏరోసోల్-మేఘాల పరస్పర చర్యలు, దృశ్యమానత తగ్గింపు, అర్బన్ బౌండరీ-లేయర్ ప్రక్రియలపై కీలకమైన అవగాహనను కల్పించింది. ఇది ఈ తదుపరి తరం కార్యాచరణ వ్యవస్థ అభివృద్ధికి దోహదపడింది.
శాస్త్రీయ ఆవిష్కరణలు, అధునాతన వాతావరణ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ "పొగమంచు రహిత విమానాల" శకం వైపు పయనిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయానాన్ని "హవాయి చప్పల్ నుంచి హవాయి జహాజ్" స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ... విమానయాన రంగానికీ, పౌరులకూ ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ ఇప్పుడు వాతావరణ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చే దిశగానూ పురోగమిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.
భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ మాట్లాడుతూ... స్కైకాస్ట్ కేంద్రం విమానయాన కార్యకలాపాలకు మద్దతునివ్వడమే కాకుండా, భారత మొత్తం వాతావరణ అంచనా సామర్థ్యాలనూ బలోపేతం చేస్తుందన్నారు. ఇటువంటి అధునాతన పరికరాల ద్వారా ఉత్పత్తయ్యే గాలి, తేమ, ఉష్ణోగ్రతల వర్టికల్ ప్రొఫైల్స్ భవిష్యత్ వాతావరణ అంచనాలను మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. వాతావరణ వ్యవస్థలను మరింత మెరుగ్గా పర్యవేక్షించేందుకు గానూ మిషన్ మౌసమ్ కింద డాప్లర్ వెదర్ రాడార్లు, ఇలాంటి వ్యవస్థలు సహా అధునాతన పరిశీలన నెట్వర్క్లనూ భారత్ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇలాంటి కేంద్రాలు మరింత నాణ్యమైన వాతావరణ సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయనీ, ఇది రాబోయే సంవత్సరాల్లో వాతావరణ అంచనా కచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని డాక్టర్ రవిచంద్రన్ అన్నారు. ఈ సాంకేతికతలను విమానాశ్రయాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరింత ఎక్కువగా విస్తరించి... వాతావరణ అంచనా సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి విమాన ఆధారిత పరిశీలనలనూ దానికి అనుసంధానిస్తారని ఆయన పేర్కొన్నారు.
విమానయాన రంగంతో పాటు... అధునాతన వాతావరణ సూచన నమూనాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయ సహాయక వ్యవస్థలు, పట్టణ వాతావరణ సూచన, కాలుష్య నిర్వహణ, రవాణా సలహాలు, విపత్తు సంసిద్ధతా కార్యక్రమాలకూ స్కైకాస్ట్ పరిశీలనలు మద్దతునిస్తాయి.
మిషన్ మౌసమ్ కింద రూపొందించిన స్కైకాస్ట్ సిస్టమ్... వాతావరణ-స్మార్ట్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, విమానయాన సామర్థ్యాల బలోపేతం, శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన సేవలను అందించడం పట్ల భారత్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2266843)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11