ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్)లోని రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో రింగ్ గాంట్రీ-ఆధారిత లీనియర్ యాక్సిలరేటర్ను మే 25, 2026న రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ప్రారంభించారు. ఆర్మీ ఆస్పత్రిలో (ఆర్ అండ్ ఆర్)లో క్యాన్సర్ సేవలను ఈ అధునాతన సాంకేతికత బలోపేతం చేస్తుంది. సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు అధునాతన రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆస్పత్రిలోని రోగుల సంఖ్యకు అనుగుణంగా ఇది అంతర్గత చికిత్సా సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, ఇంటెన్సిటీ-మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, ఇమేజ్-గైడెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియోసర్జరీ వంటి అత్యాధునిక రేడియో థెరపీ విధానాలను అందించగల సామర్థ్యం ఈ లీనియర్ యాక్సిలరేటర్కు ఉంది. ఇది క్యాన్సర్ గడ్డలున్న భాగాలకు అత్యంత ఖచ్చితత్వంతో రేడియేషన్ను అందిస్తూనే, దాని చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలపై ప్రభావం పడకుండా చూస్తుంది. తద్వారా రోగులకు మెరుగైన చికిత్సను, అత్యుత్తమ సంరక్షణను అందించటంలో సహాయపడుతుంది.
సాయుధ దళాల వైద్య సేవల(ఏఎఫ్ఎంఎస్) పరిధిలో ఆధునిక క్యాన్సర్ చికిత్సా పరికరం.. లీనియర్ యాక్సిలరేటర్ను కొనుగోలు చేశారు. పనిచేయని పాత పరికరానికి బదులుగా ఈ కొత్త పరికరాన్ని తీసుకొచ్చారు.
ఏఎఫ్ఎంఎస్లో దీన్ని చేర్చటం... ఆంకాలజీ సేవల ఆధునీకరణ దిశగా ముందడుగు. ఏఎఫ్ఎంఎస్ పరిధిలోని ఇతర ఆంకాలజీ కేంద్రాలను కూడా దశలవారీగా ఆధునీకరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డీజీ ఏఎఫ్ఎంఎస్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్, ఆర్మీ ఆస్పత్రి (ఆర్ అండ్ ఆర్) కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ అవినాశ్ దాస్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.